(దండుగుల శ్రీనివాస్)
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూములను సర్కార్ వదిలేలా లేదు. వదులుకునేలా లేదు. ఆ 400 ఎకరాలు సర్కార్ భూములే. డౌట్లేదు. వేలం వేసేందుకు సర్కార్ వడివడిగా చర్యలు తీసుకోవడమే వివాదంగా మారింది. ఎందుకు..? గతంలో బీఆరెస్ సర్కార్ వందలెకరాలు తెగనమ్ముకుంది కదా. అవును. కానీ ఈ హెచ్సీయూ భూముల వ్యవహారం డిఫరెంట్. ఇక్కడ వన్యప్రాణులున్నాయనే అంశమే అందరినీ కదిలించింది. కదిలివచ్చేలా చేసింది. సర్కార్ చర్యలకు బ్రేకులు పడేలా చేసింది. నిజంగా ఇక్కడ జింకలు, నెమళ్లు ఉన్నాయా..? ఉన్నాయి. డౌట్లేదు. మరి ఫేక్ కంటెంట్పై సీఎం సీరియస్ అయ్యారు కదా. సైబర్ క్రైమ్ వింగ్ను మరింత బలోపేతం చేసి మున్ముందు ఫేక్ వీడియోలు, ఫోటోలు పెట్టకుండా తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు కూడా. ఫేక్ కంటెంట్ జరిగిందా..? జరిగింది. ముందుగా అక్కడ ఏం జరగబోతుందో ఊహించి నెమళ్లు, జింకలు పారిపోయినట్టుగా ఫోటోలు పెట్టారు. నెమళ్ల అరుపులు క్రియేట్ చేశారు. ఇది తప్పే. ఫేక్ కంటెంటే. కానీ అక్కడ నెమళ్లే లేవు. జింకలే లేవు. లేని వాటిని ఎలా అక్కడ తెచ్చి చూపిస్తారు అని వాదించడమే తప్పు. అదే సర్కార్ చేస్తోంది. కాంగ్రెస్ సోషల్ మీడియా చేస్తోంది.
06Vastavam.in (4)
గతంలో కేసీఆర్ సర్కార్ భూములు అమ్మలేదా..? అడవిని నాశనం చేయలేదా..? వేల ఎకరాల అడవి భూమిని అభివృద్ధి, ప్రాజెక్టుల పేరుతో నామరూపాల్లేకుండా చేయలేదా..? చేశాడు. డౌట్లేదు. కానీ అప్పుడు లేని పరిస్థితులు ఇప్పుడే ఇక్కడే ఎందుకు ఉత్పన్నమయ్యాయి..? ఇదే సర్కార్ వేస్తున్నప్రశ్న. దీని వెనుక బీఆరెస్ కుట్ర కోణం దాగుంది. రాజకీయ లబ్ది కోసమే ఫేక్ కంటెంట్ క్రియేట్ చేశారని సర్కార్ భావిస్తోంది. ఇదీ కరెక్టే. కానీ ఇందులో బీఆరెస్ ఒక్కటే లేదు. విద్యార్థులూ ఉన్నారు. కానీ సర్కార్ ఏం చెబుతోంది…? విద్యార్థులు కూడా బీఆరెస్ కుట్ర కోణం ఉచ్చులో పడిపోయారని. అక్కడ ఐటీ ప్రాజెక్టులు రావడం వల్ల 5 లక్షల ఉద్యోగాలొస్తాయి..! ఇది మరిచిపోతున్నారని. కానీ ఆ వచ్చే ఉద్యోగాలేమో కానీ.. పర్యవారణం కాపాడుకోవాలనే తపనే వారిలో నిజంగా ఉంది. అది అడవి కాదు. కానీ అడవి కాని అడవి. వారి ఉద్దేశమదే. అందరి అభిప్రాయమూ కూడా ఇదే. సర్కార్ అమ్ముకోవడానికి ఈ 400 ఎకరాలే కావాలా..? అనేది విద్యార్థులు, పర్యావరణవేత్తలు, న్యూట్రల్ పర్సన్స్ కూడా వాదిస్తున్నారు. దీన్ని బీఆరెస్ తనకు అనుకూలంగా మలుచుకున్నది. అది వేరే విషయం. కానీ అంతిమంగా మెజారిటీ ప్రజలు మాత్రం సర్కార్ ఈ భూములపై వెనక్కి తగ్గడమే మేలని భావిస్తోంది. కానీ, సర్కార్ మాత్రం దీన్ని ఇజ్జత్ కా సవాల్గా తీసుకున్నది.
