ప్రభుత్వ భూములు గుర్తించి వాటిని పేదలకు పంచండి….
మన లీడర్లు ఇక పల్లెబాట…
పల్లెనిద్ర చేయాలని కేసీఆర్ ఆదేశం…
ప్లీనరీ సందర్బంగా కీలక దిశానిర్దేశం..
టార్గెట్ @ 100
గెలుస్తాం సమస్య లేదు.. కానీ ఎక్కువ సీట్లు దక్కించుకోవడమే లక్ష్యం…
ప్రజలతో మమేకం కండి…
వాస్తవం ప్రతినిధి: హైదరాబాద్
ప్లీనరీ సందర్బంగా సీఎం కేసీఆర్ లీడర్లకు కీలక దిశానిర్దేశం చేశారు. ఇవాళ తెలంగాణ భవన్లో ప్లీనరీ సమావేశాన్ని నిర్వహించారు. ఎమ్మెల్యేలు,మంత్రులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ప్రజలతో మరింత మమేకం కావాలని సీఎం ఎమ్మెల్యేలకు సూచించారు. పల్లెనిద్ర కార్యక్రమాలను నిర్వహించి వారి సమస్యలు తెలుసుకోవాలని, అక్కడికక్కడే వాటిని పరిష్కరించేలా కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఆయా నియోజకవర్గాల్లో ఖాళీగా ఉన్న ప్రభుత్వ భూములను గుర్తించి వాటికి సర్వే నెంబర్లను కేటాయించాలని, వాటిని పేదలకు ప్లాట్లుగా పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేయాలని కూడా సీఎం ఎమ్మెల్యేలను ఆదేశించారు. వంద సీట్లు గెలవడమే లక్ష్యంగా పార్టీ శ్రేణులు పనిచేయాలన్నారు.
గెలుపు మనది ఖాయమే.. కానీ అది ఆషామాషీగా ఉండొద్దు.. వంద సీట్లు సాధించేలా ఉండాలంటూ లక్ష్యాన్ని ఎమ్మెల్యేల ముందుంచారు అధినేత. అబ్ కీ బార్ కిసాన్ సర్కార్ నినాదంతో దేశంతో పాగా వేసేందుకు బీఆరెస్ అన్ని వర్గాలను కలుపుకుని పోతున్నదని, పల్లెల్లో తిరుగుతూ ప్రజలతో మేమకమవుతూ ఇక్కడా.. దేశ వ్యాప్తంగా బీఆరెస్ తిరుగులేని శక్తిగా ఎదిగేలా ప్రజాప్రతినిధులు పనిచేయాలన్నారు. ఆ విధంగా ప్రజలను చైతన్యవంతం చేయడంతో పాటు వారితో మమేకమయ్యే విధంగా పల్లెల్లో బస చేయాలని పిలుపునిచ్చారు. అకాల వర్షాలతో ప్రతీ ఏడాది రైతులు నష్టపోతున్నారని, అలా జరగకుండా ప్రకృతి విపత్తులను ముందుగానే గుర్తించి, వాటిపై అవగాహన పెంచుకుని ముందుగానే కోతలు ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలని, ఆ మేరకు రైతులను అప్రమత్తం చేయాలని సీఎం వ్యవసాయాధికారులకు సూచించారు.