(దండుగుల శ్రీ‌నివాస్‌)

బిగ్ టీవీ మేనేజ్‌మెంట్ నుంచి వ‌చ్చిన డిజిట‌ల్ పత్రిక స్వేచ్ఛ కు తెర ప‌డుతున్న‌ట్టు తెలుస్తోంది. ఎన్నిక‌ల ముందు పూర్తిగా కాంగ్రెస్‌కు స‌పోర్టు చేసిన ఈ మేనేజ్‌మెంట్ ఇటీవ‌ల స్వేచ్చ పేరుతో డిజిట‌ల్ ప‌త్రిక‌ను కూడా ప్రారంభించింది. దీని వెనుక సీఎం రేవంత్ స‌పోర్టు ఉంద‌నే ప్ర‌చారం జ‌రిగింది. కానీ మేనేజ్‌మెంట్ సొంతంగానే ఈ ఈ ప‌త్రిక‌ను ర‌న్ చేసేందుకు నిర్ణ‌యం తీసుకున్న‌ది. సీఎం రేవంత్‌తో మంచి సంబంధాలున్న మేనేజ్‌మెంట్.. ప్ర‌భుత్వానికి స‌పోర్టుగా డిజిట‌ల్ మీడియా కూడా ఉంటే బాగుంటుంద‌ని భావించింది. కానీ ప్ర‌భుత్వ పెద్ద‌ల నుంచి పెద్ద‌గా స‌హ‌కారం అంద‌లేద‌నే ప్ర‌చార‌మూ జ‌రిగింది. అన‌తికాలంలోనే ప‌త్రిక‌ను న‌డ‌ప‌డం భారంగా భావించింది మేనేజ్‌మెంట్.

దీంతో ఏపీ, తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ ప‌త్రిక‌కు సంబంధించిన ఉద్యోగుల‌ను గ‌ణ‌నీయంగా త‌గ్గించ‌డంతో పాటు ప‌త్రిక పేజీల‌ను కూడా కుదించేయాల‌ని నిర్ణ‌యం తీసుకున్న‌ది. ఈ మేర‌కు హెవోడీల‌కు ఆదేశాలు అందాయి. దీంతో ఉద్యోగులు ఆందోళ‌న‌లో ప‌డ్డారు. వివిధ ప‌త్రిక‌ల నుంచి వ‌చ్చిన వారి ప‌రిస్థితి ఏంద‌నే ఆందోళ‌న ఇప్పుడు ఈ మీడియా హౌజ్ లో కొన‌సాగుతోంది. పూర్తిగా ప‌త్రిక‌ను మూసేయ‌కున్నా.. ఇప్పుడున్న భారాన్ని భారీగా త‌గ్గించుకునే ప్ర‌య‌త్న‌మైతే జ‌రుగ‌తున్న‌ది. క్ర‌మంగా ఇది పూర్తిగా పత్రిక మూసివేత‌కు దారి తీస్తుందా..? చూడాలి. బిగ్‌టీవీని బ‌లోపేతం చేయ‌డంపైనే ప్ర‌స్తుతం మేనేజ్‌మెంట్ దృష్టి సారిస్తున్న‌ట్టు తెలుస్తోంది.

డిజిట‌ల్ ప‌త్రిక‌ను తీసుకొచ్చి ఏదో చేద్దామ‌ని చూసినా.. అది స‌క్సెస్‌ఫుల్‌గా ముందుకు సాగ‌క‌పోవ‌డం, ప్ర‌భుత్వ పెద్ద‌ల నుంచి పెద్ద‌గా స‌హ‌కారం అంద‌క‌పోవ‌డం, అంత‌ర్గ‌త కుమ్ములాట‌లు కూడా ఈ ప‌రిణామాల‌కు కార‌ణాలుగా చెబుతున్నారు. పూర్తి వివ‌రాలు త్వ‌ర‌లోనే వెలుగులోకి రానున్నాయి.

You missed