దండుగుల శ్రీనివాస్ – వాస్తవం చీఫ్ బ్యూరో:
కలెక్టర్ కొరఢా ఝళిపించారు. యాక్షన్ స్టార్ట్ చేశారు. ప్రైవేటు దోపిడిపై వేటు వేయడం మొదలైంది. ఇక వేట కొనసాగుతున్నది. ఒక్కొక్కరుగా కలుగులోంచి ఎలుకల్లా ఈ ఆపరేషన్లో సర్జరీ చేసేలా కలెక్టర్ సీరియస్ యాక్షన్ తీసుకున్నారు. తొలత వేటు పడింది షాహిన్ మీద. అకారణంగా, వైద్యుల నిర్లక్ష్యం కారణంగా ఓ మహిళ గర్భాశయం తొలగించేలా చేసిన షాహిన్ ఆస్పత్రిపై వేటు పడింది. ఈ దవాఖానలో సేవలను నిలిపేయాల్సిందిగా కలెక్టర్ రాజీవ్గాంధీ హన్మంతు జిల్లా వైద్యారోగ్యశాఖాధికారి తుకారం రాథోడ్ను ఆదేశించారు. వెంటనే చర్యలకు ఉపక్రమించారు డీఎంహెచ్వో తుకారం.
ఎక్స్పర్ట్ కమిటీ పూర్తిస్థాయి నివేదిక అందగానే దీనిపై ఇంకా తదుపరి చర్యలుంటాయని అధికారి తెలిపారు. మరోవైపు నగరంలోని ఎల్లమ్మగుట్టలో గల మెడికవర్ ఆస్పత్రిలో యువకుడు చనిపోయాడనే ఆరోపణలను ఎదుర్కొంటున్న విచారణ కూడా ఓ కొలక్కిరానుంది. తొలత కలెక్టర్ షాహిన్ ఆస్పత్రితో చర్యలు మొదలు పెట్టారు. ఇక వరుసపెట్టి దగాఖానాలపై సీరియస్ నజర్ పెట్టనున్నారు. జిల్లా వైద్యారోగ్యశాఖ ను కూడా గాడిలో పెట్టే పనిలో పడ్డారు కలెక్టర్. డీఎంహెచ్వో కార్యాలయంలో అనిల్ అనే ఉద్యోగి ముత్యం అనే మరో అటెండర్ వద్ద సర్వీస్కు సంబంధించిన విషయంలో డబ్బులు తీసుకున్నాడు.
దీనిపై విచారణ కొనసాగుతున్నది. ఇవాళ అనిల్ను సస్పెండ్ చేస్తూ కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో అక్రమార్కుల్లో వణుకుమొదలైంది. వైద్యరంగానికి సోకిన అవినీతి, నిర్లక్ష్యం అనే అంటురోగానికి కలెక్టర్ చికిత్స ప్రారంభించారు.