వాస్తవం ప్రత్యేక ప్రతినిధి- హైదరాబాద్:
తెలంగాణ రైజింగ్ -2047 అనే గొప్ప వాగ్దానమొకటి సర్కార్ తీసుకున్నది. దీని కోసం ఇప్పట్నుంచే తండ్లాట షురూ అయ్యింది. సీఎం రేవంత్రెడ్డి విజన్గా దీన్ని చెప్పుకోవచ్చు. ఎవరు సీఎంగా ఉన్న వారికంటూ ఓ ప్రత్యేకతను నిలుపుకోవాలని చూస్తారు. ఇప్పుడు రేవంత్ వంతు. తనకు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని, జనామోద పాలన అందించడంతో పాటు.. ఎప్పటికీ గుర్తుండిపోయేలా కీలక నిర్ణయాలు, పథకాల అమలుతో జనం మనసు చూరగొనే ప్రయత్నం ఆయన శక్తి వంచన లేకుండా చేస్తున్నారు. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ -2025 కోసం నగరం ముస్తాబైంది. హైదరాబాద్ ఎదురుచూస్తోంది. ప్రపంచ దేశాలను ఆహ్వానిస్తోంది. అందరినీ ఏకతాటిపైకి తెస్తోంది. దీనికి ఆద్యుడిగా నిలిచాడు సీఎం రేవంత్రెడ్డి.
తెలంగాణ రైజింగ్-2047 అనే గొప్ప వాగ్దానంతో ముందుకు సాగుతున్న రేవంత్రెడ్డి.. దీని కోసం అహర్నిషలు శ్రమిస్తున్నాడు. ప్రతి ఇంటికి వెలుగు, ప్రతి పిల్లవాడికి పుస్తకాలు, ప్రతి యువకుడికి ఉద్యోగం, ప్రతి పెద్దవాడికి గౌరవం, సంరక్షణ… ఇవే ఇప్పుడు సీఎం ప్రయార్టీ అంశాలు. ప్రతి గ్రామంలో ఆట మైదానాలు, పెద్ద స్టేడియమ్లు – అక్కడ మన పిల్లలు భారత్ని గర్వపడేలా చేసేందుకు ఊతమిచ్చేలా చేయాలనుకుంటున్నాడు. చెరువులు, పార్కులు, చెట్లు, శుభ్రమైన నదులు – ఫ్యాక్టరీలు, అడవులు సమాంతరంగా పెరుగుతాయి. అదే స్థాయిలో విస్తరించి, అభివృద్ధికి ఆలవాలంగా నిలుస్తాయి. ఇదే రేవంత్ తారక మంత్రంగా చెప్పుకుంటున్నారు.
ప్రధాని మోడీతో పాటు.. వ్యతిరేక పార్టీలను, రైతుల్ని, విద్యార్థుల్ని, మహిళల్ని – అందరినీ పిలిచి “రండి, మన తెలంగాణని కలిసి కడదాం” అని పిలుపునివ్వడం అందరినీ ఆకట్టుకుంటున్నది. గొడవలు కాదు, నిర్మాణం మాత్రమే…నని నినాదమిస్తున్నాడు. అందుకే సీఎంను దేశమంతా ఈ రోజు మెచ్చుకుంటోంది. అందరినీ ఒక్కటి చేసినందుకు ప్రపంచంలోని పెద్ద కంపెనీలు ఇక్కడికి వస్తున్నాయి. “చైనా తర్వాత తెలంగాణే కావాలి” అంటున్నాయి. రేవంత్ రెడ్డి వల్ల తెలంగాణ ..భారత్కి పెద్ద ఫ్యాక్టరీ అవుతుందనే కల నిజం కాబోయే రోజు దగ్గరలోనే ఉంది. హైదరాబాద్ త్వరలో సంతోషంతో నిద్రపోయే నగరంగా మార్చాలని, అందరినీ నవ్వుతో ఆహ్వానించే నగరంగా తీర్చి దిద్దాలని ఆయన సంకల్పం.. ఇదే విధానాన్ని తెలంగాణ దేశానికి చూపిస్తున్నది.
