హైదరాబాద్‌:
జర్నలిస్టుల ఇళ్ల స్థలాల అంశాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్‌ దృష్టికి తీసుకెళ్తానని ఆర్థిక, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు హామీ ఇచ్చారు. ఈ మేరకు డెక్కన్‌ జర్నలిస్ట్స్‌ హౌసింగ్‌ సొసైటీ అధ్యక్షులు బొల్లోజు రవి, ఉపాధ్యక్షులు ఎం.శ్రీనివాస్, కోశాధికారి చిలుకూరి అయ్యప్ప, డైరెక్టర్లు రామకృష్ణ, జి.ప్రతాప్‌రెడ్డి, ప్రతినిధులు కె.విక్రమ్‌రెడ్డి, గౌటే దేవేందర్, ప్రతిభాదేవి, సురేశ్‌బాబు, ప్రియకుమార్, భుజేందర్‌ తదితరులు మంత్రి హరీశ్‌రావును కలిసి వినతిపత్రం అందజేశారు. జర్నలిస్టుల విషయం పట్ల ప్రభుత్వం సానుకూలంగా ఉందని మంత్రి పేర్కొన్నారు. ఈ సందర్భంగా సొసైటీ ప్రతినిధులు జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇవ్వాల్సిన ప్రాధాన్యాన్ని వివరించారు. ఖమ్మం జిల్లా జర్నలిస్టుల స్థలాల కోసం కేబినెట్‌ ప్రత్యేకంగా నిర్ణయం తీసుకుని, 23 ఎకరాల భూమిని కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసిన విషయాన్ని మంత్రి దృష్టికి తీసుకొచ్చారు.

ఇప్పటికే అనేకచోట్ల జర్నలిస్టులకు ఏంతో మేలు జరిగిందన్నారు. దీంతోపాటు ఇతర జిల్లాల్లోనూ మంత్రులు, ఎమ్మెల్యేలు జర్నలిస్టులకు ఇళ్ల స్థలాల కేటాయింపుపై నిర్ణయాలు తీసుకోవడంతో పాటు కొన్నిచోట్ల ఇప్పటికే స్థలాలను అందించారని ప్రతినిధులు మెమొరాండంలో పేర్కొన్నారు. కానీ హైదరాబాద్‌ కేంద్రంగా పనిచేస్తున్న హైదరాబాద్‌ సిటీ, రాష్ట్ర స్థాయి జర్నలిస్టులకు మాత్రం ఇళ్ల స్థలాల కేటాయింపు పూర్తి స్థాయిలో జరగలేదన్నారు. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్‌ కేంద్రంగా పనిచేస్తూ ప్రభుత్వ అక్రిడేషన్‌ పొంది ఉన్న నగర, రాష్ట్రస్థాయి జర్నలిస్టులు, గతంలో ఎలాంటి సొసైటీల్లో సభ్యత్వం లేనివారు సభ్యులుగా డెక్కన్‌ జర్నలిస్ట్‌ హౌసింగ్‌ సొసైటీ ఏర్పాటైందని పేర్కొన్నారు. చాలీచాలనీ వేతనాలతో జర్నలిస్టులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నారు. ఉద్యోగరీత్యా ఇతర జిల్లాలు, ప్రాంతాల నుంచి హైదరాబాద్‌ వచ్చి పనిచేస్తున్న జర్నలిస్టులకు ఇంటి అద్దె భారం గుదిబండగా మారిందన్నారు. జర్నలిస్టుల పరిస్థితులను పరిగణలోకి తీసుకుని డెక్కన్‌ జర్నలిస్ట్‌ హౌసింగ్‌ సొసైటీలోని సభ్యులకు ఇంటి స్థలాన్ని కేటాయించాలని వారు ఆ వినతిపత్రంలో కోరారు.

You missed