వాస్తవం ప్రతినిధి – నిజామాబాద్:
అది మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ఇలాఖా. ఇసుక ద్వారా ప్రభుత్వానికి ఆదాయం సమకూర్చిపెట్టే కీలకమైన శాఖ ఆయనదే. కానీ అదే ఇలాఖాలో ప్రభుత్వ ఆదాయానికి గండి పడుతోంది. కోట్ల రూపాయలు అక్కడ ఇన్చార్జి లీడర్ జేబులోకి వెళ్తున్నాయి. దీనికి ఇంచార్జి మినిష్టర్ వంత పాడుతున్నాడు. ఇదంతా ఎక్కడ అనుకుంటున్నారా..? బాల్కొండ నియోజకవర్గంలో. అక్కడ ఓడింది ముత్యాల సునీల్రెడ్డి. ఖనిజాభివృద్ధి సంస్థ చైర్మన్గా ఈరవత్రి అనిల్ ఉన్నారు. ఇక్కడ నుంచి ఆయన గతంలో ఎమ్మెల్యేగా గెలుపొందారు. రేపు ఇక్కడి నుంచే పోటీ చేయడానికి అన్నిశక్తులూ రెడీ చేసుకుంటున్నారు. కానీ ఓడిన, ఇంచార్జిగా ఉన్న ముత్యాల సునీల్రెడ్డి మాత్రం తన అప్పులు తీర్చుకునేందుకు ఇసుకను ఆధారం చేసుకున్నాడు.
ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండికొడుతున్నాడు. ఈ నియోజకవర్గంలో మొత్తం 8 ఇసుక పాయింట్లున్నాయి. ఒక్కో ట్రాక్టర్కు రూ. 900 వసూలు చేసి ప్రభుత్వానికి ఆదాయం సమకూర్చాలనేది అనిల్ తాపత్రయం. అదే సూచించారు కూడా. కానీ సునీల్ వినలేదు. తను ముందే అప్పుల్లో కూరుకుపోయాడు. ఆరెంజ్ ట్రావెల్స్ డ్రైవర్లకు జీతాలు కూడా ఇయ్యలేని పరిస్తితి. దీని నుంచి గట్టెక్కాలంటే ఒకటే మార్గం. బంగారు బాతులాంటి ఇసుక ను ఆధారం చేసుకోవడమే. అదే చేశాడు. నిజామాబాద్ జిల్లా ఇంచార్జి మంత్రిగా ఉన్న జూపల్లి కృష్ణారావును వేడుకున్నాడు. ఇసుక ఫ్రీ అని ప్రకటించేసుకున్నాడు. కలెక్టర్కు కూడా ఆదేశాలిచ్చాడు. కలెక్టర్ కిమ్మనలేదు. ఓకే చెప్పాడు. దీంతో ఒక్కో ట్రాక్టర్కు రూ. 500 వసూలు చేస్తూ కౌంటర్ ఓపెన్ చేశాడు సునీల్. కోట్లలో ప్రభుత్వ ఆదాయాని గండి పడుతున్నా అక్కడ ఎవరూ ఏమనరు. ఎందుకంటే అధికార పార్టీ లీడర్. ఇంచార్జి. ఈ ఇసుకను ఆ జిల్లాకే కాదు పక్క జిల్లాలకు కూడా తరలించేస్తూ కోట్ల కూడబెట్టే పనిలో ఉన్నాడు సునీల్. అనిల్ మాత్రం ప్రేక్షకపాత్ర పోషిస్తున్నాడు. చేసేదేమీలేక.
పేదలకు, ఇందిరమ్మ ఇళ్లకు మాత్రమే ఫ్రీ ఇస్తే సరిపోతుందని అనిల్ చెప్పినా సునీల్ వినలేదు. అంతరికీ ఫ్రీ అన్నాడు. ఆపేరుతో అధికారులకు ఇవ్వాలంటే ట్రాక్టర్కు రూ. 500 వసూలు చేస్తున్నాడు. ఇదీ అక్కడ జరుగుతున్నతంతు.