57 ఏళ్ళు నిండిన వారికి ఆసరా పెన్షన్లు….సొంత జాగా కలిగిఉన్న వారికి రూ. మూడు లక్షల ఆర్ధిక సహాయం

– మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి

నిజామాబాద్,భీంగల్:
ప్రజలకు చేసిన వాగ్దానం మేరకు 57 సంవత్సరాల వయస్సు నిండిన వారందరికీ త్వరలోనే ఆసరా పెన్షన్లు అందజేయడం జరుగుతుందని , సొంత జాగా కలిగిఉన్న వారికి ఇంటి నిర్మాణం కోసం ప్రభుత్వం మూడు లక్షల రూపాయల ఆర్ధిక సహాయం అందజేయనుందని రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి పేర్కొన్నారు. మరో రెండు మాసాల్లోపే ఇవి అమలులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయని మంత్రి భరోసా కల్పించారు. ఇప్పటికే పెన్షన్లను అమలు చేయాల్సి ఉన్నప్పటికీ, కరోనా తీవ్రత కారణంగా ప్రభుత్వానికి ఆదాయం సమకూరకపోవడంతో కొంత జాప్యం జరిగిందన్నారు. ప్రస్తుతం కొత్త వారికి పెన్షన్లు, ఇంటి నిర్మాణానికి ఆర్ధిక సహాయం అందించేందుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేసిందన్నారు. ఈ విషయంలో ప్రజలు ఎలాంటి అనుమానాలకు గురి కావాల్సిన అవసరం లేదన్నారు.

నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గం భీంగల్ మండలం బడాభీంగల్,గోనుగొప్పుల మధ్య భోగారపు వాగుపై 2.6 కోట్ల అంచనా వ్యయంతో హైలెవల్ బ్రిడ్జి, మర్రికాడి ఒర్రే మీద 1.13 కోట్ల అంచనా వ్యయంతో మరో బ్రిడ్జ్, సికింద్రాపూర్ వయా గోనుగొప్పుల, ముచ్కూర్ వరకు 3 కోట్ల వ్యయంతో బి. టి రోడ్డు 4 కోట్లతో రెండు బ్రిడ్జి లు,బడా భీంగల్ లో కోటి రూపాయల వ్యయంతో బి. టి రోడ్డు
ఇలా సుమారు 12 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో చేపడుతున్న నిర్మాణాలకు మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి శనివారం శంకుస్థాపనలు చేశారు.

ఈ సందర్భంగా మంత్రి వేముల మాట్లాడుతూ, గడిచిన 60 ఏళ్లలో సాధ్యం కానీ ప్రగతిని, కేవలం ఏడేళ్ల పాలనలో తెలంగాణ ప్రభుత్వం ఆచరణలో అమలు చేసి చూపించిందన్నారు. సాగు రంగానికి ప్రభుత్వం ఇతోధికంగా తోడ్పాటును అందించిన ఫలితంగా వ్యవసాయ భూముల ధరలు నాలుగింతలు పెరిగాయన్నారు. 2014 లో ఐదు లక్షల రూపాయలకు ఎకరం ఉన్న భూమి ధర ప్రస్తుతం పాతిక లక్షల పైచిలుకు ధర పెరిగిందని వివరించారు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం తాగునీటి సరఫరా, పరిశుభ్రత, పచ్చదనం, విద్యుత్ సరఫరా, వైకుంఠధామాలు, సిసి రోడ్లు, డ్రైనేజీలు వంటి అంశాలను ప్రాతిపదికన తీసుకొని దేశవ్యాప్తంగా 10 ఉత్తమ గ్రామాలను ఎంపిక చేసిందన్నారు. అందులో పదికి పది గ్రామాలు తెలంగాణలోవే ఎంపికయ్యాయని, ఈ సర్వేతో అన్ని అంశాల్లోనూ తెలంగాణ దేశంలోనే నెంబర్ వన్ రాష్ట్రంగా వెలుగొందుతున్నట్లు వెల్లడైందన్నారు. ఇదంతా ప్రజల ఆశీర్వాదంతోనే సాధ్యమైదని మంత్రి కృతజ్ఞతలు తెలిపారు. అభివృద్ధిని గమనించి తమ ప్రభుత్వానికి అండగా నిలువాలని ప్రజలను కోరారు. ఇంకనూ చేపట్టాల్సిన ప్రగతి పనులు అనేకం ఉన్నాయన్నారు.

You missed