(దండుగుల శ్రీనివాస్)
సేమ్ టు సేమ్ సీన్. అప్పుడు కేసీఆర్కు ఇదే పరిస్థితి. ఇప్పడది రేవంత్ ఎదుర్కొంటున్నాడు. సోషల్ మీడియాను తక్కువ చేసి చూశారు కేసీఆర్, కేటీఆర్. మెయిన్ మీడియాను చేతిలో పెట్టుకున్నారు. అవన్నీ తమ కాంపాండ్లోని పెంపుడు కుక్కల్లాగే ప్రవర్తించాయి. అప్పుడు రేవంత్కు స్వచ్చంధంగా సపోర్టు చేశాయి సోషల్ మీడియా హ్యాండిల్స్. కేసీఆర్ మీద కోపంతో. కేటీఆర్ అహంకారంపై ధిక్కార స్వరంతో. ఎహె పోరా మీతో ఏమవుతుంది..? అనుకున్నారిద్దరు. అనుకున్నదే జరిగింది. ఎన్నికల్లో బీఆరెస్ ఓడింది. కాంగ్రెస్ గెలిచింది. ఓటమి తరువాత కేటీఆర్, కేసీఆర్ ఇద్దరూ తేరుకున్నారు.
సోషల్ మీడియానే లోకంగా బతుకుతున్నారు. కేసీఆర్ ఫామ్హౌజ్లో ఉండి రోజూ చేసిది ఇదే. సోషల్ మీడియాలో సర్కార్ను ఎవరెవరు ఎలా తిడుతున్నారు..? ఎవరేం అనుకుంటున్నారు..? మనవాళ్లతో ఎలా ఇంకా తిట్టించాలి..? ఇదే పని. కేటీఆర్ దీని కోసం నెలకు కోట్లు వెచ్చించి ఓ సైన్యాన్నే నడిస్తున్నాడు. విచిత్రంగా రేవంత్ ఇప్పుడు అదే సోషల్ మీడియాను తుక్కుతుక్కు తిడుతున్నాడు. అసెంబ్లీలోనైతే ఏకంగా బట్టలిప్పి కొట్టేదాకా పోయాడు. అప్పుడు కాపాడిన సోషల్ మీడియా ఇప్పుడు రేవంత్ మెడలో పామై కరుస్తున్నది. ఎవరు చేసుకున్నారిదంతా. తనదాకా వస్తే గగ్గోలు పెట్టే రేవంత్… అప్పుడు తనకు సపోర్టు చేసినప్పుడు మాత్రం కిక్కురుమనలేదు.
అధికారం మనదే కదా. మెయిన్ మీడియా అంతా తన పాటే పాడుతున్నది కదా అని తలెగరేసుకుంటున్నాడు. సేమ్ సేమ్ కేసీఆర్, కేటీఆర్ లెక్కనే. కానీ రేవంత్ మాత్రం తనూ సోషల్ మీడియాను సమర్థవంతంగా నడపాలనే సోయి లేదు. అంత సీన్ కూడా అక్కడ లేదు. ఎందుకంటే ఆ సర్కార్లో ఎవరేం చేస్తున్నారో ఆయనకే తెలియదు. ఎవరి వల్ల ఎలా రోజుకింత పార్టీ, ప్రభుత్వం డ్యామేజీ అవుతుందోననే భయంతో ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉండిపోయాడు. ఇలా వేదికలనెక్కినప్పుడు విషం చిమ్ముతున్నారు.. చూసుకుందాం..! జనాలే చూసుకుంటారంటూ వేదాంతాలు పలుకుతున్నాడు. కానీ జనానికి ఏమేం చెప్పాలో ఎలా చెప్పాలో ఇక్కడ సమర్థవంతంగా కేటీఆర్ చేసి చూపిస్తున్నాడు. సోషల్ మీడియాలో సినిమా చూపిస్తున్నాడు.
