వాస్తవం ప్రతినిధి – హైదరాబాద్:
కేటీఆర్ సోషల్ మీడియా పవర్ తెలుసుకున్నాడు. దాన్నే ఆధారం చేసుకుని రాజకీయం నడుపుతున్నాడు. రేవంతుకు కూడా తెలుసు సోషల్ మీడియా పవర్ ఏందో…? రెండు వైపులా పదునైన కత్తి అది. తేనె పూసిన కత్తి కూడా. కానీ ఎందుకో అధికారంలో ఉన్నప్పుడు కేటీఆర్ దీన్ని పట్టించుకోలే. అధికారం వచ్చినంక రేవంత్ కస్సుమంటున్నాడు. బట్టిలిప్పి కొడతాం రోయ్…! అని కూడా కత్తిదూస్తున్నాడు.
సరే ఇప్పుడీ ముచ్చటంతా ఎందుకంటారా..? హెచ్సీయూ భూములు మావేనని ఏ క్షణాన రేవంత్ అన్నాడో.. బుల్డోజర్లను ఆడికి పంపి సాఫ్ సఫాయి చేపించేందుకు బుల్డోజర్లను దింపాడో… ఇగ అప్పుడే రంగంలోకి దిగాడు కేటీఆర్ అండ్ టీమ్. టీమ్ అంటే నమస్తే తెలంగాణో… ఇంకేదో కాదు. సోసల్ మీడియా టీమ్. గ్రాఫిక్స్తో కూడా ఫోటోలను కుమ్మేశారు సోషల్ మీడియాలో. అడవిలో దుప్పులు, జింకలు, నెమళ్లు ఎట్లా ప్రాణాలరచేతిలో పట్టుకుని గుండెలు కకావికలమై పారిపోతున్నాయో కళ్లకు కట్టేటట్టు ఆ ఫోటోల్లో పొందుపర్చారు. తమ కళను మొత్తం ఇలా కల్పిత ఫోటోల్లో కుమ్మరించారు. అందరి కళ్లను చెమర్చేలా అమర్చారు. కదలించేలా కనికట్టు చేశారు.
అందరినీ అయ్యో అనేటట్టు చేశారు. దీనికి కారణమైన కాంగ్రెస్పై కత్తికట్టేలా చేశారు. పళ్లు పటపటా కొరుకుతూ కాంగ్రెస్ సర్కార్ను కాలరాస్తామని శపథం చేపిచ్చేలా పనికానిచ్చేశారు. మొత్తానికి గెలిచారు. కేటీఆర్ సాధించాడు. సోషల్ మీడియాను చేతిలో పెట్టుకుని.