మ్యాడం మధుసూదన్
సీనియర్ పాత్రికేయులు
9949774458
కల్వకుంట్ల కవిత రాజకీయాల్లో ఓ సంచలనం. వివాదాలు, అవమానాలను దాటుకుంటూ పడుతూ లేస్తున్న ఓ కెరటం. కవిత త్వరలో మరో సంచలనం సృష్టించబోతున్నారా..? ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను తలపించేలా మరో షర్మిలాగా మారబోతున్నారా..? బాణం సొంత ఇంటిపైనే వదలబోతున్నారా..? సామాజిక న్యాయమని తన పార్టీపైనే ఓ అస్త్రాన్ని సంధించబోతున్నారా..? తన సొంత పార్టీపైనే తిరుగుబాటు చేయబోతున్నారా..? ఆమె తన సామాజిక అస్త్రాన్ని ఎవరిపై సంధించబోతున్నారు. ఇదిప్పుడు రాజకీయాల్లో పెను సంచలనంగా మారబోతున్నది.
సామాజిక న్యాయం అనే పేరుతో ఆమె కొత్త పార్టీనే స్థాపించబోతున్నారా..? అవునా..? ఇది నిజమా..? అంటే… నిజమనే అనిపిస్తుంది ప్రస్తుత పరిణామాలను నిశితంగా పరిశీలిస్తే. సామాజిక సమతుల్యత, తెలంగాణ భౌగోళికంగా సాధించగలిగామే తప్ప.. సామాజిక తెలంగాణ సాధించలేకపోయామని ఆమె చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదస్పదంగా మారాయి. ఆమె ఎవరిపై బాణం ఎక్కుపెట్టారని చర్చనీయాంశమైంది. పదేండ్ల పాటు అధికారంలో ఉన్న తన సొంత ఇంటి పార్టీపైనే ఈ భాణం ఎక్కుపెట్టారనే అనుమానాలు కలిగాయి. కానీ ఇప్పుడు ఏకంగా ఆమె తన బాణాన్ని ఇంటిపైనే గురిపెట్టారని అర్థమవుతోంది.
మనం అధికారంలో ఉన్న పదేండ్లలో సామాజిక న్యాయం, మహిళలకు ప్రాధాన్యం ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నిస్తూ తన తండ్రి తెలంగాణ జాతిపితగా చెప్పుకుంటున్న కల్వకుంట్ల చంద్రశేఖర్రావుకే ఆమె లేఖాస్త్రాన్ని సంధించినట్టు అత్యంత విశ్వసనీయంగా తెలిసింది.
అందులో తన సోదరుడు కేటీఆర్, హ్యాపీరావుగా పేరుపడ్డ సంతోష్రావుల వైఖరిని కూడా తూర్పారబట్టినట్టు విశ్వసనీయ సమచారం. పార్టీలోనో , గత ప్రభుత్వంలోనో మహిళలకు ఏపాటి గౌరవం దక్కిందని ఆమె ప్రశ్నలు సంధించినట్టు తెలుస్తున్నది. వాస్తవానికి, ఢిల్లీ లిక్కర్ స్కాంలో నిందితురాలిగా తీహార్ జైలులో మగ్గి కొన్ని నెలల క్రితం విడుదలైన కవిత వైఖరిలో చాలా మార్పులు వచ్చాయి. తాను కష్టకాలంలో ఉన్నప్పుడు సొంత పార్టీగానీ, ఇంటి వారుగానీ తనకు అండగా నిలబడలేదన్న ఆవేదన ఆమెలో రగులుతున్నది. గతంలో బంగారు బతుకుమ్మగా ప్రసిద్ధి చెందిన ఆమె.. వైఖరి ప్రత్యక్ష్యంగా , పరోక్షంగా తెలంగాణ రాష్ట్ర సమితి పై, కేసీఆర్ రాజకీయాలపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపాయి. లిక్కర్ స్కాంలో కవితపై తీవ్రమైన చట్టపరమైన చర్యలు తీసుకోకపోవడం వల్ల టీఆరెస్ను అధికారాన్ని కోల్పోవడంతో పాటు, ప్రతిపక్ష హోదాకు దగ్గర్లో ఉన్న బీజేపీ కూడా భారీగా దెబ్బతిన్నది. చివరకు ఎక్కడో ఉన్న కాంగ్రెస్ పార్టీ అధికార పగ్గాలు చేపట్టాల్సిన అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి. రేవంత్ రెడ్డికి కూడా కవిత రూపంలో అదృష్టం కలిసివచ్చింది.
ఆ కృతజ్జతాభావంతో ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి కూడా ఆమె పట్ల సానుకూలంగా ఉన్నట్లు మరో సమాచారం. ప్రస్తుత ప్రభుత్వంపై కూడా కల్వకుంట్ల కవిత పరోక్షంగా ప్రత్యక్షంగా ప్రభావం చూపుతున్నట్టు బీఆరెస్ వర్గాల్లో అనుమానాలు, అపోహలున్నాయి.
