(దండుగుల శ్రీనివాస్)
రైతు కేంద్రంగా రాజకీయాలు నడుపుతూ అధికారంలోకి వచ్చిన బీఆరెస్ , కాంగ్రెస్ రెండూ ఒక్కతాను ముక్కలేనని తేలిపోయింది. రైతుబంధు పేరుతో రాళ్లకు రప్పలకు ఎడాపెడా ప్రజల సొమ్మును దారాదత్తం చేసిన కేసీఆర్.. ఆ తరువాత రుణమాఫీ విషయంలో రైతులను మోసం చేశాడు. తొలిసారి లక్ష రుణమాఫీ మంచిగనే చేసినా.. రెండోసారి మాత్రం ఇక తాను తప్ప రైతులకు మరే దిక్కూ లేదనుకున్నాడు. లక్ష రుణమాఫీని నాలుగు విడతలన్నాడు. మూడు విడతలు కూడా సరిగ్గా వేయలేదు. ఎన్నికల్లో రైతు దెబ్బ రుచి చూశాడు. ఇప్పుడు రేవంత్ సర్కార్ కూడా అదే బాటలో పోతున్నది. 31వేల కోట్లన్నది. 40 లక్షల మంది రైతుల లెక్క చెప్పింది. కానీ చేసింది సగం కూడా లేదు.
17వేల కోట్లు చేసి రుణమాఫీ పూర్తయ్యిందని చెప్పేసింది. నిజానికి వారి దృష్టిలో రుణమాఫీ అయినట్టే. ఎందుకంటే నిబంధనలు వర్తిస్తాయనే విషయం అప్పుడు చెప్పలేదు. కానీ చేసి చూపించారు. కేవలం రేషన్కార్డు ఉన్న వారికి మాత్రమే రుణమాఫీ జరిగింది. మిగిలిన వారికి ఇచ్చేలా లేరు. సర్వే పేరుతో కాలయాపనే జరుగుతున్నది. రైతు భరోసా కూడా మాఫీ జరిగిన తర్వాతే ఇస్తామని మెలిక పెట్టి ఇదీ అదీ రెండూ మరింత ఆలస్యం చేస్తూ పూటగడుపుకోవాలని చూస్తున్నది సర్కార్. మీరు చెప్పిందొకటి చేసిందొకటని బీఆరెస్ విమర్శిస్తుంటే.. మీరేం చేశారు.. లక్ష కూడా సరిగ్గా చేయలేక చతికిలబడ్డారు. ఒకేసారి మేము 20 లక్షల మంది రైతులకు రుణమాఫీ చేశాం… ఇది కదా రికార్డు అని జబ్బలు చరుచుకుంటున్నది రేవంత్ సర్కార్. మొత్తానికి ఈ ఇద్దరూ కలసి రైతుల జీవితాలతో ఆడుకున్నది, ఆడుకుంటున్నది మాత్రం వాస్తవం.