ట్రబుల్ షూటర్కే ట్రబుల్స్ తెచ్చిపెట్టింది హుజురాబాద్ ఉప ఎన్నిక. గతంలో ఎన్నడూ ఇలాంటి గడ్డు పరిస్థితులు, మానసికంగా ఇబ్బందులు పడుండడు హరీశ్. ఆయనంటే చాలా మంది రాజకీయాలకు అతీతంగా ఇష్టపడతారు. ఉన్నంతలో హుందాగా ఉంటాడు. ఆపదలో ఉన్న వారికి ఏదో మేలు చేయాలనే తలంపు ఉన్నోడు. మాట, మర్యాద మంచిగుంటది. అహంకారం ఏదో రేర్ సందర్భంలో తప్ప ఎక్కడా కనిపించనీయడు. అందరివాడులా ఉండాలనుకుంటాడు. ఉండేందుకు ప్రయత్నిస్తాడు.
కేసీఆర్కు హరీశ్ మీద గురి. ఏ పని అప్పజెప్పినా.. సక్సెస్ చేసుకుని వస్తాడని. అలాగే ఇచ్చాడు హుజురాబాద్ ఇన్చార్జి బాధ్యతలు. కానీ ఈ ఎన్నిక హరీశ్ను మూడు చెరువుల నీళ్లు తాగిస్తున్నది. పరువు, పరపతి గంగలో కలుపుతున్నది. అప్పటి వరకు కష్టపడి సంపాదించుకున్న పేరు కాస్తా పోయి అబద్దాల కోరుగా ముద్రవేసే పరిస్థితిని తెచ్చిపెట్టింది. అక్కడ ఎలాంటి దుస్సంఘటన జరిగినా.. అది హరీశే చేయించాడని సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం చేసి.. బద్నాం చేసి బజారుకు గుంజే కార్యక్రమాలు జోరుగా సాగుతున్నాయి. పాపం.. హరీశ్. ఎలా ఉండేవాడు. ఎలా అయిపోయాడు. ఈ హుజురాబాద్ ఫలితాలు ఎలా ఉంటాయో గానీ.. హరీశ్కు ఇది జీవన్మరణ సమస్యై కూర్చుంది. సరే.. ఇదంతా ఎందుకు చెప్పడమంటే… .
నిరోషా అనే అమ్మాయి ఉద్యోగాల గురించి, నిరుద్యోగ భృతి గురించి అడిగితే.. పోలీసులు ఇష్టమొచ్చినట్టు మాట్లాడి కొట్టారంట. ఇది హరీశే చేయించాడని ఆ అమ్మాయి ఆరోపణ. ఇది వైరల్ అయ్యింది. రాజకీయ రంగు పులుముకున్నది. రేవంత్రెడ్డి కూడా ఎంటర్ అయ్యాడు. ఆ అమ్మాయికి అండగా ఉంటానని, దీనిపై పోరాడుదామని, ఫిర్యాదు చేద్దామని మద్దతుగా నిలిచాడు. ఇదీ సంగతి. అక్కడ ఈటల రాజేందర్, హరీశ్రావులు పోటీ చేస్తున్నట్టుగా ఉన్నది. తెర వెనుక కేసీఆర్ ముల్లు కర్రతో హరీశ్ను పొడుస్తూఉంటాడు. ఇక్కడ హరీశ్ పడరాని పాట్లు పడుతూ ఉంటాడు. ఇలా బద్నాం అవుతాడు. పరువును పణంగా కూడా పెడతాడు. మరి ఫలితాలైనా అనుకూలంగా వస్తాయా..? కులం చెడ్డా సుఖం దక్కినట్టు..