ఎవరిపై కోసం.. ఎవరిపై భారం…
వాస్తవానికి కల్వకుంట్ల కవిత 2014లో నిజామాబాద్ ఎంపీగా భారీ మెజారిటీతో గెలిచారు. తరువాత ఎన్నికల్లో ఘోరపరాభవం పాలయ్యారు. నిజామాబాద్ పార్లమెంటు సభ్యురాలిగా ఘోర పరాభవం పాలైన తరువాత కల్వకుంట్ల కవిత వైఖరిలో మార్పు వచ్చింది. తన సొంత పార్టీ ఎమ్మెల్యేలు సహకరించకపోవడం, తోడబుట్టిన అన్న కేటీఆర్ అండగా నిలవకపోవడం వల్ల తాను ఎంపీగా పరాభవం పొందాల్సి వచ్చిందని ఆమె కోపంగా ఉన్నారు. తనకు భావగా ఉన్న హరీశ్రావును నిజామాబాద్ ఇంచార్జిగా నియమించాలనే సూచన కూడా బేఖాతరు చేయడం వల్ల తనకు అవమానకర పరిస్థితి ఏర్పడిందని ఆమె పరాభవ భావంతో ఉన్నారు. ఆ తరువాత క్రమక్రమంగా పార్టీలో తన పాత్రను కుదించడం, అతిబలవంతంగా ఎమ్మెల్సీగా ఎంపిక చేయడం పట్ల కవిత తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు. లిక్కర్ స్కాం పెద్దగా ఆధారాలు లేకపోయినా.. తనను తీహార్ జైలులో వేయడం, పార్టీ నుంచి ప్రతిఘటన పెద్దగా రాకపోవడం పట్ల కూడా ఆమె తీవ్ర మనోవేదనతో ఉన్నట్టు సమాచారం.
ఈ క్రమంలో ఆమె తన ఉనికి కోసం పార్టీ జెండా కాకుండా సొంత ఎజెండాను ఎంచుకున్నారు. బీసీలకు న్యాయం, సామాజిక తెలంగాణ అన్న నినాదంతో వడివడిగా ముందుకు కదులుతున్నారు. ఇటీవల ఓ సభలో భౌగోళిక తెలంగాణ సాధ్యమైంది కానీ, సామాజిక తెలంగాణ రాలేదని ఆమె ఆవేదన వ్యక్తం చేయడం తీవ్ర దుమారం రేపింది. ఆమె పార్టీ ఎజెండా కాకుండా బీసీ ఎజెండాను మోస్తూ రివర్స్ గేర్లో పయనిస్తున్నారు. అంతటితో ఆగకుండా పార్టీలో గానీ, ప్రభుత్వంలో గానీ సామాజిక తెలంగాణ ఎందుకు సాధ్యం కాలేదని తన తండ్రినే ప్రశ్నిస్తూ ఓ లేఖాస్త్రం సంధించినట్టు తెలుస్తున్నది. ఈ లేఖాస్త్రం సొంత ఇంట్లో తీవ్ర కలకలం రేపుతున్నట్లు ప్రచారం జరుగుతున్నది. ఇప్పుడిప్పుడే పార్టీలో కూడా ఈ చర్చ మొదలవుతున్నది. తన లేఖాస్త్రంలో తన సోదరుడు కేటీఆర్, సంతోష్రావు పాత్రలను కూడా ఆగ్రహం వ్యక్తం చేసినట్టు సమాచారం.
తను ఒక్క మహిళనేతగా, పార్టీ అధినేత కూతురిగా ఉన్న తననే అవమానంపాలు చేస్తున్నారంటే, సాధారణ మహిళల పరిస్థితితేంటని ఆమె ప్రశ్నించినట్టు తెలుస్తున్నది. ఒకరకంగా ఆమె జగనన్న వదలిన బాణం షర్మిలలా ఏ విధంగా తిరగబడ్డదో ఆ బాటలోనే కవిత నడుస్తున్నట్టు జరుగుతున్న ప్రచారం రాజకీయంగా ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ప్రస్తుతం ఆమె దూకుడు చూస్తుంటే సామాజికన్యాయం పేరుతో కొత్త పార్టీ పెట్టినా ఆశ్చర్యం లేదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. షర్మిళ తెలంగాణలో వైఎస్సార్ తెలంగాణ పార్టీ పెట్టినట్టే సామాజిక తెలంగాణ పేరుతో కొత్త పార్టీ పెట్టవచ్చనే ప్రచారం జరుగుతున్నది. దీనికి రంగం సిద్దం చేసుకున్నట్టు కూడా తెలుస్తున్నది.