ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థుల పేర్లను ఈ రోజు టీఆరెస్ అధిష్టానం ప్రకటించనుంది.అయితే టీ న్యూస్లో బ్రేకింగ్ న్యూస్ ఒకటి దీనికి సంబంధించి చక్కర్లు కొడుతున్నది. పార్టీ ముఖ్య నేతలతో సీఎం కేసీఆర్ భేటీ అయ్యాడని, అభ్యర్థుల పేర్లపై చర్చిస్తున్నాడని, కసరత్తు చేస్తున్నాడని, సమాలోచనలు జరుపుతున్నాడని, సాయంత్రం వరకు కొలిక్కి వస్తుందని బ్రేకింగుల మీద బ్రేకింగులు వేస్తున్నాడు. ఇది చూసి ఓ టీఆరెస్ నేత ఫోన్ చేశాడు.
ఈ టీ న్యూసోడు ఎవరి చెవిలో పువ్వులు పెడుతున్నాడబ్బా..! కేసీఆర్ ఇప్పుడు అభ్యర్థులపై కసరత్తు చేస్తున్నాడా..? అంటే అంత పిచ్చోళ్ల లెక్క కనబడుతున్నామా? ఈ పేర్లు ఎప్పుడో ఫైనల్ అయిపోయాయి. కేసీఆర్ ఎవరికివ్వాలనేది ముందే డిసైడ్ చేసుకున్నాడు. ఎవరి అభిప్రాయాలతో, ఏకాభిప్రాయాలతో, సలహాలు సూచనలతో ఆయనకు పనిలేదు. తనకు నచ్చినవారికి అప్పటి ఆలోచనల మేరకు ఎవరికివ్వాలో వారికిచ్చేస్తాడు. ఆ లిస్టు కూడా ఐదారు రోజుల ముందే ఫైనల్ అయిపోయింది. సోషల్ మీడియాలో లీకులు కూడా వదిలారు.
కానీ ఇప్పుడు మాత్రం టీ న్యూస్.. రేపు నామినేషన్లు వేసే వరకు కూడా దీనిపై ఎడతెగని చర్చలు జరుగుతున్నట్టు.. ముఖ్య నేతలతో సీఎం సమావేశమైన చర్చిస్తున్నట్టు బ్రేకింగులు వేస్తున్నాడు. సరే, పాపం టీ న్యూసోడి సొంత పైత్యమేమీ కాదది. పైన అధిష్టానం వేయమంటే వేస్తారు.. అంతే. వాళ్లనని ఏం లాభం చెప్పు. కానీ చాలా మంది టీఆరెసోళ్లు అధికారిక న్యూస్ కోసం టీ న్యూస్నే చూస్తారు.
ఇలా చివరి వరకు లాగి లాగి.. చెవిలో పువ్వులు పెట్టే క్రమంలో ఇంకా ఆలస్యం చేస్తేనే పాపం వాళ్లకూ మండుతుంది. చెప్పేవాడికి చూసేవాడు లోకువ.. అని ఆ మంటను ఎక్కడా బయట పెట్టలేక లోపల దాచుకుని లోలోపల మండిపోతున్నారు.