ఢిల్లీ పెద్దలు కూడా ఈ విషయంలో సైలెంట్గా ఉన్నారు. మౌనం అర్ధాంగీకారమంటారు. కానీ ఇక్కడ సంపూర్ణ అంగీకారం. దేనికి..? ఆ భూములను వేలం వేసే విషయంలో. అవును. ఢిల్లీ పెద్దలు కూడా ఇక్కడ రేవంత్ చేస్తున్న చర్యలనే సమర్థిస్తోంది. అదే పంథాలో ముందుకు పోవాల్సిందేననే ఆదేశాలే సైలెంట్ వచ్చాయి. అది మీనాక్షి నటరాజన్ రంగంలోకి దిగడం మూలంగా భావించొచ్చు. ఏదైనా క్లిష్ట పరిస్థితి వచ్చినప్పుడు పార్టీ వ్యవహారాల ఇంచార్జి జోక్యం చేసుకోవడం పరిపాటే. కానీ ఈ ఇష్యూ చాల డిఫరెంట్. ఒక రకంగా మీనాక్షి చేపడుతున్న చర్యలు, సేకరిస్తున్న అభిప్రాయాలు, అంతిమంగా తీసుకునే నిర్ణయం ఆమెది కాదు. రాహుల్ గాంధీదే. అవును. అందులో డౌట్ లేదు.
మొత్తానికి చెప్పొచ్చేమిటంటే, ఈ వ్యవహారాన్ని సర్కార్ సీరియస్గా తీసుకున్నది. నా బంగారు పుట్టలో వేలు పెడితే కుట్టనా..? అనే విధంగానే సీఎం చర్యలుండబోతున్నాయి. ఫేక్ కంటెంట్తో దేశం యావత్తు అందరి దృష్టిని దీనిపై మళ్లించి సర్కార్ను బద్నాం చేసే చర్యల్లో బీఆరెస్ సోషల్ మీడియా ముందుంది. దీని తాటా తీసే పనిలో సర్కార్ ఉంది. అందుకే సైబర్ క్రైం వింగ్ను దీనికి వాడుకోనుంది సర్కార్. ఇక సుప్రీం కోర్టు కు కూడా ఈ ఫేక్ కంటెంట్ పనితనం గురించి వివరించి తదుపని మెల్లగా తమ చర్యలు తాము ప్రారంభించే యోచనలోనే ఉంది సర్కార్. ఎట్టి పరిస్థితుల్లో వెనక్కితగ్గేలా లేరు. చర్యలు తీసుకోవడంలో కూడా. ఈ రెండూ సమాంతరంగా చేసుకుంటూ పోతోంది ప్రభుత్వం. ఓ వైపు సీఎం అధికారులతో మీటింగులు, మరోవైపు మీనాక్షి విద్యార్థులు, మిగితా సెక్షన్లతో సంప్రదింపులు, అభిప్రాయాల సేకరణ.. రెండు వైపులా నరుక్కొస్తున్నారు. అంతిమంగా ఆ భూములను చదును చేసి వేలం వేసే దిశగానే ఈ చర్యలుండనున్నాయి. అందులో డౌట్ లేదు. కానీ మెల్లగా. అంతే.
ఒకవేళ బీఆరెఎస్ సర్కార్ ఉన్న సమయంలో ఈ భూములు కోర్టు వివాదాల నుంచి గట్టెక్కితే వారేం చేసేవారు. ఇలాగే చేసేవారా.? కచ్చితంగా ఇదే స్టెప్ తీసుకుంటారు. అందులో డౌట్ లేదు. అవి విలువైన భూములు. అమ్ముకుంటే కోట్లు వస్తాయి. సంక్షేమ పథకాలు అమలు కావాలంటే అమ్ముకోవాల్సిందేగా. అదే అలవాటు చేసి పోయాడు కేసీఆర్. ఇప్పుడు రేవంత్ చేస్తున్నది కూడా అదే. మరి ఇలా వేలం వేసే క్రమంలో ఇంతటి వ్యతిరేతక వచ్చేదా..? కచ్చితంగా వచ్చేది. అక్కడ కేసీఆర్ ఉన్నాడా..? రేవంత్ ఉన్నాడా..? అనేది కాదిక్కడ ఇష్యూ. అక్కడ ప్రకృతి విస్తారంగా విస్తరించింది. వన్యప్రాణులకు అది అడ్డగా ఉంది. అది అడవికాని అడవి. ఫారెస్టు నోటిఫైడ్ చేయని ఫారెస్ట్ అది. దీన్ని అప్పుడు చేసినా అడ్డుకునేవారు. కానీ ఇంతలా సోషల్ మీడియాలో ఫేక్ కంటెంట్ క్రియేట్ అయి ఉండేది కాదంతే. బీఆరెస్ సోషల్ మీడియా మరీ టూమచ్ చేసింది. అదంతలా ఎదిగి ఉంది కాబట్టి. దాన్ని కేటీఆర్ బాగా పెంచి పోషిస్తున్నాడు కాబట్టి. ఇక్కడ ఇష్యూ ప్లేస్. ఆ ప్రాంతమే. వేరెక్కడైనా సర్కార్ భూములు అమ్ముకున్నా పెద్దగా పట్టించుకునే వారు కారు. ఎందుకంటే ఇది కేసీఆర్ సీఎంగా ఉన్నప్పట్నుంచీ వస్తున్నదే కదా. అది సర్కార్ గ్రహించడం లేదా..? తెలుసు. కానీ వెనక్కి తగ్గదు. ముందుకే వెళ్తుంది. అదంతే.