మ్యాడం మ‌ధుసూద‌న్‌
సీనియ‌ర్ పాత్రికేయులు

ముందు పోతే నుయ్యి వెనుక పోతే గొయ్యిలా మారింది స‌ర్కార్ ప‌రిస్థితి. గ‌త పాల‌కుల ఒప్పులు ఈ పాల‌కుల త‌ప్పుల‌యిపోయాయి. ల‌గ‌చ‌ర్ల నుంచి మొద‌లుకొని హెచ్‌సీయూ భూముల వ‌ర‌కు ఒక్క‌దాని వెంట ఒక‌టి వివాదాలు మెడ‌కు చుట్టుకుంటున్నాయి. పార్టీ ఫిరాయించినంత మాత్రాన ఎన్నిక‌లు రావ‌ని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా చేసిన వ్యాఖ్య‌లు పాల‌క పార్టీ మొత్తాన్నే సంక‌టంలో నెట్టేసింది. దీనిపై తీవ్రంగా స్పందించిన సుప్రీం కోర్టు ..స్పీక‌రే సుప్రీం కాదు త‌లుచుకుంటే మేము కూడా ఆదేశాలివ్వ‌గ‌లుగుతాం ఖ‌బ‌ర్దార్ అన్న‌ట్టు వ్యాఖ్యానించ‌డం తీవ్ర దుమారం రేపుతోంది. తీవ్ర అసంతృప్తితో ఉన్న సుప్రీంకోర్టు ఎలాంటి తీవ్ర‌మైన నిర్ణ‌యం తీసుకుంటుందోన‌న్న ఆందోళ‌న పాల‌క‌పార్టీలో ఉంది.

ఇది ఇలా ఉంటే, హెచ్‌సీయూ భూముల‌పై ఇప్ప‌టికే హైకోర్టు ప్ర‌తికూలంగా స్పందించ‌గా, సుప్రీం కోర్టు మ‌రో తీవ్ర‌మైన నిర్ణ‌యం తీసుకున్న‌ది. ఒక‌నెల‌లో నిపుణుల క‌మిటీ ఏర్పాటు చేయాల‌ని, ఆరు నెల‌ల్లో గ్రౌండ్ రిపోర్టు ఇవ్వాల‌ని ఆదేశించ‌డంత తీవ్ర సంచ‌ల‌నం రేపింది. దీంతో రాష్ట్ర ప్ర‌భుత్వం యుద్ద ప్రాతిప‌దిక‌న ప్రారంభించిన ప‌నుల‌కు బిగ్ బ్రేక్ ప‌డింది. ఇప్పుడు క‌మిటీ ఏర్పాటు చేయాలె. త‌రువాత క‌మిటీ ఏం చెప్పిందో దాని నివేదిక త‌యారు చేయాలె. కోర్టుకు స‌మ‌ర్పించాలె. అప్ప‌టి వ‌ర‌కు ప‌నులు లేన‌ట్టే. దీంతో రాష్ట్ర ప్ర‌భుత్వం చేసిన ప్ర‌య‌త్నాలు ప్ర‌స్తుతానికి బూడిద‌లో పోసిన ప‌న్నీరుగా మారాయి. సీఎం సొంత నియోజ‌క‌వ‌ర్గం ల‌గ‌చ‌ర్ల‌లో భూసేక‌ర‌ణ కూడా తీవ్ర వివాద‌స్పంగా మారి.. బ్రేక్ ప‌డిన సంగ‌తి తెలిసిందే. ప్ర‌స్తుతం రైతుల‌ను ఒప్పించి మెప్పించి భారీ న‌ష్ట‌ప‌రిహారంతో మెల్ల‌మెల్ల‌గా ల‌గ‌చ‌ర్ల‌లో భూసేక‌ర‌ణ చేస్తున్నారు. దీనికి కూడా ప్ర‌భుత్వం భారీ మూల్యాన్ని చెల్లించుకోవాల్సి వ‌స్తున్న‌ది.

