కవితను బద్నాం చేయాలనుకున్నారు. చేస్తున్నారు. విడతల వారీగా..అదను చూసి..వలపన్ని.. ఒక్కొక్క ఉచ్చే బిగుస్తున్నారు. ఇదంతా పక్కా ప్లానింగ్. మోడీ చేతిలో ఇప్పుడు ఢిల్లీ లిక్కర్ స్కాం కోతికి కొబ్బరి చిప్ప దొరికినట్టే అయ్యింది. టీఆరెస్ .. బీఆరెస్గా రూపాంతరం చెందిన తర్వాత కేంద్రం మరింత దూకుడు పెంచింది. ఢిల్లీ లిక్కర్ స్కాంలో కవిత ప్రమేయంపై మరింత లోతుగా దర్యాప్తు పేరుతో ఈడీ తర్వాత సీబీఐ ఎంట్రీ ఇచ్చింది. ఇవాళ దాదాపు ఆమె నివాసంలో ఏడు గంటల పాటు కవితను ప్రశ్నించింది సీబీఐ బృందం.
ఆ తర్వాత ఈ బృందం ఢిల్లీకి వెళ్లిపోయింది. సీబీఐ ఎంట్రీ ఇచ్చిన సమయం నుంచి వెళ్లిపోయే వరకు బీఆరెస్ శ్రేణుల్లో టెన్షన్.. టెన్షన్. ఏ ఒక్క నేత కూడా దీనిపై మాట్లాడలేదు. చివరకు కవిత తరుపున ఓ ప్రెస్నోట్ వస్తుందని చెప్పినా.. ఏవో కారణాల చేత ఇవ్వలేకపోయామన్నారు. మొత్తానికి ఈ ఎపిసోడ్ ఇక్కడితో ముగియలేదని మాత్రం అవగతమవుతోంది. ఈనెలాఖరు వరకు పార్లమెంటు సెషన్స్ ఉన్నాయి. ఇవి ముగిసిన తర్వాత మరింత దూకుడు పెంచాలని ఈడీ భావిస్తోంది. కవిత ఆడిటర్ ను కూడా ఈ ఉచ్చులోకి లాగే ప్రయత్నం చేస్తున్నది ఈడీ. ఆ తర్వాత కవితపై మరింత పకడ్బందీగా వలపన్నాలనే ఉద్దేశ్యంతో బీజేపీ ఉన్నట్టు తెలుస్తోంది. కేసీఆర్ను దెబ్బకొట్టాలంటే ఈ అంశాన్ని అంత తేలిగ్గా వదలొద్దనేది మోడీ ఉద్దేశ్యంగా తెలుస్తోంది. దేశ రాజకీయాల్లో ప్రభావం చూపాలనుకున్న కేసీఆర్ను ఈ కేసులో బిడ్డను ఇరికించి ఇరకాటంలో పెట్టడం ద్వారా దూకుడుకు కళ్లెం వేయవచ్చనే ఆలోచనలో వారున్నారు.