(దండుగుల శ్రీనివాస్)
ఫ్రీబస్సు పెట్టి లాభం ఏందీ…? ఆడోళ్లు జుట్టు జుట్టు పట్టుకుని కొట్లాడుకునేందుకా..? ఇవే మాటలన్నడు కేసీఆర్. కేటీఆర్ కూడా ఇందుకు మినహాయింపు కాదు. మరీ వల్గర్ కామెంట్లు చేసి చెంపలేసుకున్నాడు. ఇదీ అయ్యాకొడుకులకు ఈ ఫ్రీబస్సు పథకం మీద ఉన్న అవగాహన. పెరగని జీవన ప్రమాణాలు. పెరిగిన ఖర్చులు. బతుకు మరింత భారంగా గడుస్తున్న రోజులివి. కేసీఆర్, రేవంత్ పాపాల హామీల పాలసీలో జనాలు చిత్తయిపోయారు. ఫ్యామిలీ బడ్జెట్ తలకిందులైంది. అప్పులు పెరిగాయి. కానీ ఈ ఫ్రీ బస్సు పుణ్యమా అని బడ్జెట్లో వారికి కొంత ఊరట. అవును.. ఎక్కడికన్నా వెళ్లాలంటే వెంటనే ఆర్టీసీ ఉంది కదా.
రూపాయి లేకున్నా పోయి రావొచ్చనే ధీమా వారిలో ఉంది. బస్సులు చాలీచాలకుండా ఉండొచ్చు. ఆడోళ్లకే సీట్లు సరిపోకపోయి ఉండొచ్చు. కానీ మగవాళ్లకు, ఆడవాళ్లకు బడ్జెట్లో ఇది కొండంత అండ. అవును. ఆ పేద ఫ్యామిలీలకు ఊపిరి. వీరికే కాదు.. అన్ని వ్యతిరేకతలు, అసంతృప్తులు మూటగట్టుకున్న రేవంత్ సర్కార్కూ ఊపిరే. దీన్ని కించపరిస్తూ మాట్లాడాడు కేసీఆర్. తనంతల తానుగా గోతిలో పడ్డాడు. రేపు మళ్లీ ఎలక్షన్లో ఇక ఈ హామీ బీఆరెస్ మానిఫెస్టోలో ఉండదన్నమాట. ఉండకపోతే తిప్పలు తప్పువు కేసీఆర్కు. ఇక రెండో ముచ్చట. సన్నబియ్యం పథకం. రేవంత్ సర్కార్ వేల కోట్లు పెట్టి రుణమాఫీ చేసినా రాని మైలేజీ ఈ ఒక్క చిన్న పథకంతో వచ్చింది.
అవును పేదోడు సన్నబియ్యానికే భారీగా బడ్జెట్ కేటాయించాల్సి వస్తోంది. కిలో రూ. 50 నుంచి రూ. 70 వరకు కిలో సన్నిబియ్యం కొనే దుస్థితి ఉంది. రేషన్లో దొడ్డు బియ్యం తీసుకున్నా కిలోకు 15 రూపాయల చొప్పున అమ్మేసుకుంటున్నాడు తప్పితే వాటిని తినడం లేదు. రేవంత్ సర్కార్కు ఆదిలోనే ఎన్నో కష్టాలు. ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు. వేల కోట్లు పథకాలకు పెడుతున్నా మైలేజీ రావడం లేదు. పైగా జనాల నుంచి తిట్లు అదనం.
ఈ సమయంలో వారికి కలిసివచ్చింది సన్నబియ్యం పథకం. ఇక రేషన్ షాపుల్లో వచ్చే సన్నబియ్యం అంతా తింటారు. అమ్ముకోరు. నూకలు బాగా ఉన్నయి… అన్నం మెత్తగా అవుతోంది.. ఇవన్నీ చిన్న చిన్న లోపాలే.పెద్ద ప్రభావం మాత్రం ఫ్రీగా సన్నబియ్యం ఇస్తున్నారు. భేష్ అనే. ఇవి రెండే ఇప్పుడు కాంగ్రెస్ కు ఊపిరి పోస్తున్నాయి. వీటిని కాదని కేసీఆర్ ముందుకు పోలేడు. పోతే ఆ అహంకారం దెబ్బతీస్తుంది. తన అనుభవం పల్టీ కొట్టిస్తుంది. ఇది గ్యారెంటీ.