మునుగోడులో టీఆరెస్ విజయం ఖాయంగా ముందే ఊహించింది. దీనిపై గులాబీ బాస్కు క్లారిటీ ఉంది. కానీ గెలుపు గెలుపులా ఉండొద్దు.. భారీ మెజారిటీ ఉండాలనుకున్నాడు. అదే దిశగా ఎత్తుకు పై ఎత్తులు, వ్యూహాలు, చేరికలు.. ఇవన్నీ క్రమబద్దంగా జరిగాయి. ఇన్చార్జిల నియామకం, పోల్ మేనేజ్మెంట్… అంతా అంతా బాగా కవర్ చేశారు. ఎక్కడా తగ్గేదేలే అన్నట్టుగా పక్కా ప్లానింగ్. అనుకున్నది అనుకున్నట్టు జరిగితే….. 20వేల మెజారిటీ వస్తుంది. అంతే. అంతకు మించి తగ్గదు. ఇదీ టీఆరెస్ లెక్క. పోలింగ్ ముగియగానే సీఎం కేసీఆర్ ప్రెస్మీట్ పెట్టిన తర్వాత మీడియాకు భోజనం ఏర్పాటు చేయించాడు హరీశ్రావు. అక్కడ మీడియాతో ఆయన చిట్చాట్గా మాట్లాడాడు.
కనీసం 20వేల మెజారిటీ వస్తుందనుకుంటున్నాం…. మధ్యాహ్నం తర్వాత యూత్ ఓట్లు పడ్డాయి. అవన్నీ టీఆరెస్కే అయితే 50వేల మెజారిటీ ఖాయమని అన్నాడు. దీంతో టీఆరెస్ మెజారిటీ పై ఇంకా హైప్ పెరిగింది. కచ్చితంగా 20వేలకు పైగా మెజారిటీ వస్తుందని మీడియా భావించింది. ఎగ్జిట్ పోల్స్ కూడా 20 శాతం పైగా టీఆరెస్కు ఎడ్జ్ చూపాయి. దీంతో దాదాపు టీఆరెస్ విజయం లెక్కింపుకు ముందే ఖాయమైంది. కానీ మెజారిటీపైనే టెన్సన్ కొనసాగింది. కానీ, చివరకు అనుకున్న అంచనాలు తలకిందులయ్యాయి. 10వేల ఓట్ల మెజారిటీతో టీఆరెస్ సరిపెట్టుకుంది. దీని ప్రధాన కారణం… యూత్ ఓట్లు టీఆరెస్కు పడకపోవడమే. హరీశ్రావే ఈ మాట అనడంతో దాదాపుగా మీడియా ఈ లెక్కకు వచ్చింది. యువత మొత్తం బీజేపీ వైపే వెళ్లింది. దీన్ని టీఆరెస్ పై వ్యతిరేకత అనాలా..? బీజేపీ వైపు మొగ్గు అనాలా..? రాజగోపాల్ రెడ్డి వ్యక్తిగత ఓటు అనాలా..? ఇదీ తేలాలి. టీఆరెస్ దీనిపై లోతుగా విళ్లేషణ చేయాలి. రానున్న కాలంలో దీన్ని సరిదద్దుకోకపోతే నష్టం చవిచూడాల్సి వస్తుంది.