వాస్తవం ప్రతినిధి – హైదరాబాద్:
వీఆర్వోల హక్కుల సాధనలో భాగంగానే హైకోర్టును ఆశ్రయించాల్సి వచ్చిందని, ప్రభుత్వానికి మేం వ్యతిరేకం కాదని, భూ భారతి చట్టాన్ని అమలు చేసే కీలక బాధ్యతలను తమ భుజస్కంధాలపై వేసుకుంటామని వీఆర్వోల జేఏసీ చైర్మన్ గోల్కొండ సతీష్ అన్నారు. ఈ మేరకు ఆయన శుక్రవారం మీడియాతో మాట్లాడారు.
ఏ ప్రభుత్వాలైతే గ్రామ రెవెన్యూ వ్యవస్థను రద్దు చేయాలనుకున్నారో రద్దుచేసి కనుమరుగైపోయాయన్నారు. మరల అధికారంలోకి రాలేకపోయారని గుర్తు చేశారు. భూమి సేవ చేసే గ్రామస్థాయి ఉద్యోగుల కన్నీళ్లు తుడిచేందుకు ఆవిర్భవించిన కాంగ్రెస్ ప్రభుత్వంలో సీఎం రేవంత్ రెడ్డి సారధ్యంలో భూభారతి చట్టాన్ని సంపూర్ణంగా అమలు చేసే దిశగా రెవెన్యూ శాఖలో పనిచేసే ఉద్యోగులు బాధ్యత తీసుకుంటారన్నారు.
రాష్ట్ర అభివృద్ధి జరగాలంటే రెవెన్యూ శాఖ యొక్క అభివృద్ధి జరగాలని, అలాంటప్పుడు రాష్ట్ర అభివృద్ధి సుసాధ్యమవుతుందని అభిప్రాయపడ్డారు.రాష్ట్ర ప్రభుత్వం రద్దయిన వీఆర్వోల గత సర్వీసును పరిగణలోకి తీసుకొని అతి ముఖ్యంగా అనుభవాన్ని పరిగణములోకు తీసుకొని జీవో నెంబర్ 121 వ్యవస్థను రద్దు చేయాలన్నారు. రద్దయిన ప్రతి ఒక్క విఆర్ఓ ను ఎలాంటి షరతులు లేకుండా గతంలో ఉన్నటువంటి హక్కులన్నీ కల్పిస్తూ గ్రామస్థాయిలో నియమించాలని కోరారు.