తెలంగాణ రాజకీయాల్లో తిట్ల పురాణం కొత్త ట్రెండ్ మొదలైంది. ఎవరెంత ఎక్కువగా , ఘాటుగా తిడితే ఆ పార్టీకి అంత మైలేజీ వచ్చినట్టు లెక్క. ఆ బూతులు తిట్టిన లీడర్లు అంతా ఫేమస్ అవుతున్నట్టు భావించాలి. ఇప్పుడు ఈ కొత్త సంస్కృతి మొదలైంది. దీనికి అంకురం వేసింది బీజేపీయే. నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ ఈ కొత్త ట్రెండ్తో నూతన శకాన్ని ప్రారంభించి.. అప్రతిహాతంగా ముందుకు దూసుకెళ్తున్నాడు. అర్వింద్ వేషభాషలు ఆది నుంచే ప్రత్యేకమే. నోటికొచ్చినట్టు తిడతాడు. తనకేమనిపిస్తే అది చెప్పేస్తాడు. వార్నింగ్ ఇస్తాడు. సవాల్ విసురుతాడు. ఏది చేసినా.. అర్వింద్ వాడే భాష.. పరుషంగానే ఉంటుంది. తిట్ల రూపంలోనే ఉంటాయి. కించపరిచే విధంగానే సాగుతాయి. వెక్కించిన చందంగానే మాటలుంటాయి. విమర్శలు కూడా వ్యంగ్యంగా.. కయ్యానికి కాలు దువ్వినట్టుగా ఉంటాయి. అదే అతన్ని ఓ ప్రత్యేక స్థానంలో కూర్చోబెట్టిందంటే అతిశయోక్తి కాదేమో.
ప్రజలు అలా ఎంజాయ్ చేస్తున్నారు మరి. అవే డైలాగులు కోరుకుంటున్నారు మరి. ఇక రేవంత్రెడ్డి కూడా ఇలాంటి భాషను ఇప్పుడు విరివిరిగా వాడుతున్నాడు. ఫైర్ బ్రాండ్గా పేరు పడాలంటే బూతులు మాట్లాడాలె కాబోలు. అదే పంథాను ఎంచుకున్నాడు రేవంత్. పీసీసీ చీఫ్ అయిన తర్వాత ఆ భాష పదును పెరిగింది. బూతులకు వాడి కొమ్ములొచ్చాయి. అవి మరింత వేడిగా ఉన్నాయి. అలా మాట్లాడితే తప్ప నాలుగు ఓట్లు రాలవని రేవంత్ డిసైడయ్యాడు. ఇంకా పదును పెంచి .. ఆఖరికి అండర్వేర్ దగ్గర దాకా వచ్చి ఆగాడు. మొన్న అర్వింద్ను తిడుతు… సోనియా ఏమైనా అంటే బిడ్డ నీకు మర్యాదుండదు అనే లెవల్లో వార్నింగ్ ఇచ్చి.. నీవు వేసుకున్న అండర్వేర్ దగ్గర నుంచి కాంగ్రెస్ పార్టీ సంపాదనే అన్నాడు. తల్లిపాల ఊసు కూడా తీశాడు. ఇప్పుడు దీనికి అర్వింద్ కౌంటర్ ఇచ్చాడు. సెప్టెక్ట్యాంక్ అని రేవంత్కు పేరు పెట్టాడు. అర్వింద్ చెప్పినట్టు ఇలా మాట్లాడేవారిని సెప్టిక్ ట్యాంక్ అని పిలవాలంటే…అర్వింద్ మొదలుకొని చాలా మంది వస్తారు. ఈ మధ్య లిస్టు పెరుగుతున్నది. ఎందుకంటే మంత్రుల దగ్గర నుంచీ ఈ జాబితాలో చేరేందుకు ఉవ్విళ్లూరుతున్నారు.
ఇక భాష మార్చుకోమని అర్వింద్.. రేవంత్కు హితవు పలికాడు. నవ్వొచ్చింది. ఏకంగా సీఎంను బద్దలు భాషింగాలు చేస్తా అని పచ్చిబూతు మాట్లాడిన అర్వింద్… రేవంత్కు నీతి సూక్తులు చెప్తున్నాడు. అంటే అర్వింద్ పై కాకుండా ఎవరిపైనైనా మాట్లాడుకో.. కానీ నేను నేర్పిన విద్య నా మీదే ప్రయోగిస్తావా? అని అనుకోవాలా? ఒక్కవేలు అటు చూపితే నాలుగు వేళ్లూ నిన్నే చూపుతున్నాయి అర్వింద్. ఇక డీఎస్ గురించి మాట్లాడుతూ.. ఆయనను పార్టీ వద్దన్నదట. వెళ్లగొట్టిందట. కానీ రేవంత్ .. టీడీపీ పని ఖతమైందని బయటకు వచ్చి వేరే పార్టీలో చేరాడని అన్నాడు. డీఎస్ను వెళ్లగొట్టడమేందీ? ఎమ్మెల్సీ ఇవ్వలేదని, ఓ పదవి కోసమే కదా అన్ని రోజులు పెంచి పోషించి అంతటివాడిని చేసిన కాంగ్రెస్ను కాదని,.. కేసీఆర్ ఆఫర్ ఇచ్చాడని వచ్చి టీఆరెస్లో చేరింది. ఏదో సమర్థించుకుందామనుకుంటే.. అవి మనలోపాలనే ఎత్తి చూపుతాయి.. ఎందుకొచ్చిన గొడవ సైలెంటుగా ఉంటే కాదూ..!
రేవంత్ పార్టీలు మారింది నిజమే. ఊసరవెళ్లి మాటలు మాట్లాడుతున్నదీ నిజమే. అంతే అది అవసరం. అదే కదా నేటి రాజకీయం. ఎవరి అవసరాలు వారివి. ఏమన్నా చెబుతారు. ప్రజలు వింటూనే ఉంటారు. గొర్రెల్లా తలలూపుతూనే ఉంటారు. ఒక్కటి నువ్వన్నట్టు…. బీజేపీలోనే ఉంటా.. లేదంటే రాజకీయాల నుంచి తప్పుకుంటా.. అన్నావు కదా. అదీ సూపర్. అలా ఉండటం ఎవరి వల్లా కాదు. రాజకీయ నాయకులు అలా ఉండరు. చాలా కొద్ది మందే ఉంటారు.