వాస్తవం ప్రతినిధి – నిజామాబాద్:
ఎమ్మెల్సీ కవితను నిజామాబాద్ కాంగ్రెస్ పెద్దలు టార్గెట్ చేశారు. నగరంలోని చిన్న స్థల వివాదాన్ని బూచిగా చూపి ఆమె మామ రాంకిషన్రావుపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసును నమోదు చేయించారు. దీని వెనుక కాంగ్రెస్ నాయకులు ఉన్నారు. మామను ఇరకాటంలో పెట్టడం ద్వారా కవితను రాజకీయంగా ఇబ్బందులకు గురిచేసే ఎత్తుగడ పక్కాగా సక్సెస్ చేశారు. ఇప్పటికే ఆమె ఇందూరులో కనిపించడం లేదంటూ పోలీసులకు ఫిర్యాదు చేసిన కాంగ్రెస్ నాయకులు.. ఇప్పుడు ఈ స్థల వివాదంలో ఆమె మామను ముందర పెట్టి కవితను లాగుతున్నారు.
ఆమె అప్పటికే దీంతో మాకెలాంటి సంబంధంలేదు. అది రోడ్డు కాదు… మా స్థలం అంటూ ప్రెస్ నోట్ రిలీజ్ చేసింది. ఇది మరింత వివాదానికి తెర తీసింది. ఆరు ఫీట్ల జాగా వదిలినా ఈ వివాదానికి తెరపడేది. కానీ అలా వదలకుండా ఈ స్థలమంతా మాదే అంటూ ప్రకటనలు ఇవ్వడం మూలంగా ఓ ఎస్సీ కాంగ్రెస్ నాయకుడిని ముందు పెట్టి అట్రాసిటీ కేసు నమోదు చేయించారు. ఇప్పడిది ఇందూరు రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది.