(దండుగుల శ్రీ‌నివాస్‌)

అక్క‌డంతే. పెద్ద‌రాయుడి తీర్పులు ఇస్తారు. వారే అక్క‌డ అధికారులు, పోలీసులు. స‌మాంత‌ర ప్ర‌భుత్వం న‌డుపుతూ ఉంటారు. దీనికి ముద్దుగా విలేజ్ డెవ‌ల‌ప్‌మెంట్ క‌మిటీ (వీడీసీ) అని పేరు పెట్టుకుంటారు. ఆ పేరుతో ఆ గ్రామాల‌ను చెర‌బ‌డ‌తారు. వారు చెప్పింది చేయాలి. వినాలి. లేక‌పోతే ఆ కులాన్ని బ‌హిష్క‌రిస్తారు. ఆ కుటుంబాల‌ను వెలి వేస్తారు. వారికి ఆ గ్రామంలో ఎవ‌రూ సాయం చేయొద్దు. ఎలాంటి సౌక‌ర్యాలు అందించ‌వ‌ద్దు. ఎవ‌రూ మాట్లాడొద్దు. గుళ్ల‌కు రానీయొద్దు…ఇంకా ఇంకా చాలా. ఇదో అనాగ‌రిక చ‌ర్య‌. అనాదిగా ఇక్క‌డ కొన‌సాగుతోంది. దీనికి కేంద్రంగా మారింది నిజామాబాద్ జిల్లా. ఈ జిల్లాలోని ఆర్మూర్‌, నిజామాబాద్ రూర‌ల్‌, బాల్కొండ నియోజ‌క‌వ‌ర్గాల్లో వీడీసీ ఆగ‌డాలు శృతి మించిపోయాయి. ప్ర‌స్తుతం మ‌నం చెప్పుకునే వార్త‌…. బాల్కొండ నియోజ‌క‌వ‌ర్గంలోనిది. ఇది మాజీ మంత్రి ప్ర‌శాంత్‌రెడ్డి ప్రాతినిథ్యం వ‌హించిందిన నియోజ‌క‌వ‌ర్గం.

ఈర‌వ‌త్రి అనిల్ ఎమ్మెల్యేగా ఏలిన నియోజ‌క‌వ‌ర్గం. ప్ర‌స్తుత పీసీసీ చీఫ్ మ‌హేశ్‌కుమార్ గౌడ్ సొంత నియోజ‌క‌వ‌ర్గం. కుల బ‌హిష్క‌ర‌ణ‌కు గురైంది గౌడ్లు. ఏర్గ‌ట్ల మండ‌లం తాళ్ల రాంపూర్ గ్రామంలోని 52 గౌడ కుటుంబాల‌ను ఏడు నెల‌లుగా బ‌హిష్కరించారు వీడీసీ పెద్ద‌లు. ఏడాదికి ఇచ్చే క‌ల్లు మామ్లా పైస‌లు అనుకున్నంత కాకుండా త‌గ్గించి ఇచ్చార‌నేదే దీనికి కార‌ణం. అయితే ఇది మొన్న శ్రీ‌రామ న‌వమి రోజున బ‌య‌ట ప్ర‌పంచానికి తెలిసింది. రామాల‌యంలోకి ఆ గుడి పూజారి గౌడ మ‌హిళ‌ల‌ను రానీయ‌లేదు. దీంతో మ‌హిళంతా వెళ్లి పోలీసు స్టేష‌న్‌లో ఫిర్యాదు చేశారు. తూతూ మంత్రంగా పోలీసులు కేసులు న‌మోదు చేసినా… అరెస్టులు మాత్రం చేయ‌లేక‌పోయారు. పోలీసులపైనే తిర‌గ‌బ‌డ్డారు వీడీసీ పెద్ద‌లు.

దీంతో ప్రాణాల‌ర‌చేతిలో పెట్టుకుని పోలీసులే పారిపోయి వ‌చ్చారు. సారీ, మేం విఫ‌ల‌మ‌య్యామ‌ని పోలీసులే త‌ల‌వంచాల్సిన ప‌రిస్థితి అక్క‌డ ఉంది. ఇది ఇప్పుడు కొత్త కాదు. ఇక‌పై ఆగ‌వు. అన్ని కులాల‌పై ఇదే పెత్త‌నం. చెప్పింది చేయాలి. అంతే. నాయకులు వీరి జోలికి పోవాలంటే జంకుతారు. ఎన్నిక‌ల్లో ఓడ‌గొడ‌తార‌ని. వీడీసీ ఎవ‌రికి మ‌ద్ద‌తిస్తే వారే గెలిచిన‌ట్టు లెక్క‌. అందుకే గ‌జ్జున వ‌ణిక‌పోతారు మంత్రైనా, ఎమ్మెల్యే అయినా. క‌లెక్ట‌ర‌యినా.. పోలీసైనా. మాపైనే అరెస్టులా అంటూ గౌడ కుల‌స్తుల ఈత వనాల‌ను కూడా త‌గుల‌బెట్టేశారు వీడీసీ పెద్ద‌లు. అలా ఉంది ఇక్క‌డ అరాచ‌కం. మ‌రి పీసీసీ చీఫ్ ఇలాఖాలో గౌడ్ల‌పై ఇంత‌టి ఘోరం దారుణం జ‌రుగుతున్నా.. స‌ర్కార్ పెద్ద‌గా ప‌ట్టించుకున్న‌ట్టు లేదు. ప‌ట్టించుకోదు కూడా. ఎందుకంటే ఇదిక్క‌డ ష‌రా మామూలే.

You missed