(దండుగుల శ్రీనివాస్)
పదేండ్లు అనుభవించారు అధికారాన్ని. ఓ ఐదేండ్లూ ఆగలేరా..? ఆగేలా లేరు. అంతలా తెలంగాణ వారికి పేటెంట్ అని భావించి, భ్రమించి ఉన్నారు. అందులో బతుకుతున్నారు. అందుకే ఈ మాటలు. కొత్త ప్రభాకర్రెడ్డి వద్దకు వచ్చి ఎవడో అన్నాడట. ఈ ప్రభుత్వాన్ని కూలదోసేందుకు సుపారీ ఇస్తామని. అతగాడు అన్నాడు ఇవే మాటలను. వీటిని సమర్థిస్తూ కేటీఆర్ ప్రెస్మీట్. అవును. జనాలు అలాగే అనుకుంటున్నారని వత్తాసు పలుకులు పలికాడు. ప్రజాస్వామ్యంలో ప్రజల తీర్పును కూడా గౌరవించే సోయిని మరిచారు. తామేం తక్కువ తినలేదన్నట్టుగా మాట్లాడాడు కేటీఆర్.
తనదాకా వస్తే .. అన్నట్టు పక్కన బీజేపీ గోతికాడ నక్కలా పొంచి ఉన్న విషయం కనిపెట్టలేకపోతోంది. వారికే అధికారం అని ఫిక్సయిపోయినట్టున్నారు. ఏక్నాథ్ షిండే రాజకీయాలను చూసిన తరువాత మీకూ ఇదే గతి పట్టించే రోజులన్నాయని పక్కనే గుణపాఠాలు, అనుభవాలు జరిగిన తరువాత కూడా బీఆరెస్ పార్టీ కూడా బీజేపీకి మేమేం తక్కువ కాదన్నట్టుగా మాట్లాడటం ఈ రెండు పార్టీల అధికార దాహానికి నిదర్శనం. ఐదేండ్ల తరువాత ఎవరిని దించుతారో, ఎవరిని ఎక్కిస్తారో జనాలు తేల్చుకుంటారు. అప్పటి దాకా కూడా ఆగలేరా..?
ప్రజలెలా తీర్పివ్వబోతున్నారో కూడా ముందే చెప్పేసి, ఆ తరువాత వచ్చేది మేమే అని ప్రకటించేసుకుని, మేం వచ్చాకా.. మేం రాగానే, మేం వచ్చేస్తున్నాం.. అనే అధికారదాహ వ్యాఖ్యానాలు మూతిమతి తప్పిన మాటలుగా చూడాలా..? అహంకారం ఇంక వీడని పలుకులుగా భావించాలా.?? ఇవీ ప్రజలననుకునే మాటలే. మేం ప్రజల తీర్పును శిరసావహిస్తున్నామనే మాటలు తండ్రి కొడుకుల నోటి నుంచి రావడం లేదు. జనాలు సిగ్గుపడుతున్నారు, వారు తెలుసుకున్నారు. వాళ్లకు బుద్ది వచ్చింది…. ఇవే మాటలొస్తున్నాయి. మమ్మల్ని ఓడించినందుకు అనుభవిస్తున్నారని కూడా పిల్లిశాపాలు పెడుతున్నారు.
అంతలా అధికారానికి కనెక్టయిపోయి.. జనాల తీర్పును ధిక్కరించి వారిపై ప్రతీకారేచ్చతో రగిలిపోయి..ఇలా కడుపులో ఉన్న మాటలు బయటకు వస్తున్నాయన్నమాట. ప్రతిపక్షంగా మేం నిలదీస్తాం. సీఎం ఎవరున్నా.. ఇచ్చిన హామీలను అమలు చేసే దాకా ప్రజాకోర్టులో నిలబెడతాం.. అనే ప్రతిపక్ష నేతల్లా లేవామాటలు. జనాల ఎంత గోస పడితే అంత మంచిది. మధ్యలో సర్కార్ పడిపోతే ఇంకా మంచిది.. అన్నట్టుగానే ఉన్నాయి. ఎంతైనా అలవాటైన పానం. అధికారం లేకుండా ఐదేండ్లూ ఆగమంటే కష్టమే మరి.