(దండుగుల శ్రీనివాస్)
చంద్రబాబు మాట్లాడితే చాలు నేను..నేను… నేను అనే పదం తప్ప మరోటి ఉండదు. అన్నీ తానే చేశానంటాడు. తనవల్లే ఇదంతా అని జబ్బలు చర్చుకుంటాడు. నేను లేకపోతే ఏమీ లేదని వేదాంతం వల్లెవేస్తాడు. ఇప్పుడు అలాగే తయారయ్యారు. కేసీఆర్, కేటీఆర్లు. అవును. అధికారం పోయినకాడి నుంచి వీరి నోటి నుంచి వస్తున్న పదాలు అవే. మనదే మనదే. మనకే మనకే. మనమే మనమే. ఏంటీ..? అధికారం. అవును.. అధికారం కోసం కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు కాబోలు. ఇద్దరూను. అంతలా అధికారానికి కనెక్టయిపోయారు మరి. ఒకటి కాదు రెండు కాదు.. పదేళ్లు అనుభవించారు.
ఆపై కూడా తమను కొట్టేవాళ్లే లేరనుకున్నారు. అధికారం మానుంచి విడిపోని ఫెవికాల్ బంధమనుకున్నారు. కానీ కథ అడ్డం తిరిగింది. ఊహించని దెబ్బ కొట్టారు జనం. ఆ దెబ్బ నుంచి తేరుకుని, లోపాలు తెలుసుకుని, వైఫల్యాలు సంస్కరించుకుని, బుద్ది తెచ్చుకుని జనానికి దగ్గరయ్యే పనిని చేయలేదు ఇప్పటి వరకు కేసీఆర్, కేటీఆర్. మరెలా అధికారం మాదే అని కలవరిస్తున్నారు..? కాంగ్రెస్ ఫెయిలయ్యింది. వరుస వైఫల్యాలు మనకే లాభం చేస్తాయి..! మనమే వస్తాము… ఇవే అంచనాలు. ఇవే మాటలతో కాలం గడుపుతున్నారిద్దరు. ఇప్పుడు వీరిద్దరు జనాలను నమ్మడం లేదు. సోసల్ మీడియాను నమ్ముతున్నారు. వాటిలోనే జీవిస్తున్నారు.
వాటిలో శ్వాసిస్తున్నారు. అవే తమకు అధికారాన్ని తెచ్చిపెట్టే ఆయుధాలని గట్టిగా నమ్మేశారు. మళ్లీ కేసీఆర్ చుట్టూ వాళ్లే. కేటీఆర్ను నడిపించేది వాళ్లే. కవిత వెంట తిరిగేదే వాళ్లే. వీళ్లేం మారలే. జనాలూ మారాలే. వీరి విషయంలో ఇంకా అదే అభిప్రాయంతో ఉన్నారు. కానీ జనం ఏం కోరుకుంటున్నారో తెలుసుకోలేకపోతున్నారు. తెలిసినా నిద్ర నటిస్తున్నారు. తెచ్చుకున్న కాంగ్రెస్తో కంగుతింటున్నారు గా.. బాగయ్యింది. ఇగ ఇప్పుడు చచ్చినట్టు మాకే ఎయ్యాలె. మావైపే ఉండాలె. మాతోనే రావాలె. మాకే అధికారం ఇయ్యాలె. అంతే. అని అనుకుంటున్నారు. జనంతో అదే భాషతో మాట్లాడుతున్నారు. అదే అహంకారాన్ని ప్రదర్శిస్తున్నారు. అసలు మా తప్పులేవన్నట్టు నటిస్తున్నారు.
లోపాలు శాపాలే లేవనన్నట్టు నడుచుకుంటున్నారు. ఇదంతా జనం చూస్తున్నారు. అధికారం ఇస్తారా..? ఇయ్యారా..? ఇంకా చాలా రోజులుంది. ఇప్పటి నుంచే మీరే డిసైడ్ అయిపోయి జనం జడ్జిమెంట్ను కూడా ఇప్పుడే మీరే చెప్పేసుకుని మరింత పలుచనవ్వడం తప్ప పరిపక్వత, పరివర్తన వచ్చిందని ఎలా నమ్మేది…?