(దండుగుల శ్రీనివాస్)
ఫక్తు రాజకీయాలకు బీసీలు బలయ్యారు. అధికారమే పరమావధిగా.. బీసీలు, అణగారిన వర్గాలకు తీవ్ర నష్టం చేసేలా గత పాలన కొనసాగింది. కేసీఆర్ నియంత పాలనలో ఇదీ ఓ విధ్వంసం. జనాభా ప్రాతిపదికన సీట్లివ్వలే, రిజర్వేషన్లు అసలే అమలు చేయలే. దీన్ని 22 శాతానికి కుదించేసి తీవ్ర అన్యాయం చేసి చారిత్రక తప్పిదాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు కేసీఆర్. ఇప్పుడు ఇదే అంశంలో చారిత్రక నిర్ణయం తీసుకున్నది కాంగ్రెస్. రాజకీయంగా, విద్యా, ఉపాది పరంగా కూడా 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని నిర్ణయించింది. కులగణన చేసిందే ఇందుకు. ఇప్పుడు ఈ నిర్ణయంతో దీనికి పరిపూర్ణత లభించింది.
ఇది రేవంత్ పాలనలో ఎప్పటికీ గుర్తుండిపోయే చారిత్రక నిర్ణయం. బీసీలకు వాస్తవంగా ఇంకా పెంచి రిజర్వేషన్లు అమలు చేయాలి. కానీ ఇంత మాత్రం చేసిన ప్రభుత్వం ఏదీ లేదు. ఇంతలా చేయాలన్నా ఆ సర్కార్కు గట్స్ కావాలె. అవి తమకు ఉన్నాయని నిరూపించుకున్నది రేవంత్ సర్కార్. తెలంగాణ వచ్చిన తరువాత చాలా వర్గాలు నష్టపోయాయి. అందులో బీసీలు ప్రధానంగా ఉన్నారు. వీరికి రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగా ఎలాంటి మేలు జరగలేదు. అధికారం కోసం కేసీఆర్ తపించాడు తప్ప.. ఏనాడూ బీసీల కోసం ఆలోచించలేదు. అలా ఆలోచిస్తే అధికారమే కోల్పోతామనే భయం అతనిలో వెంటాడింది. అందుకే కేసీఆర్ అధికార వేటలో బీసీలు బలయ్యారు. ఇప్పుడు కాంగ్రెస్ వారికి ప్రాణం పోస్తోంది. ఇక దీన్ని కాదనేవాడే లేడు. రేవంత్ పరిపాలనలో చెప్పుకోదగ్గ అంశాలలో బీసీ రిజర్వేషన్ల ప్రధానంగా నిలిచిపోతుంది.
