మ్యాడం మ‌ధుసూద‌న్‌
సీనియ‌ర్ పాత్రికేయులు..

 

అత్యంత వివాదం సృష్టించిన కంచె గ‌చ్చిబౌలి భూముల వేలంపై స‌ర్కార్ ఆశ‌లు వ‌దులుకున్న‌ది. ఆ భూమి వేలం పాట‌ను శాశ్వ‌తంగా వాయిదా వేసుకోవాల‌ని నిర్ణ‌యానికి వ‌చ్చిన‌ట్టు విశ్వ‌స‌నీయ స‌మాచారం. దీనికి బ‌దులుగా రాజేంద్ర‌న‌గ‌ర్ నియోజ‌క‌వ‌ర్గ ప‌రిధి నార్సింగ్ స‌మీపంలోని పుప్పాల్‌గూడ‌లో 250 ఎక‌రాల భూమిని నాలెడ్జ్ పార్క్ పేరిట వేలం వేయ‌డానికి రంగం సిద్దం చేసుకున్న‌ది. ఈ మేర‌కు గ‌తంలో ఐఏఎస్, ఐపీఎస్, ఎంపీ, ఎమ్మెల్యేల ఇండ్ల కోసం కేటాయించిన 250 ఎక‌రాల‌ను ప్ర‌భుత్వం తిరిగి స్వాధీనం చేసుకుంటున్న‌ది. దీంతో పాటు దాని ప‌క్క‌న ఉన్న 200 ఎక‌రాల ప్ర‌భుత్వ భూమిని వేలం వేయ‌డానికి ప్ర‌య‌త్నిస్తున్న‌ది స‌ర్కార్‌. హైద‌రాబాద్ సెంట్ర‌ల్ యూనివ‌ర్సిటీ ప‌రిధిలోని 400 ఎక‌రాల ప్ర‌భుత్వ భూమిని వేలం వేయ‌డానికి రాష్ట్ర ప్ర‌భుత్వం చేసిన ప్ర‌య‌త్నం గ‌ల్లీ నుంచి ఢిల్లీ దాకా దుమారం రేపింది.

18Vastavam.in (5)

గ‌తంలో ఎన్న‌డూ లేనివిధంగా సుప్రీంకోర్టు రెండుసార్లు ప్ర‌భుత్వాన్ని తీవ్రంగా మంద‌లించింది. స‌హ‌జ‌సిద్దంగా , ఏపుగా పెరిగిన చెట్ల‌ను ఎట్లా నేల‌మ‌ట్టం చేస్తార‌ని ప్ర‌శ్నించి అధికారులు జైలుకు వెళ్ల‌డానికి కూడా సిద్దం కావాల‌ని హెచ్చ‌రించింది. ఈ క్ర‌మంలో సుప్రీంకోర్డు నియ‌మించిన హైప‌వ‌ర్ క‌మిటీ గ్రౌండ్ రిపోర్టు కూడా ఇదే విషయాన్ని నివేదించింది. ప్ర‌భుత్వం స్వాధీనం చేసుకున్న 400 ఎక‌రాల భూమిలో అపార ప్ర‌కృతి సంప‌ద ఉంది… వ‌న సంప‌ద‌తో పాటు , వ‌న్య‌ప్రాణులు కూడా ఉన్నాయ‌ని హైప‌వ‌ర్ క‌మిటీ గుర్తించింది. ఈ స‌ద‌రు భూమిని డీమ్డ్ ఫారెస్టుగా ప్ర‌క‌టించే ప‌రిస్థితులు క‌నిపిస్తున్నాయి. వాస్త‌వానికి 1996లో సుప్రీంకోర్టు ఒక కేసులో ఇచ్చిన తీర్పు గ‌చ్చిబౌలి భూముల‌కు వ‌ర్తించే ప‌రిస్థితులు మెండుగా ఉన్నాయి. స‌హ‌జ సిద్ద‌మైన వృక్ష‌సంప‌ద‌, వ‌న్య‌ప్రాణులు ఉన్న ప్రాంతాలను ప్రైవేటు భూమైనా, ప్ర‌భుత్వ భూమైనా,ఇంకా ఏ స్థ‌ల‌మైనా దానిని అట‌వీభూమిగా ప‌రిగ‌ణించే అధికారాన్ని సుప్రీంకోర్టు ప్ర‌భుత్వాలకిచ్చింది.

సుప్రీంకోర్టు దీని కోసం ప్ర‌త్యేక కమిటీ వేసి విశేష అధికారాలిచ్చింది. ఎక్క‌డెక్క‌డ స‌హ‌జ సంప‌ద ఉందో, వ‌న సంప‌ద ఉందో ఆ భూముల‌ను గుర్తించి డీమ్డ్ ఫారెస్టుగా గుర్తించి చ‌ర్య‌లు తీసుకోవ‌డానికి ఆయా రాష్ట్ర ప్ర‌భుత్వాలు ప్ర‌త్యేక క‌మిటీల‌ను వేయాల‌ని ఆదేశించింది. ఆ మేరకు తెలంగాణ ప్ర‌భుత్వంతో పాటు దాదాపు అన్ని రాష్ట్ర ప్ర‌భుత్వాలు క‌మిటీలు కూడా వేశాయి. గ‌త కేసీఆర్ స‌ర్కార్ కొంత ఆల‌స్యంగా స్పందించింది. దీని ప్ర‌కారం అడ‌వి ల‌క్ష‌ణాలున్న ఏ ప్రాంతాన్నైనా అట‌వీ భూమిగా ప్ర‌క‌టించే ప‌రిస్థితి ఉంటుంది. ఇదే విష‌యాన్నిఇటీవ‌ల హై ప‌వ‌ర్ క‌మిటీ కూడా ప‌రోక్షంగా ప్ర‌స్తావించింది.

అయితే, అటు కేంద్ర ప్ర‌భుత్వం కూడా స‌హ‌క‌రించ‌కపోవ‌డం వ‌ల్ల రేవంత్ స‌ర్కార్ ఇర‌కాటంలో ప‌డ్డ విష‌యం తెలిసిందే. ప్రధానమంత్రి న‌రేంద్ర మోడీ కూడా ఈ విష‌యంలో ప్ర‌భుత్వాన్ని త‌ప్పుబ‌ట్టి మాట్లాడ‌టం ప‌రిస్థితి తీవ్ర‌త‌కు అద్దం ప‌డుతోంది. ఎంత ఏం చేసినా.. సుప్రీంకోర్టు డీమ్డ్ ఫారెస్టు గా ప్ర‌క‌టించే అవ‌కాశం ఉన్నందున ఇక ప్ర‌భుత్వం పీచేమూడ్ అన‌క త‌ప్ప‌డం లేదు. ఇక ఐఏఎస్‌, ఐపీఎస్‌, ఎంపీ, ఎమ్మెల్యేల భూముల‌కు స‌ర్కార్ మంగ‌ళం పాడిన‌ట్టే. ఎందుకంటే హైద‌రాబాద్ ప‌రిధిలో ఎమ్మెల్యే, ఎంపీల‌కు ఇత‌రుల‌కు కేటాయించ‌డాన్ని సుప్రీం త‌ప్పుబ‌ట్టింది. ర‌ద్దు చేసింది. ఈ క్ర‌మంలో జ‌ర్న‌లిస్టుల‌కు ప్ర‌భుత్వం నిజాంపేట‌, పేట్ బ‌షీరాబాద్ లో కేటాయించిన భూముల‌పై ఇరకాటం నెల‌కొన్న‌ది.

You missed