(దండుగుల శ్రీనివాస్)
మొన్నటికి మొన్న వరంగల్ సభ వేదికగా తన పార్టీ సోషల్ మీడియా వారియర్స్నుద్దేశించి ఏమన్నాడు. మీరేం భయపడకండి.. మనకు లీగల్ టీం ఉంది. మీకు రక్షణగా ఉంటాం. మీరు ప్రశ్నిస్తూనే ఉండండి.. పోలీసుల్లారా ఖబడ్దార్. మీ డైరీల్లో రాసుకోండి. వచ్చేది మేమే.. అని చెప్పుకొచ్చాడు. దీంతో ఆ పార్టీ సోషల్ మీడియా వారియర్స్ మరింత రెచ్చిపోవడానికి దోహదపడ్డాడు కేసీఆర్. అసలు కేసీఆర్ మెయిన్ స్ట్రీమ్ మీడియాను వదిలేశాడు. ఓడినంక ఈయన గురించి పట్టించుకోవడమూ వారు వదిలేశారు. షరా మామూలుగా. అలవాటైన ధోరణిలో.
నమస్తే తెలంగాణ వేదికగా ప్రశ్నించొచ్చు కదా. దాన్ని నమ్మేదెవరు..? సీఎంగా ఉన్న సమయం నుంచే కేసీఆర్కు సోషల్ మీడియా మీద ఆసక్తి ఉంది. బాగా గమనించేవాడు. రాజకీయాల గురించి జనాలు ఏమనుకుంటున్నారో తెలుసుకోవడానికి ఉత్సాహం చూపేవాడు. సమయం కూడా కేటాయించేవాడు. కానీ లోపాలు తెలుసుకోలేకపోయాడు. తప్పులు సరిదిద్దుకోలేక ఏవేవో వ్యూహాలు పన్ని చివరకు చిత్తుగా ఓడిపోయాడు. ఇప్పుడు మరింత కాన్సన్ ట్రేట్ చేశాడు. ఇక రోజంతా ఇదే పని. ఎవరెంతగా సర్కార్ను, సీఎంను తిడితే అంత మెచ్చుకోలు. ఫోన్ చేసి మరీ భుజం తట్టడం మొదలుపెట్టింది. వరంగల్ సభలో ఇక రాస్కోరా సాంబా.. అనడంతో పాటు ఇక కాస్కోరా సర్కార్ అనే రేంజ్లో వారియర్స్ను ఎగదోశాడు.
ఇప్పుడు చెప్పొచ్చేదది కాదు. ఇవాళ సోషల్ మీడియాలో ఓ కాంగ్రెస్ కార్యకర్త కేసీఆర్ను తాగుబోతుగా చిత్రీకరిస్తూ ఓ ఫోటో పెట్టాడు. 25 ఏండ్లుగా నువ్వు సాధించింది ఇదా.. ? అంటూ కేసీఆర్ చెప్పీ చేయనవి కొన్ని ఉటంకించాడు. రాత వరకు బాగానే ఉంది. కానీ ఆ బొమ్మే హద్దులు దాటింది. సేమ్ రేవంత్ రెడ్డికి కూడా ఇది తప్పడం లేదు. అంటే ప్రశ్నించడమంటే ఇలాగే ఉంటుందా..? నిలదీతకు నిర్వచనం మారిపోయిందా..? ఈ రెండు పార్టీలు సోషల్ మీడియా వేదికగా చేసుకుంటున్న బాడీ షేమింగ్, హద్దులు మీరి చిత్రాల మార్పింగ్.. ఎలాంటి ప్రశ్నించడమో వీరికే తెలియాలి. పరిస్థితి చూస్తే ఈ మూడేండ్లు ఇది మరింత హద్దులు మీరి, మర్యాద మరిచి బరిబాతల దుమ్మెత్తిపోసుకునే దాకా వచ్చేలా ఉంది పరిస్థితి. సైబర్ క్రైమ్కు చేతి నిండా పని. ప్రతిపక్షంలో ఉన్న మీరే రెచ్చిపోతే.. మాది అధికార పక్షం మేం ఎంత రెచ్చిపోవాలి..? ఇదీ ఇప్పుడు వీరిద్దరి మధ్య అనారోగ్య, అసభ్యకర పోటీ వాతావరణం.