టీఆరెస్ ఉద్యమ పార్టీ కావొచ్చు. కానీ అడ్మినిస్ట్రేషన్ తెలియదు. ఇది చాలా సార్ల రూడీ అయ్యింది. ఏదో చేయాలనుకుని ఏదో చేస్తుంటుంది. క్లారిటీ ఉండదు. కొన్ని ప్రయోగాలు ఫలిస్తాయి. కొన్ని వికటిస్తాయి. అంతే.. కానీ అందరితో చర్చించి ఓ నిర్ణయం తీసుకుందామనే ఆలోచన రాదు. అందరినీ అడగటం అంటే నామోషీ.
మనకు పాలన తెలియదా.. ? అని సమర్థింపు. రైతు రాజ్యం, రైతు ప్రభుత్వం మాది.. మేం చేసినట్టు ఏ ప్రభుత్వాలు చేయడం లేదు… రైతుబంధు, రైతుబీమా మేమే ఇస్తున్నామని చెప్పుకుంటారు. దేశానికే అన్నపూర్ణ అని కూడా గొప్పలు చెబుతారు. కాళేశ్వరంతో వరి విస్తీర్ణం పెరిగింది. ధాన్యాం మోసేందుకు లారీలు కూడా సరిపోవడం లేదు. హమాలీలు పక్క రాష్ట్రాలనుంచి వస్తున్నారని కూడా చెప్పుకుంటారు. యాసంగిలో మాత్రం వరేస్తే ఉరే.. అని బెదిరిస్తారు. వేస్తే మాకు తెలియదు మీ చావు మీరు చావండని ఏకంగా మంత్రే ప్రకటన ఇస్తాడు. మీ చావు మీరు చావండి కాదు.. వరి రైతు రేపు రోడ్డెక్కితే మీరు చావాల్సి వస్తుందనే విషయం పాపం మన వాళ్లకు ఇంకా తెలియడం లేదు. ఓ వైపు వానాకాలం సీజన్ వడ్లు కొనేందుకు దిక్కు లేదు. కడ్తా పేరుతో దోపిడి. అడిగే వాడు లేదు. టోకెన్ సిస్టమ్ అంటూ పడిగాపులు. ఓ రైతు గుండెపోటుతో చనిపోతే ఆ అపప్రద ప్రభుత్వానికి రాదా..?
వరి వద్దు అనే విషయంలో సీఎం కేసీఆర్ క్లారిటీ ఇవ్వలేక చేతులెత్తేశాడు. వ్యవసాయ మంత్రి నిరంజన్ రెడ్డితోమాట్లాడించేశాడు. ఆ మంత్రి ఏం మాట్లాడుతాడో ఆయనకే తెలియదు. పత్తి వేసుకోమని సలహా ఇస్తాడు. అంతకు ముందు వద్దన్నది వీరే. మొక్కజొన్న వేస్తే కొనమంటున్నారు. సన్నాలు వేసుకోండని సలహా ఇచ్చారు. పండించిన తర్వాత కొనేదిక్కులేదు. ఆరుతడి పంటలున్నారు. మేం కొంటాం..మేమున్నామనే భరోసా లేదు. మొత్తానికి యాసంగిలో వరి,మక్కలు వేస్తే మాత్రం మాకు సంబంధం లేదు… మీ ఇష్టం. మీ చావు మీరు చావండనే రేంజ్లో ప్రభుత్వం వార్నింగ్ ఇచ్చిందంటే.. పరిస్థితి ఎంత మేర చేయి దాటి పోయందో అర్థమవుతుంది.
మంత్రి ఇలా మాట్లాడితే.. బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్.. ఎలా కొనరు.. వరి వేసుకోండి.. మేమున్నాం.. అని సినిమా డైలాగుల్లా తొడలు చరుచుకుంటూ మాట్లాడటం తప్పితే రైతులకు భరోసా ఇచ్చే మాటలు కావవి. కేంద్రం కోర్టులో బంతి ఉంది. కేంద్రం వల్లే ఇదంతా.. అని టీఆరెస్ చెబుతూనే ఉంది. అక్కడ్నుంచి మీరిచ్చే హామీ ఏందీ.? భరోసా ఏందదీ..? ఏమి ఉండదు. అక్కడ మాట్లాడేంత దమ్ము, ధైర్యం వీరికుండదు. వరి వేస్తే.. అదికొనకపోతే.. రోడ్డెక్కి ధర్నా చేస్తాం.. బీజేపీకి మైలేజీ వస్తుంది.. నాలుగు ఓట్లు రాలతాయనే యావే తప్ప.. నిజంగా రైతు గోస మీకు తెలుసా.. పట్టింపు ఉందా..? బండి సంజయ్ ఊకదంపుడు ఉపన్యాసాన్ని, డైలాగులను రైతులు ఎవరూ నమ్మే పరిస్థితుల్లో లేరు. ఒక్కటి మాత్రం క్లారిటీ.. ఈ రెండు పార్టీలు కలిసి రైతుల నడ్డి విరవడం ఖాయం. తిలాపాపం తలా పిడికెడు అన్నటు.. ఈ విషయంలో ఈ రెండూ తోడుదొంగలే. దోషులే.