అబ్బ నా ఓటు మునుగోడులో ఉంటే ఎంత బాగుండు..!
ఈసారి పట్నంలకెల్లి, పల్లెకు ఓటు మార్చుకుంటాం.. బాసు… ఇక్కడ ఎవడూ సరిగా పట్టించుకోడు… ఊర్లళ్లనైతే బస్సు చార్జిలు ఇచ్చి మరీ రప్పించుకుంటారు. ఓటుకింతస్తరు. మంచిగా అర్సుకుంటరు….
ఇప్పుడు మునుగోడు తప్ప మిగిలిన చోట చాలా మటుకు ఇలాంటి ఓపినియన్లు వినిపిస్తున్నాయి. మనుగోడు ఓటర్లపై ఈర్ష్య కూడా కలుగుతుంది ఇసుమంత. మరి అంతలా అక్కడ ఖర్చు పెడుతున్నారట మన నేతలు. ఓటుకింత అని రోజు రోజుకు ప్రచారాలు చక్కర్లు కొడుతుంటే.. అయ్యో మనం అక్కడ లేమే అని తెగ బాధపడుతున్నారట కూడా. బంగారం ఇస్తున్నారట కదా.. అదే.. ఇంటికి తులం అంట. కార్లు , బైకులు పంచుతారంట కదా.. ఓటుకు ముప్పై వేలు కాదట.. నలభై అంట కదా… తాగినంత తాపిస్తున్నారంట కదా.. ఓ మీటింగుకు పోతే వెయ్యికి పైగా ఇస్తున్నారంట కదా… ఇవే మాటలు. ఇవే చర్చలు. ఏ నలుగురు కలిసినా మునుగోడు ముచ్చట. ఇగో కార్టూన్లు, జోక్లు, వ్యంగ్యాస్త్రాలు .. అన్నీ సంధిస్తున్నారు.
ఇప్పుడు రాజకీయం అంతా మునుగోడులోనే ఉంది. నేతలంతా అక్కడే ఉన్నారు. పరిపాలన గురించి ఇప్పుడడుగొద్దు. ఫలితం వచ్చే దాకా ఓపిక పట్టండి. అక్కడ అంతలా జీవన్మరణ సమస్యలా ఉంది మరి మన పార్టీలకు, నేతలకు. అందుకే ఓ ఓటుకు, ఆ ఓటర్లకు అంత విలువ, అంత డిమాండ్, అంత గిరాకీ, అంత మజా, అంత ..అంత… అంత…. అంతా వాళ్లకే. మనం చూడాలంతే… కళ్ల మంటల తో .. కడుపుమంటలతో.. ఈర్ష్యా అసూయల తో….