04Vastavam.in (6)

భ‌విష్య‌త్‌ ప‌రిణామాల‌ను ముందుగా అంచ‌నా వేయ‌కుండా హ‌డావుడిగా ప్ర‌భుత్వం నిర్ణ‌యం తీసుకోవ‌డం, వెంట‌నే ప‌నులను ప్రారంభించ‌డం.. గంద‌ర‌గోళానికి, అనుమానాల‌కు, అపోహ‌ల‌కు ఆస్కార‌మిస్తూ ప్ర‌జాందోళ‌న‌ల‌కు దారి తీస్తున్న‌ది. ప్ర‌భుత్వ స్పీడ్ యాక్ష‌న్‌కు అధికారులు కూడా సంక‌టంలో ప‌డుతున్నారు.ఇప్పుడు తాజాగా హెచ్‌సీయూ భూముల వ్య‌వ‌హారం స‌ర్కార్ మెడ‌కు చుట్టుకున్న‌ది. గ‌తంలో పాల‌క పార్టీలు భారీ ఎత్తున భూసేక‌ర‌ణ‌తో పాటు వేలం పాట‌లు నిర్వ‌హించినా పెద్ద‌గా రాని ప్ర‌జాందోళ‌న.. కాంగ్రెస్ ప్ర‌భుత్వానికి మాత్రం ప్ర‌తికూలంగా మారుతున్న‌ది. గ‌తంలో ప్ర‌తిప‌క్షాలు బ‌ల‌హీనంగా ఉండ‌టం, పాల‌క ప‌క్షాలు బలంగా ఉండ‌టంతో ఆ ప‌రిస్థితి నెల‌కొన్న‌ది. కానీ, ప్ర‌స్తుతం పాల‌క పార్టీలో నేత‌లంతా ఒక్క‌తాటిపై లేక‌పోవ‌డం, ప్ర‌భుత్వం కూడా బ‌లంగా క‌నిపించ‌క‌పోవ‌డం.. అనుభ‌వ‌లేమి, అవ‌గాహ‌న రాహిత్యంతో వ్య‌వ‌హ‌రించ‌డం వ‌రుస వైఫ‌ల్యాల‌కు కార‌ణ‌మ‌వుతున్న‌ది.

హెచ్‌సీయూ భూములు స‌ర్కారువే అయిన‌ప్ప‌టికీ , ప‌ర్యావ‌ర‌ణ ప‌రిర‌క్ష‌ణ‌ను విద్యార్థుల భ‌విష్యత్‌ను పెద్ద‌గా ప‌రిగ‌ణ‌లోకి తీసుకోక‌పోవ‌డం వ‌ల్ల గ‌ల్లీ నుంచి ఢిల్లీదాకా నిర‌స‌న సెగ‌లు వ్యాపించాయి. చివ‌ర‌కు సుప్రీంకోర్టే రంగంలోకి దిగాల్సిన ప‌రిస్థితులు ఏర్ప‌డ్డాయి. గ‌తంలో భూములు వేలం వేసిన ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష పార్టీ నాయ‌కులు కూడా రెచ్చ‌గొట్టే వ్యాఖ్య‌లు చేయ‌డం విశేషం. ఎవ‌రైనా భూములు కొనుక్కుంటే వాప‌స్ తీసుకుంటామ‌ని కేటీఆర్ చేసిన వ్యాఖ్య‌లు బాధ్య‌తారాహిత్య‌మైన‌వ‌ని విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి. అధికారంలో ఉన్న‌ప్పున‌డు బీఆరెస్ వేలం పాట‌ల ద్వారా అమ్మిన భూముల‌ను ఇప్పుడు వెన‌క్కి తీసుకోవ‌చ్చా అని సోష‌ల్ మీడియా వేదిక‌గా చాలా మంది ప్ర‌శ్నిస్తున్నారు. బీఆరెస్ చేస్తే సంసారం , కాంగ్రెస్ చేస్తే వ్య‌భిచార‌మా ఇదేం న్యాయ‌మ‌ని కూడా ప్ర‌శ్నిస్తున్నారు. భూముల‌ను వెన‌క్కి తీసుకుంటామ‌ని మాట్లాడే నైతిక హ‌క్కు కేటీఆర్‌కు లేద‌ని నెటిజ‌న్లు దుమ్మెత్తిపోస్తున్నారు.

