మద్యం టెండర్లు ముగిశాయి. పెంచిన లైసెన్సు ఫీజులు.. పెరిగిన మద్యం షాపులు.. మన సర్కారుకు పెద్ద ఎత్తున ఆదాయం తెచ్చిపెట్టింది. కోట్లకు కోట్లు వచ్చి పడ్డాయి. మరి మొన్నటి దాకా బడ్జెట్లో పైసలు లేవో ఏందో గానీ, హుజురాబాద్ ఎన్నికల తర్వాత వెంటనే దళిత బంధు అమలు చేస్తామని చెప్పి దాని ఊసే లేదు.
ఏమాయే సారూ..! అని అంతా గగ్గోలు పెట్టినా..కేసీఆర్ పట్టించుకోవడం లేదు. ఇప్పుడు మద్యం టెండర్లతో మస్తు పైసలొచ్చినయి కదా. ఇగనైనా దళితబంధు అమలు చేసి దళితులకు పది లక్షల చొప్పున పంచాలని కోరుతున్నారంతా. దీనిపై సోషల్ మీడియాలో వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు కొందరు. మొన్న దళితుడిని సీఎం చేస్తానని హామీ ఇచ్చినా.. షబ్బీర్ అలీ వద్దన్నాడు కాబట్టి చేయలేదని సీఎం చెప్పడంతో అంతా అవాక్కయ్యారు.
షబ్బీర్ చెబితే సీఎం వింటాడా? షబ్బీర్కు అంత సీనుందా..? అసలు సీఎం కేసీఆర్కు ఆ కటుంబానికి షబ్బీర్కు ఉన్న సంబంధాలేమిటీ..? ఈయన మాట అక్కడ ఎందుకు చెల్లుబాటు అవుతుంది…? ఈయనేమన్నా టీఆరెస్కు కోవర్టా..? ఇగో ఇవన్నీ డౌట్లు వచ్చాయి. దీనిపై షబ్బీర్ కూడా ఏదో కౌంటర్ ఇచ్చాడులెండి. చేతులెత్తి దండపెడుతున్నా… ఇప్పుడైనా దళితుడిని సీఎం చేయి.. అని కోరాడు కేసీఆర్ను వ్యంగ్యంగా. అది అయ్యేదీ కాదు..పొయ్యేది కాదని ఆ ఇద్దరికీ తెలుసు. మనకూ తెలుసు.
సరే, ఇప్పుడు కొత్తగా షబ్బీర్పై మరో సెటైర్తో సోషల్ మీడియాలో ఆడుకుంటున్నారు కొందరు. ఈ దళితబంధును కూడా అమలు చేయొద్దని షబ్బీర్ అలీ కేసీఆర్కు ఏమైనా చెప్పాడా..? అని సందేహాలు వ్యక్తం చేస్తూ జోక్లు పేల్చుతున్నారు. దీనిపై షబ్బీర్ మళ్లీ మాట్లాడాల్సిందే. సారు.. కేసీఆరు.. మీరు తొందరగా.. దళితబంధు అమలు చేయండి.. లేదంటే అది కూడా నేనే వద్దన్నానని నన్నంతా ఆడిపోసుకుంటున్నారు.. అని చేతులెత్తి వేడుకోవాలి. అప్పుడు గానీ సోషల్ మీడియాలో షబ్బీర్తో ఆడుకోవడం ఆపరు కావొచ్చు.
అసలు సంగతి చాలా మందికి తెలియదు… ఏదంటే…
హుజురాబాద్ ఓటమిని సారు జీర్ణించుకోవడం లేదు. ఇంత రిస్కు తీసుకుని, ఇంత ఖర్చు చేసి, ఇంత బతిమిలాడి, ఇంత భయపెట్టించి, ఇంత చేసీ… ఆఖరికి ఈటల చేతిలో ఈ ఘోర పరాభవమా..? అని ఆయన చాలా బాధపడిపోయాడు. ఆ కోపం ఇంకా చల్లారలేదు. అది చల్లారలంటే చాలా సమయం పడుతుంది. ఎంత సమయమా..? ఏమో ఎలా చెప్పగలం. ఎన్ని రోజులైనా పట్టొచ్చు. మళ్లీ ఎన్నికలు కూడా ఆలోగా రావొచ్చు. ఎవరు చెప్పగలరు. అప్పటి దాకా ఓపిక పట్టడం తప్ప చేసేదేమీ లేదు. అయినా మీకు ఈ గుణపాఠం జరగాల్సిందే. ఈటలను ఎందుకు గెలిపించారు మరి. అనుభవించండి.