ఒక్కసారిగా ఈడీ నోటీసుల కలకలం. అప్పటి వరకు వివిధ కార్యక్రమాలలో బిజీబిజీగా ఉన్న కవితకు మళ్లీ ఈడీ నోటీసు ఇచ్చిందని, రేపే హాజరుకావాలంటూ వచ్చిన సమాచారం వైరల్ అయ్యింది. ఓ వైపు ఆమె మంత్రి తలసాని, బాజిరెడ్డి, బిగాల గణేశ్గుప్తాలతో కలిసి సమావేశాలు, శంఖుస్థాపనల్లో పాల్గొంటున్నారు. మరోవైపు ఈ వార్త కార్యకర్తలు, నాయకుల్లో చక్కర్లు కొడుతోంది. ఓ రకమైన ఆందోళన వారందరి ముఖాల్లో. కానీ ఆమె అదేమీ పట్టనట్టుగా తనపని తాను చేసుకుంటూ పోతున్నది. దీనిపై కవిత వివరణ కోరేందుకు జాతీయ మీడియా సైతం వాలింది. ఆమె వెంటనే ప్రెస్మీట్ అరేంజ్ చేపించింది. యథావిధిగా ఆరోజు కార్యక్రమాలు, డెవలప్మెంట్ యాక్టివిటీస్పై చెప్పుకుంటూ పోయారు. ఇక జాతీయ మీడియా ప్రశ్నల దాడి కొనసాగింది. వాటన్నింటికీ ఆమె ఓపిగ్గా తనదైన శైలిలో సమాధానమిచ్చింది.
అందులోనే ఓ సందేశం కూడా ఇమిడి ఉంది. అదేమంటే… ఎవరూ ఏమీ దిగులు పడొద్దు. టేక్ ఇట్ ఈజీ. దీని గురించి టెన్షన్ తీసుకోవద్దని. ఆమె పిలుపులో ఉన్న ధైర్యవచనాల మాదిరిగానే ఈ నోటీసులను ఆమె ఎంతో లైట్ తీసుకున్నది. ఎంత లైట్ గా అంటే.. ప్రెస్మీట్ ముగిసిన వెంటనే మంత్రి ప్రశాంత్రెడ్డి, అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేశ్ గుప్తాలతో కలిసి వెంటనే కలెక్టరేట్కు వెళ్లి కలెక్టర్ రాజీవ్గాంధీ హనుమంతుతో సమీక్ష నిర్వహించేంత. నగరాభివృద్ధిపై ఆమె సుధీర్ఘంగా కలెక్టర్తో చర్చించారు. డిచ్పల్లి, ఆర్మూర్ వద్ద స్వాగత తోరణాల ఏర్పాటు, కుల సంఘాల భవనాల నిర్మాణాలకు అనువైన స్థలాల సేకరణ, తాజాగా మరో రూ. 60 కోట్ల నిధులు విడుదలైన క్రమంలో వాటిని ఎలా వినియోగించుకుంటున్నాం..? ఎక్కడెక్కడ అభివృద్ధి చేస్తున్నాం..? లాంటి సమాచారం కలెక్టర్ ఇవ్వడం.. ఆర్అండ్బీ శాఖకు సంబంధించిన రోడ్ల పై సమీక్ష… ఇలా ఆమె రెండు గంటలకు పైగా కలెక్టర్ మీటింగులో బిజీబిజీగా గడిపారు. ఎక్కడా ఆందోళన కనిపించలేదు. కలవరపాటు లేదు. అదే ధీమా. కార్యకర్తలకు భరోసా ఇచ్చేలా..! నేనున్నా… ఏం కాదు… భయపడకండి..!! అని ధైర్యం నూరిపోసేలా.