వాస్తవం ప్రతినిధి – హైదరాబాద్:
అన్నీ చిన్న చిన్న సమస్యలే. రెవెన్యూ శాఖ మంత్రి తలుచుకుంటే చిటెకెల అయిపోయే పనులు. సర్కార్ పై రుపాయి భారం పడని డిమాండ్లు. ఇవన్నీ ఏ సర్కార్ ఉన్నా రూల్స్ ప్రకారం సకాలంలో చేయాల్సినవే. కానీ కాంగ్రెస్ సర్కార్ వచ్చి ఏడాదిన్నర కాలమైనా కాలయాపనే చేస్తూ వస్తున్నది. వందలసార్లు మంత్రిని కలిశారు. నేడు రేపు , రేపు మాపు అనే ఆన్సరే తప్ప.. పని మాత్రం కాలేదు. దీంతో తీవ్ర ఒత్తిడికి లోనైన రెవెన్యూ ఉద్యోగులు ఆందోళన బాట పట్టారు. నిరసన చేపట్టారు. తెలంగాణ రెవెన్యూ ఉద్యోగుల సర్వీసెస్ అసోసియేషన్ ( ట్రెసా) ఆధ్వర్యంలో బుధవారం ఆందోళనకు దిగారు. ఏడాదిన్నరగా పెండింగ్లో ఉన్న చిన్న చిన్న 9 పెండింగ్ సమస్యల పరిష్కారం కోసం నిరసన గళం వినిపించారు. సర్కార్కు వారం రోజుల గడువిచ్చారు.
ఆలోగా వీటినన్నింటినీ పరిష్కరించాలని డిమాండ్ చేశారు. లేదంటే ఆందోళన తీవ్రతరం చేయాల్సిన పరిస్థితులు ఉత్పన్నమవుతాయని కూడా పేర్కొన్నారు. ఈ మేరకు ట్రెస్ అధ్యక్ష, కార్యదర్శులు వంగా రవీందర్ రెడ్డి, గౌతమ్ కుమార్ ఇతర కార్యవర్గం, జిల్లాల అధ్యక్షులతో కలిసి సీసీఎల్ఏ సెక్రటరీకి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా వంగా రవీందర్రెడ్డి మాట్లాడుతూ.. ఎన్నికలలో జరిగిన తహాసీల్దార్ల బదిలీల విషయంలో పూర్తి స్థాయి తిరుగుబదిలీలు (రీపాట్రియేషన్) వెంటనే చేపట్టాలన్నారు. వీరిని ఏడాదిన్నరగా కుటుంబాలకు దూరం చేయడంతో కామారెడ్డిలో ఓ తహసీల్దార్ ఆత్మహత్య కూడా చేసుకున్న విషయాన్ని గుర్తు చేశారు. సొంత జిల్లాతో సహా ఎలాంటి నిబంధనలు పాటించకుండా పూర్వ జిల్లాలకు అందరినీ తిరుగుబదిలీ చేయాలని కోరారు.
ఎన్నికల విధుల్లో భాగంగా బదిలీ చేసిన 26 మంది డిప్యూటీ తహసీల్దార్లను పూర్వ జిల్లాలకు బదిలీ చేయాలని, జీవో 317లో భాగంగా ఇతర జిల్లాలకు బదిలీ అయిన అన్ని కేడర్ల సిబ్బందిని స్థానికత ఆధారంగా వారి పూర్వ జిల్లాలకు బదిలీ చేయాలన్నారు. ప్రమోషన్ల సమయంలో జూనియర్ అసిస్టెంట్లు, సీనియర్ అసిస్టెంట్లు, నాయబ్ తహసీల్దార్లను, తహసీల్దార్లను సొంత జిల్లాలకు ఇతర జిల్లాలకు బదిలీ చేశారని, వారిని కూడా సొంత జిల్లాలకు బదిలీ చేయాలని కోరారు. గతంలో ఇతర శాఖలకు బదిలీ చేసిన 5400 మంది వీఆర్వోలను వారి అనుభవాన్ని ప్రాతిపదికగా తీసుకుని పూర్తి స్థాయిలో మాతృశాఖకు తీసుకోవాలన్నారు. గత నాలుగేళ్లుగా మరణించిన వీఆర్వో కుటుంబాల కారుణ్య నియామకాలను వెంటనే పూర్తి చేయాలని కోరారు. 61 ఏళ్లు దాటిన వీఆర్వోల రెగ్యులరేషన్ ప్రక్రియ పెండింగ్లో ఉందని, వీరితో పాటు 55 నుంచి 61 ఏళ్ల వీఆర్వోల విషయంలో వారి వారసులకు అవకాశం ఇవ్వాలన్నారు.
రెగ్యులరైజేషన్లో భాగంగా ఇతర జిల్లాలకు బదిలీ చేసిన వీఆర్వోలను , ఆఫీస్ సబార్డినేట్లను, రికార్డ్ అసిస్టెంట్లను, జూనియర్ అసిస్టెంట్లను వారి సొంత జిల్లాలకు బదిలీ చేయాలని కోరారు. వివిధ పేర్లతో రెవెన్యూ శాఖలో పనిచేస్తున్న కంప్యూటర్ ఆపరేటర్లను ఒకే గొడుగు కిందకు తీసుకొచ్చి హెచ్ ఆర్ పాలసీ అమలు చేయాలని, వారికి నెల నెలా వేతనాలు చెల్లించాలని, వారి సర్వీసులను రెగ్యులరైజ్ చేయాలని కోరారు.