నిజామాబాద్ జిల్లా కేంద్రం నాల్గో టౌన్ పరిధిలో లక్షన్నర రూపాయలు కలిగిన బ్యాగును ఎత్తుకెళ్లిన బిచ్చగత్తెను 24 గంటలు గడిచినా పోలీసులు పట్టుకోలేకపోయారు. పెర్కిట్ గ్రామానికి చెందిన గంగామోహన్ కూతురి పెళ్లి ఈ నెల 25న నిశ్చయమైంది. పెళ్లి షాపింగ్ కోసం ఇద్దరు కూతుళ్లతో ద్విచక్ర వాహనం పై గురువారం ఒంటి గంట ప్రాంతంలో నగరంలోని జిల్లా కోర్టు చౌరస్తాకు చేరుకున్నారు.
సింధ్ షాపింగ్ మాల్కు వెళ్లారు. అక్కడికి వెళ్లి చూసుకోగా.. డబ్బులు కలిగిన బ్యాగు లేకపోవడంతో సిగ్నల్ వద్ద పడిపోయినట్లుగా అనుమానంతో అక్కడికి వెళ్లి విచారించగా.. ఓ బిచ్చగత్తె చేతిలో బ్యాగును చూసినట్లు స్థానికులు తెలిపారు. పోలీసులు స్థానిక సీసీ కెమెరా పుటేజ్ను పరిశీలించగా బిచ్చగత్తె బ్యాగును తీసుకువెళ్లినట్లు నిర్ధారించుకున్నారు. ఈ సంఘటన జరిగి 24 గంటలు గడుస్తున్నా.. పోలీసుల వద్ద సీసీ పుటేజ్ ఆధారం ఉన్నా ఏమీ చేయలేకపోయారు.
బిచ్చగత్తెకు సంబధించిన ఎటువంటి ఆధారాలు తెలుసుకోకపోవడం పోలీసుల అసమర్థతకు అద్దం పడుతున్నది. నిజామాబాద్ కమిషనరేట్ పరిధిలో నిఘా వ్యవస్థ నేరాల కంట్రోలింగ్లో ఉన్నాయని తెలుపుతున్న కమిషనర్ పలుకులు ఉత్తుత్తి మాటలేనని తేలిపోయింది. నిజామాబాద్ నడిబొడ్డున సీసీ కెమెరాల నిఘాలో దొరికిన ఓ సాధారణ బిచ్చగత్తెను కూడా పట్టుకోలేని పోలీసులు కొమ్ములు తిరిగిన నేరగాళ్లను పట్టుకనేందుకు ఎన్ని రోజులు తీసుకుంటారోనని విమర్శలు వెల్లువెత్తున్నాయి. పెళ్లికి తెచ్చిన డబ్బులు బిచ్చగత్తె పాలయయ్యాయని బాధితులు లబోదిబోమంటున్నారు.