aస్కూళ్లు లేకపోవడంతో పిల్లల చదువు అటకెక్కుతున్నాయి. పేరుకు ఆన్లైన్ క్లాసులు పెడుతున్నా.. అవి పెద్దగా ఉపయోగపడటం లేదు. దీంతో ఎప్పుడు స్కూళ్లు తెరుస్తారా? అని అంతా ఆసక్తి, ఆత్రుతతో ఎదురుచూస్తున్నారు. ఏపీ సర్కార్ ధైర్యం చేసి ఇటీవల స్కూళ్లను తెరిచింది. అయితే కొంత మంది పిల్లలకు కరోనా అంటుకున్నదనే ప్రచారం జోరందుకున్నది. దీంతో ఇప్పుడు మళ్లీ తెలంగాణ సర్కార్ స్కూళ్లు తెరిచే అంశంలో పునఃసమీక్షించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. సెప్టెంబర్ 1 నుంచి స్కూళ్లు తెరవాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భావించింది. ఈ మేరకు అన్నీ సిద్ధం చేసుకుంటున్నది. మరోవైపు ఏపీలో స్కూళ్లు తెరవడంతో ఇక్కడా ప్రభుత్వంపై ఒత్తిడి పెరిగింది. ఇప్పటికే ఫీజులు సరిగ్గా వసూలు కాక ప్రైవేటు యాజమాన్యం నానా ఇబ్బందులు పడుతున్నది. పరిస్థితి రోజు రోజుకు దిగజారుతున్నది. ఆన్లైన్ ఫీజులు నెలవారీగా వసూలు చేసుకుంటున్నా.. అవి అరకొరగానే వస్తున్నాయి. పిల్లల చదువుపై కరోనా తీవ్ర ప్రభావం చూపింది. ఈ నేపథ్యంలో ఇక వారం పదిరోజుల్లో స్కూళ్లు ఇక్కడ కూడా తెరుస్తారనే ప్రచారం ఊపందుకుంటున్న తరుణంలో ఏపీలో స్కూల్ పిల్లలకు కరోనా వచ్చిందనే వార్తలు ఒక్కసారిగా కలవరపాటుకు గురిచేశాయి. దీనిపై ఇక్కడి సర్కార్ ఆలోచన, నిర్ణయం ఏమిటో త్వరలోనే తెలియనుంది.
దాదాపుగా స్కూళ్లు తెరిచే ఆలోచన కొద్ది కాలం పాటు వాయిదా వేసుకునే అవకాశాలే కనిపిస్తున్నాయి.
