చిన్నప్పటి నుంచి పగతో రగిలిపోతున్నాడు. అదును కోసం చూశాడు. ఓ పక్కా స్కెచ్ వేసి సొంత పెదనాన్న కొడుకులిద్దరిని కడతేర్చాడో తమ్ముడు. నిజామాబాద్ జిల్లా బోధన్లో ఈ దారుణం చోటు చేసుకున్నది. బోధన్ పట్టణంలోని బెల్లాల్ చెరువులో ఇద్దరు అన్నదమ్ములు శవాలై తేలడంతో పోలీసులు విచారణ చేపట్టగా సైకో తమ్ముడి దారుణం బయట పడింది.
చిన వెంకట్ అనే యువకుడు తన పెదనాన్న కొడుకులైన శివ (28), నర్సింలు (32) అన్నదమ్ముల పై పగబట్టాడు. తన తండ్రిని ఈ కుటుంబం చంపిదనే ప్రగాఢంగా నమ్ముతూ వచ్చాడు. మనసులో కసీ, పగ పెంచుకుంటు పెరిగాడు. ఈ కుటుంబం పై కక్ష తీర్చుకునేందుకు సమయం కోసం వేచి చూస్తున్నాడు. రెండ్రోజుల క్రితం శివను వెంకట్ అకారణంగా కొట్టాడు. ఆ విషయాన్ని శివ తన అన్న నర్సింలుకు చెప్పాడు. చిన వెంకట్ను నర్సింలు మందలించాడు. దీంతో ఇంకా పగతో రగిలిపోయిన చిన వెంకట్ వీరిద్ధరిని మర్డర్ చేసేందుకు ప్లాన్ రచించాడు.
బోధన్ పట్టణంలోని శివారు ప్రాంతంలోకి తీసుకువెళ్లి కల్లు తాగించాడు. ఆ తర్వాత చీఫ్ లిక్కర్ కొనుగోలు చేసి ఇద్దరు అన్నదమ్ములకు పూటుగా తాగించాడు సైకో తమ్ముడు. ఆ తర్వాత శివను సమీపంలోని బెల్లాల్ చెరువు అలుగు వద్దకు తీసుకువెళ్లి అక్కడ నీటిని చూపించే సాకుతో గుంతలోకి నూకేశాడు. శివకు ఈతరాదని తెలుసు. దీంతో గుంత లోతుగా ఉండడంతో ఊపిరాడక శివ మరణించాడు. అక్కడి నుంచి నర్సింలు దగ్గరకు వెళ్లి శివ నీటిలో మునిగిపోయాడని తీసుకువచ్చాడు. నర్సింలుకూ ఈత రాదు. ఈ విషయమూ ముందే తెలుసు.
ఓ ప్లానింగ్ ప్రకారం తమ్ముడిని కాపాడే నెపంతో నర్సింలును కూడా నీటిలోకి దింపాడు. నర్సింలు కూడా ఊపిరాడక చనిపోయాడు. తనకు ఏమీ తెలియనట్లుగానే సైకో చిన వెంకట్ ఇంటికి వెళ్లిపోయాడు. వీరిద్దరు కనిపించడం లేదని అందిన ఫిర్యాదు మేరకు.. శివారు చెరువు ప్రాంతంలో ఈ ఇద్దరి డెడ్బాడీలు దొరికిన కేసుతో తీగలాగగా చిన వెంకట్ దారుణం బయట పడింది. బోధన్ పోలీసులు మర్డర్ కేసు నమోదు చేశారు.