(దండుగుల శ్రీనివాస్)
కలెక్లర్లమని మరుస్తారు. సాష్టాంగ నమస్కారం చేస్తారు. ఐఏఎస్లనే సోయుండదు. సర్కార్ చేసిన చర్యలు బాగాలేవని బాహాటంగానే కరుస్తారు. ఈ రెండూ చేసేది వీళ్లే. తెలంగాణ ఐఏఎస్ల తీరే వేరయా అన్నట్టుగా తయారయ్యింది. ఈ ట్రెండ్ తెలంగాణ వచ్చినంకనే ఎక్కువయ్యిందని వేరే చెప్పాల్నా…? కాంగ్రెస్ సర్కార్లో స్వేఛ్చ ఎక్కువంటారు. ఎవరేమీ మాట్లాడతారో తెలియదు. ఎవరేం చేస్తారో తెలియదు. అది సర్కార్కు డ్యామేజీయా, మైలేజీయా సోయుండదు. అచ్చం అలాగే ఉంది మన ఐఏఎస్ల తీరు. కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు కాళ్లుమొక్కి వార్తలకెక్కారు. ఇప్పుడు రేవంత్ సీఎంగా ఉన్నప్పుడు ఫక్తు బీఆరెస్ కార్యకర్తలాగా నడుచుకుంటుండ్రు.
కాంగ్రెస్ సర్కార్ను లైట్గా తీసుకున్నట్టున్నది స్మిత. ఇదంతా కేసీఆర్ మెప్పుకోసమేనని వేరే చెప్పాలా..? అప్పుడు కాళ్లుమొక్కి ఇజ్జత్ తీసిండ్రు కొందరు. ఇప్పుడు కావాలని గెలుక్కుని తగుదునమ్మా అని పంచాయతీలు పెట్టుకుని ఏదో విధంగా వైరల్ కావాలని చూస్తున్నరు ఇంకొందరు. అప్పుడూ ఇప్పుడు చేసింది కేసీఆర్ కోసమే. చేస్తున్నదీ కేసీఆర్ కోసమే. ఎంతదాకైనా ఏమైనా చేసేదీ కేసీఆర్ కోసమే. కానీ ఇలా చేస్తే కేసీఆర్ ఇజ్జత్ కూడా పోతదని మాత్రం వారి బుర్రలకు ఎక్కడం లేదు. స్వామిభక్తి తప్ప మరోటి లేదు వారి ఆలోచనలో. ఉద్యోగ సంఘాలు నేతలు ఇట్లనే చేసేది. చేస్తున్నరు కూడా. ఇప్పుడు వారి బాటలో ఐఏఎస్లు నడుస్తున్నరు.
తగుదునమ్మా అని లేని పంచాయతీలను కొని తెచ్చుకోవడమెందుకు..? ఇంతలా కీర్తిస్తున్న కేసీఆర్.. అప్పుడు తను సీఎంగా ఉన్నప్పుడు ఎంత మంది ఐఏఎస్లను పోస్టింగులు ఇవ్వకుండా లూప్లైన్లో పెట్టాడో ఓసారి గుర్తు చేసుకోవాలి. మరిప్పుడు రేవంత్ కూడా అదే చేస్తే. ఇంకా చెయ్యలేదు. చెయ్యాలనే అంటున్నారంతా. మీ చేష్టలిట్లున్నయి కాబట్టే.