బాయిల్డ్ రైస్, రా రైస్ ఇదేం లొల్లిరా బై.. నీకేమైనా అర్థమైతుందా..?
అరే శీనా… ఏందిరా ఈ లొల్లి… ఢిల్లీ దాకా పోయింది. ఇక్కడ సీయెంమేమో బాయిల్డ్ రైస్ కొనాలె అంటుండు…..
మేము కొనమన్నమా కొంటం .. కానీ రా రైస్ కొంటమని కేంద్రమంటుంది… అసలేంది ఈ లొల్లి..
నీకేమైనా తెలుసునా.. ఈ బాయిల్డ్ రైస్.. రా రైస్ లొల్లి.. ?
అవునే నాకూ అదే పరేషాన్గుంది. గీ లొల్లి ఎప్పుడూ లేదు. ధాన్యం కొన్నరా.. పైసలిచ్చిర్రా లేదా అనే రందీ ఉంటుండే .. ఇప్పుడు కొత్తగా రైతులకు ధాన్యం ఎవలు కొంటరు..? అసలు కొంటరా ..? కొనరా అని రంది పట్టుకుంది.
అరే నువ్వు గమనించినవారా శీనా..? రోడ్ల మీదకెక్కి టీఆరెస్సోళ్లే ధర్నాలు గిర్నాలు చేస్తుర్రు గానీ రైతులు మాత్రం అందులో లేరురా..?
అవ్.. నేను సుత గమనించిన గానీ… ఎందుకు లేరంటవ్ రా..?
ఆళ్లు ఎప్పడూ ఏసినట్టుగానే వరేసిండ్లు.. సీఎం సారు వద్దురా బై అన్నా ఇండ్లే. కొందరేమో భయపడ్డరు. కానీ అందరూ ఏసిండ్లు.. కొనకపోతే మీ సంగతి సూస్తం.. మాకు కేంద్రంతో పనిలేదు.. నువ్వే మాకు ముఖ్యం అని కూసుండ్రు….
అవ్ ఇప్పుడు అదే సీఎంకు తలనొప్పి తెచ్చిపెట్టిందిరా బై….
ఆళ్లు కొనరు.. కొనేదాకా వదలమని ఈళ్లు లొల్లి చేస్తుండ్రు.. తీరా కొద్ది రోజుల్లోనే కోతల టయమ్ కూడా దగ్గరికొచ్చింది. కోతలు కోసినంక.. రోడ్లపై ధాన్యం రాసులు వచ్చేదాకా ఈ లొల్లి నడుస్తనే ఉంటది కావొచ్చు.
అవ్ రా.. ఎప్పడూ లేంది గీ సమస్య గిప్పుడే ఎందుకొచ్చిందిరా బై….రా రైసేంది..? బాయిల్డ్ రైస్ ఏందీ….? ఏందీ అసలు కథ…?
అరే గీ ముచ్చట తెల్వకనే అందరూ నెత్తి పట్టుకుంటుర్రు.. ఈ యాసంగిలో ..అంటే ఎండాకాలం పంటలో ఇక్కగ ఎండలు మస్తుగుంటయి.. ఆ ఎండకు బియ్యం పగులుతయ్.. నూకలైతయి… అందుకే ఈ ధాన్యాన్ని ఉడికిస్తరు. అందుకే వీటిని బాయల్డ్ రైస్ అంటరు.. ఉప్పుడు బియ్యమని పిలుస్తరు.
మరి ఆ బియ్యం తీసుకునేటందుకు ఏం రోగం కేంద్రానికి… ? ఇంతకుముందు తీసుకున్నది కదా…?
తీసుకున్నది కరెక్టేనే… కానీ ఈ ఉప్పుడు బియ్యం అంతటా తినరు. కొన్ని రాష్ట్రాల ప్రజలే తింటరు.. ఇప్పుడు గివి స్టాకు మస్తుగా ఉన్నయంట.. అందుకే మేం తీసుకోం.. రా రైస్ అదే వానాకాలం వచ్చే పంట బియ్యాన్నిమాత్రం తీసుకుంటమంటుంది కేంద్రం…
మరి ఈ బియ్యం రాష్ట్రం కొని ఏం చేయ్యాలె.. కేంద్రానికే కదా అమ్మాలె.. ఈళ్లు మాత్రం తీసుకొని ఏం చేస్తరు..?
ఇప్పుడు అదే లొల్లి నడుస్తేందే కాకా…. బియ్యం కొంటరా కొనరా అని సీఎం కేసీఆర్ గట్టిగనే కూసుండు.. కొనకపోతే రైతుల దగ్గర బీజేపీ పలుచనైతది.. ఆఖరికి కేసీఆరే ఏదో ఒకటి చేసి కొంటడనే ధీమా మాత్రం రైతులకుంది… అందుకే బేఫికర్గున్నరు.
ఇగ సందట్లో సడేమియా అని కొత్త లొల్లి షురూ అయ్యేందే కాకా..?
ఏందిరా అది..?
ఇగో ఇప్పుడు పండించిన పంటనంతా ఎట్లనో అట్ల కేసీఆర్ కొంటడు గానీ.. మరి ఆయన మాటిని అప్పుడు మేము వరి వెయ్యలే కదా.. మరి మేము లాస్ అయినట్టే కదా.. మా సంగతేందీ..? అంటుండ్రే పడీత్ గుంచిన రైతులు..
నీ యవ్వ.. ముందు పండించిన పంటనైతే కొననియ్యుర్రా బై…. ఇది ఏడిదాక వస్తదో… రైతుల అరిగోస ఎవరికి ముడతదో…?