బాండుపేపర్‌ రాసిచ్చి మరీ ఐదు రోజుల్లో పసుపుబోర్డు తెస్తానన్న అర్వింద్‌.. ఆ తర్వాత చాలా మాటలు మార్చాడు. ఎన్నో అబద్దాలు వళ్లెవేశాడు. పసుపుబోర్డు అనేది ఓ అంబాసిడర్ కారులాంటిందని, తను తీసుకొచ్చిన స్పైస్‌ బోర్డు బెంజ్‌కారు, టయోటకారులాంటిదని ఏవేవో వర్ణనలు చేసి పసుపు రైతులను మభ్యపెడుతూ వచ్చాడు. కానీ ఇవాళ పాలమూరులో మోడీ పర్యటన సందర్భంగా జరిగిన సభలో ఆయన నోటి వెంట పసుపు బోర్డు ప్రకటన చేయించారు. ఈనెల ౩న నిజామాబాద్‌లో బహిరంగ సభలో చెప్పిస్తారని అంతా భావించారు. కానీ దీన్ని రెండు రోజులు ముందుగానే పాలమూరులో ప్రకటించారు అనూహ్యంగా.

నిజామాబాద్‌లో జరిగే బహిరంగ సభను రైతుల వేడుకగా చేసుకుందామనేది బీజేపీ వ్యూహంగా కనిపిస్తున్నది. ఈ పరిణామం పసుపు రైతుల్లో సంతోషాన్నిచ్చేదే. కానీ ఇంతకాలం తమను మోసంచేసిందనే అపప్రద కొనసాగుతుందా..? అర్వింద్‌కు ఈ మైలేజీ కలిసొస్తుందా…? చూడాలి.మోడీ ప్రకటన చేశారు కాబట్టి.. ఇక తిరుగులేదనే వాదన రైతుల్లో ఉంది. ఎలాగైతే ఏం మొత్తానికి సాధించాం… అనే సంతోషం పసుపు రైతుల్లో కనిపిస్తున్నది. ఇది బీజేపీ ఓన్ చేసుకోవాలని భావిస్తోంది. నిజామాబాద్‌ సభను పూర్తిగా పసుపు రైతు సభగా మార్చాలని భావిస్తోంది. కవిత ఎంపీగా ఉన్న సమయంలో ప్రధానితో పాటు పలువురు సీఎంలను కలిసినా వారంతా దీనిపై అయిష్టంగానే ఉన్నారు. ఇది టెక్నికల్‌గా సాధ్యం కాదంటూ కొట్టేశారు.కానీ గత ఎంపీ ఎన్నికల్లో అర్వింద్‌ దీన్నే ప్రధాన అస్త్రంగా ఓటర్లపై సంధించారు. తను ఎలాగూ గెలిచేది లేదు.. అని ఏకంగా దీనిపై బాండు పేపర్ రాసిచ్చేందుకు సిద్దపడ్డాడు.

కానీ అనూహ్యంగా మోడీ హవాతో బీజేపీ ఎంపీ అభ్యర్థిగా నిజామాబాద్‌ నుంచి కవితపై అర్వింద్‌ గెలిచాడు. దీంతో పపుపు బోర్డు ఏర్పాటు పై ఒత్తిడి పెరుగుతూ వచ్చింది. బీఆరెస్ పార్టీ కూడా అర్వింద్‌ పై ఒత్తిడి పెంచింది. దీంతో స్పైస్‌ బోర్డ, రీజినల్ ఆఫీసు అంటూ ఏవోవే సాకులు చూపుతూ అర్వింద్‌ తప్పిచుకుంటూ రావడమే కాదు… పసుపు బోర్డు అనేది పాత అంబాసిడర్ కారులాంటిదని, తాను తెచ్చిన సంస్కరణలు, మార్పులను బెంజ్‌ కారుతో పోల్చాడు. దీంతో ఇక పసుపు బోర్డుకు మంగళం పాడినట్టేనని అంతా భావించారు. కానీ బీఆరెస్‌ లీడర్లు, కవిత మాత్రం పసుపు రైతులకు న్యాయం జరగాలంటే, మద్దతు ధర లభించాలంటే పసుపు బోర్డే ఏకైక మార్గమని గట్టిగా చెబుతూ వస్తున్నారు.

చివరకు మోడీ నోట ఇవాళ పాలమూరులో జాతీయ పసుపు బోర్డు ఏర్పాటు చేయిస్తామనడం… పాత అంబాసిడరే బెటర్‌ అని బీజేపీ ఒప్పుకున్నట్టు స్పష్టమయ్యింది. అయితే ఇందూరు వేదికగా ప్రకటిస్తే అది కేవలం అర్వింద్‌కు మాత్రం క్రెడిబిలిటీ దక్కుతుందనే యోచనలో పాలమూరులో ప్రకటించారనే వాదన ఉంది. నిజామాబాద్‌ పర్యటన, సభలో దీని ఏర్పాటుపై రైతు సంబరంగా చేసుకోవడం మూలంగా మోడీ , బీజేపీ పట్ల రైతుల్లో విశ్వాసం పెరగాలనేది ఆ పార్టీ రాష్ట్ర నాయకత్వం సూచన మేరకు ఇలా చేశారని తెలుస్తోంది. ఏదేమైనా పసుపు బోర్డు ఏర్పాటు హామీతో రైతుల్లో ఆశలు చిగురించాయి. ఇది ఎంతో కొంత బీజేపీకి మైలేజీని తీసుకొచ్చే అంశమే అవుతుంది.

You missed