www.vastavam.in

హైదరాబాద్‌ ప్రెస్‌ క్లబ్‌(హెచ్‌పీసీ) పాలకవర్గం ఎన్నికలపై తీవ్ర గందరగోళం నెలకొంది. పదవీ కాలం ముగిసినప్పటికీ కుర్చీలు వీడకపోవడం ఒకటైతే… కొత్తగా ఎన్నికల నిర్వహించకుండా మరికొంత కాలం కొనసాగే ఎత్తుడగ కొనసాగుతున్నట్లు ఇప్పుడు జర్నలిస్టు వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. హెచ్‌పీసీలో సభ్యులకు ఏనాడూ పెద్దగా గౌరవం దక్కకపోగా… పాలకవర్గానికి మాత్రం రాజభోగాలకు అంతుండదు. బహుశా ఇందుకేనేమో క్రమం తప్పకుండా నిర్వహించాల్సిన ఎన్నికలకు బ్రేకులు వేస్తూ ఆధిపత్యాన్ని చలాయిస్తున్నారు.

హెచ్‌పీసీకి 2022 మార్చి 19న ఎన్నికలు జరిగాయి. రెండేళ్ల పాటు కొనసాగాల్సిన ఈ పాలకవర్గం… గడువు ముగిసి ఆర్నెళ్లు కావస్తున్నా ఇంకా అధికారం కొనసాగిస్తూనే ఉంది. కోర్టు కేసును సాకుగా చూపి మూడు నెలలు అధికారాన్ని పొడిగించుకున్నప్పటికీ… ఇప్పుడు మరో మూడు నెలలు ఎలాంటి కారణం లేకుండానే సాగిస్తున్నారు.
ఇతరులకు చెప్పందుకే నీతులు…
హెచ్‌పీసీలో సభ్యత్వ నమోదు ఒక అభూత కల్పన. పాలకవర్గంలో ఏళ్లుగా పాతుకుపోయిన వ్యక్తులకు నచ్చితేనే ఇందులో సభ్యత్వం. నిబంధనలు వర్తించకున్నా ఇట్టే సభ్యత్వాన్ని పొందొచ్చు. ఇక అన్నిరకాల అర్హతలున్న కొందరికి సంవత్సరాలు గడుస్తున్నా సభ్యత్వం దక్కే అవకాశం దొరకదు. నచ్చిన వారికి సభ్యత్వం ఇచ్చుకోవడం… వారిని మచ్చిక చేసుకుని పాలకవర్గంలోకి మళ్లీ మళ్లీ రావడం కొత్తేమి కాదు. వాస్తవానికి రాష్ట్ర విభజన తర్వాత హెచ్‌పీసీలో ఆంధ్రా పెత్తనం తగ్గుతుందని జర్నలిస్టులు ఆశపడ్డప్పటికీ… ఇప్పటికీ వాళ్లదే పెద్ద పాత్రగా మారింది. మెంబర్లు కూడా మా సంస్థకు చెందినవారే ఎక్కువ ఉన్నారంటూ ఆధిపత్య ధోరణని కొనసాగిస్తూ వస్తున్నారు.

హెచ్‌పీసీ అధ్యక్షుడిగా ఉన్న వ్యక్తి ఇప్పుడు హైడ్రా పీఆర్వోగా కొనసాగుతుండగా… కార్యదర్శిగా ఉన్న వ్యక్తి జేఎన్‌జే హౌసింగ్‌ సొసైటీలో ఉపాధ్యక్షుడిగా కొనసాగుతున్నాడు. రోజువారీ పనిలో బిజీగా ఉండే వాళ్లు హెచ్‌పీసీ అభివృద్ధి ఏవిధంగా సమయం కేటాయిస్తారనేది ఇప్పుడు సభ్యుల మదిని తొలచివేస్తున్న ప్రశ్న.
ప్రస్తుతం పాలకవర్గ సభ్యులుగా కొనసాగుతున్న వాళ్లే తిరగి అవకాశం దక్కించుకునేందుకు హెచ్‌పీసీ నిబంధనలు మారుస్తున్నారనేది ఇప్పుడు జర్నలిస్టుల్లో హాట్‌ టాపిక్‌గా మారింది.