రేవంత్ స‌ర్కార్ నిధుల సేక‌ర‌ణ‌కు ర‌క‌ర‌కాల ప్ర‌య‌త్నాలు చేసిన‌ట్టే గ‌త ప్ర‌భుత్వాలు కూడా ఇదే ప‌ద్ద‌తిని అనుస‌రించాయి. భారీ నీటి పారుద‌ల ప్రాజెక్టుల కోసం బుల్డోజ‌ర్ల ప‌ద‌ఘ‌ట్ట‌న‌లో గ్రామాలు గ్రామాలే క‌నుమ‌రుగైపోయాయి. కోకాపేట వంటి విలువైన భూములు ప్రైవేటు వ్య‌క్తుల ప‌ర‌మ‌య్యాయి. ప్ర‌స్తుత రేవంత్ స‌ర్కార్ వేలం పాట‌ల‌కు చేస్తున్న ప్ర‌య‌త్నాలు కొత్త‌వేం కావు. కానీ, ఆ నిర్ణ‌యం తీసుకోవ‌డంలో ఒక ప‌ద్ద‌తి ప్ర‌కారం వ్యూహాత్మ‌కంగా ముందుకు సాగ‌డంలో కొంత వైఫ‌ల్యం చెందుతున్న‌ది. హైడ్రా నుంచి మొద‌లుకొని ఏ తొంద‌రపాటు నిర్ణ‌య‌మైనా, అవ‌స‌ర‌మైన నిర్ణ‌య‌మైనా వివాదాల‌కు కేంద్ర బిందువు కావ‌డం ప్ర‌స్తుత స‌ర్కార్‌కు ఒక దుర‌దృష్ట ప‌రిణామంగా చెప్ప‌వ‌చ్చు. హైడ్రా పేరిట సాహ‌సోపేతంగా కొన్ని అక్ర‌మ నిర్మాణాలు కూల్చిన‌ప్ప‌టికీ స‌ర్కార్‌కు ఎంత క్రెడిట్ రావాలో అంత రేటింగ్ రాలేదు. అధికారుల చిన్న చిన్న పొర‌పాట్లు, తొంద‌రపాటు నిర్ణ‌యాలు స‌ర్కార్‌కు శాపంగా మారాయి.

ముంద‌స్తు ప‌క‌డ్బందీ ప్ర‌ణాళిక లేక‌పోవ‌డం, నిర్ణ‌యాలు తీసుకునే ముందు ప‌క్కా ప్ర‌ణాళిక లేక‌పోవ‌డం స‌ర్కార్‌కు ప్ర‌తికూలంశంగా మారుతున్న‌ది. హైకోర్టు నుంచి సుప్రీం కోర్టు వ‌ర‌కు ప్ర‌తికూల తీర్పులు వ‌స్తున్నాయి. ఇక‌నైనా ప్ర‌భుత్వం స‌మ‌గ్ర ప్ర‌ణాళికతో ప్ర‌జ‌ల‌ను ఒప్పించి మెప్పించే విధంగా అడుగు ముందుకు వేయ‌డం మంచిది. ముందు ముందు మూసీ ప్ర‌క్షాళ‌న లాంటి ప్రాజెక్టుల స‌వాళ్లెన్నో ఎదుర్కోవాల్సి ఉంటుంది. అవ‌న్నింటినీ దృష్టిలో పెట్టుకుని ప్ర‌భుత్వం ఆచితూచి అడుగు వేయాల్సిన ప‌రిస్థితి నెల‌కొన్న‌ది.

గతం లో ఎన్నడూ లేని విధంగా మా ఆదేశాలను అతిక్రమిస్తే గచ్చిబౌలి లో పనులు చేపిస్తే జైలుకు వెళ్లాల్సివస్తుందని రాష్ట్ర ఉన్నతాధికారి చీఫ్ సెక్రటరీ ను సుప్రీం కోర్టు ధర్మాసనం హెచ్చరించడం తీవ్ర దుమారం రేపుతోంది. రాజకీయ ప్రమేయం లేకుండానే విద్యార్థులు చేసిన పోరాటం స్ఫూర్తినిచ్చింది.

You missed