(దండుగుల శ్రీనివాస్)
కవిత తన పొలిటికల్ సెకండ్ ఇన్నింగ్స్లో దూకుడుగా పోతున్నది. జైలుకు వెళ్లిన తరువాత ఆమెకు తత్వం బోధపడ్డది. తనవాళ్లనుకున్న వాళ్లంతా ఎలా దూరమయ్యారో గమనించింది. ఆ తరువాత ఆమె కొంత కాలం సైలెంట్గా రాజకీయాలను గమనిస్తూ వచ్చింది. ఇంటికే పరిమితమయ్యింది. అధికారం చేజారడం, తను జైలుకు పోయినా తనను విడిపించుకు రావడంలో కేసీఆర్ పెద్దగా స్పందించకపోవడం, కేటీఆర్ కూడా పెద్దగా పట్టించుకోకపోవడం లాంటి ఘటనలు ఆమెను వేదనకు గురిచేశాయి. అందుకే ఇక తన అస్థిత్వం కాపాడుకునే పనిలో పడిందామె.
పొలిటికల్గా తన ఉనికే ప్రమాదంలో పడుతున్నదని, దీనికి ఎవరో బాధ్యులు కారని, తన కుటుంబమేనని ఆమె భావించింది. అందుకే కష్టపడి తయారుచేసుకున్న రాజకీయ పలుకుబడిని కాపాడుకుని, జనాలకు చేరువయ్యే ప్రయత్నాన్ని మొదలుపెట్టింది. వాస్తవానికి కవిత రాజకీయకంగా యాక్టివ్ గా ఉండటం కేసీఆర్కు ఇష్టం లేదు. కేసీఆర్ ఫోకస్ అంతా కొడుకు కేటీఆర్ మీదనే. సోనియా గాంధీ రాహుల్ విషయంలో చేసిన తప్పును తను చేయొద్దని ఎప్పుడూ భావిస్తాడు. ఒక్కసారైనా కేటీఆర్ను సీఎంను చేస్తే చాలు .. ఆ తరువాత అతనే చూసుకుంటాడనే భావనలో ఉన్నాడు మొదటి నుంచి. కానీ దానికి తగిన సమయం అచ్చి రాలేదు.
వస్తుందనుకుని ఎదురుచూస్తున్నతరుణంలో ఉన్న అధికారం పోయింది. ఇప్పుడు మళ్లీ మొదటికొచ్చింది. ఇక కవితపై ఎలా ఫోకస్ చేస్తాడు. ఆమె రాజకీయ ఎదుగుదల మరో పవర్ సెంటర్కు కేంద్రమవుతుంది.. తలనొప్పిగా మారుతుంది తప్పితే పార్టీకి, కేటీఆర్కు ఏమన్నా ఉపయోగమా..? ఇప్పుడు తండ్రీకొడుకులు ఇద్దరూ ఇదే ఆలోచిస్తున్నారు.ఆ విషయాన్ని పసిగట్టింది కవిత. దీనికి తోడు ఆమెకు మీడియాలో పూర్తి ప్రాధాన్యం దక్కడం లేదు. అసలు ఆమెను పట్టించుకోవడమే లేదు. కాలికి బలపం కట్టుకుని రాష్ట్రమంతా తిరుగుతున్నా.. ఏ మీడియా కూడా ప్రయార్టీ ఇవ్వడం లేదు. ఆఖరిని నమస్తే తెలంగాణతో సహా.
ఈ నేపథ్యంలో తనను కలిసిన ఒకరిద్దరు సీనియర్ జర్నలిస్టులతో ఆమె ఓ కొత్త పత్రిక పెడదామనే ఆలోచనను షేర్ చేసుకున్నట్టుగా ప్రచారం జరుగుతోంది. ఎలాగూ తనను వేరు చేసి దూరం చేయాలనే ఆలోచన సొంత పార్టీలోనే ఉన్న నేపథ్యాన్ని , అది బాహాటంగా బజారులోకెక్కుతున్న వైనాన్ని గమనించిన ఆమె.. ఇక తనకంటూ ఓ సొంత మీడియా హౌజ్ ఉంటే బాగుంటుందనే తన నిర్ణయాన్ని తనకు దగ్గరగా ఉండే జర్నలిస్టులతో చర్చించినట్టుగా మీడియా సర్కిళ్లలో టాక్ నడుస్తోంది.