(దండుగుల శ్రీనివాస్)
కేసీఆర్ వేల పుస్తకాలు చదివాడు. మేధావి. ప్రపంచ జ్ఞాని. దేశాన్ని ఏలాల్సినోడే. కానీ టైం బాగాలేక ఫామ్హౌజ్కే పరిమితమయ్యాడు. మళ్లీ ఆయనను జనాలు కోరుకుంటున్నారు. కేసీఆర్ రావాలి. కావాలంటున్నారు. సరైన సమయంలోనే ఆయన మాట్లాడతాడు. అప్పటి వరకు ఎవరెన్ని మాటలని రెచ్చగొట్టినా చడీ చప్పుడు చేయడు. కేసీఆర్కూ కోపమొస్తుంది. కానీ అది ధర్మాగ్రహం. తిడతాడు.అంతే. పగబట్టడు. ఇది ఆయన మీద ఆ పార్టీ నేతలకున్న అభిప్రాయం. కానీ కొడుకు, కూతురు ఇందుకు డిఫరెంట్గా తేలారు. పెద్దసారు మంచోడే .. మేము కాదురోయ్..! అని సినిమా డైలాగులు వల్లెవేస్తున్నారు. ఈ మధ్య ఏ వేదికలకెక్కినా ఇదే తంతు. ఇవే యాక్షన్ డైలాగులు.
ప్రతీకారేచ్చ ప్రసంగాలు. కార్యకర్తలను కాపాడుకునేందుకో, తమ వాళ్లకు మేమున్నామనే సపోర్టు ఇవ్వడం కోసమో అయితే పర్వాలేదు. అయినా దీని కోసం ఇంతోటి డైలాగులు వాడటం కూడా వీరిద్దరి రాజకీయ భవిష్యత్కు మంచిది కాదనే సంకేతాలే వస్తున్నాయి. బహిరంగంగా. కార్యకర్తలను కాపాడుకోవడం కోసం కంటే.. వారిని బెదిరిస్తే ఊరుకోం అని వారి పక్షం నిలిచే మాటలకన్నా… వీరి ఆ డైలాగుల్లో పవర్ పోయిందనే ఫ్రస్టేషనే కనిపిస్తున్నది. ఏడాదిన్నరయ్యింది. అధికారం పోయి. రానున్నది మీ ప్రభుత్వమే అంటున్నారు. ధీమాగా ఉన్నారు. అప్పుడే అధికారంలోకి వచ్చినట్టే ఊహించుకుంటున్నారు. కొంచెం ఓపికపట్టొచ్చు కదా. జనాలు ఇంకా మరిచిపోలేదు మీ అహంకారపూరిత చర్యలు, పాలనను.
ఆలోపు వారు జాలిచూపే సమయం కూడా ఇవ్వకుండా అవే కారుకూతలు కూయడం ఇబ్బందికరమే అంటున్నారు తలపండిన గులాబీనేతలు. పింక్ బుక్కుల్లో మీ పేర్లు రాసుకుంటాం.. అని బాజాప్తా చెప్తున్నారు. అంటే మీకు అధికారం ఇస్తే ఇక మీ బుక్కుల్లో పేర్లెక్కినవాళ్ల పనిపట్టడమే మీ పని అన్నమాట. ఇందుకోసమే మీకు అధికారం ఇవ్వాలా..? అని జనం అనుకుంటున్నారు అక్క గురించి. మీరున్నప్పుడున్న కలెక్టర్లు, పోలీసులే కదా. అప్పుడు మీరు చెప్పినట్టు వింటే ఓకే.. ఇప్పుడు కాంగ్రెస్ చెప్పినట్టు వింటే.. వెంటాడి వేటాడుతారా..? ఇదెక్కడి న్యాయం రామన్నా అంటున్నారు కేటీఆర్ గురించి.
సందర్బోచితంగా, సమయస్పూర్తిగా, హుందాగా, సబ్జెక్టువైస్గా మాట్లాడే దోరణిని అలవర్చుకోకుండా ఇలా రెచ్చగొట్టే డైలాగులకే చప్పట్లు ఎక్కువ కొడుతున్నారని భ్రమించి ఉంటారు అన్నాచెళ్లుళ్లు. లేదా ఇద్దరికీ ఎవరి ఉనికి వారి కాపాడుకునే పని చాలా ఎమర్జెన్సీ అయి ఉంటుంది. లేదూ… అధికారం కోసం అల్లాడుతున్నామనే సంకేతమూ కావొచ్చు. కాకపోతే అంతు చూస్తామంటే మా జోలికి రాకుండా భయపడతారనే భ్రమ కావొచ్చు. కారణం ఏదైనా ఈ మాటలతో గులాబీలు కొందరు రెచ్చిపోయి… రచ్చ చేసుకొని జీవితాలను రచ్చకీడ్చుకోవడం ఖాయం. వీరంతా బాగానే ఉంటరు. మధ్యలో బలపశువులయ్యేది కార్యకర్తలు, గులాబీ లీడర్లేనంటున్నారు సోషల్ మీడియాలో.