(దండుగుల శ్రీనివాస్)
సోయితప్పి మాట్లాడుతుంటాడు. ఆ ఇష్యూ ఎంతటి సెన్సిటీవో తెలుసు. కానీ ఆయన మాటల కరుకుదనం, కాఠిన్యం.. అవగాహనలేమి ఉన్న సమస్యలు చాలవంటూ కొత్త సమస్యలు తెచ్చిపెడతాయి. పేరుకు పెద్ద సీనియర్.. కానీ అనుచరణలో అనుభవం అణుమాత్రం కూడా కనిపించదు. ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడిన నాటి నుంచి వ్యవసాయ శాఖ మంత్రిగా ఆయన బాధ్యతలు తీసుకున్న రోజు నుంచి ఆయన వేసే ప్రతీ స్టెప్పూ, ప్రతీ మాట ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టడానికే అన్నట్టుంది.
రైతులను మరింతగా సర్కార్కు దూరం చేసే విధంగానే ఉంంటున్నాయా మాటలు. పదే పదే చివాట్లు పడిన ఈ పెద్ద మనిషి మారలేదు. తాజాగా అసెంబ్లీ సాక్షిగా మరోసారి తన అవివేకాన్ని చాటుకున్నాడు. ఈ సర్కార్ రైతులకు వ్యతిరేకం అని ఇంకా గట్టిగా ముద్రవేసుకునేలా, వారంతా నిర్ణయం తీసుకునేలా ఆయన మాటలు ఇవాళా సాగాయి. వాటికి అడ్డుకట్ట పడలేదు. పడేదెన్నడో..? బహుశా ఆ ఫోర్ట్ ఫోలియో నుంచి తప్పిస్తే గానీ రేవంత్ సర్కార్కు కాస్త ఊపిరి తీసుకునే చాన్స్ దొరుకుతుందేమో.
రైతులు క్షమించి వదిలేస్తారేమో. సరే, అదంతా వారిష్టం గానీ ఇప్పుడు చెప్పొచ్చేదేమిటంటే… మొన్న రైతుపండుగ అని మహబూబ్నగర్లో ఆడంబరంగా కార్యక్రమాలు నిర్వహించి ఆ వేదిక ద్వారా సన్నవడ్లకు బోనస్ ఇస్తున్నాం కదా..ఇక రైతు భరోసా అవసరం లేదనుకుంటా..! రైతులు కూడా ఇదే అనుకుంటున్నారు..! అనేశాడు. సర్కార్పై రైతు భరోసా భారమే సుమీ..! అని పనిలో పని రేవంత్ను కూడా కలుపుకున్నాడు. అదేదో రేవంత్ సర్కార్కు తాను పెద్ద మేలు చేస్తున్నట్టుగా. ఇది సర్కార్ తిరిగి మంచిగానే దెబ్బ కొట్టింది.
వెంటనే తేరుకున్న రేవంత్ ఆ తరువాత రైతు భరోసా సంక్రాంతి తరువాత ఇస్తామని ఆ తప్పును చక్కిదిద్దే ప్రయత్నం చేశాడు. ఇవాళ మళ్లీ ఆ తేనే తుట్టెను కుదిపాడు. కదిపాడు. కందిరీగలతో కాటేయించుకున్నాడు. రేవంత్ సర్కార్కూ కాటు వేయించాడు.
అదేమంటే.. ఇంకా తాము రైతు భరోసాపై క్లారిటీకి రాలేదట. ప్రతిపక్షాలే దీనిపై తాత్సారం చేస్తున్నాయట.ఏం చెప్పడం లేదట. వాళ్లు చెప్పేదేముంది..? మీరే అంటున్నారుగా రాళ్లకు రప్పలకు .. రాజీవ్ రహదారికీ ఇస్తున్నారని, మరి వేటికివ్వాలో, ఎంతివ్వాలో.. ఎన్ని ఎకరాలకివ్వాలో డిసైడ్ చేయండి. జిల్లాల వారీగా మీటింగులు కూడా మమ అనిపించేశారుగా. ఇంకా ఎన్ని రోజులు సాగదీస్తారు…? నిజం చెప్పొద్దు… ఆ శాఖ, ఆ శాఖ మంత్రి… పూర్తిగా రైతు విరోధిలాగే ఉన్నాడు సుమీ..!