ప్ర‌ముఖ జాన‌ప‌ద క‌ళాకారుడు, తెలంగాణ ఉద్య‌మ‌కారుడు జంగ్ ప్ర‌హ్లాద్ నిన్న ఉద‌యం జ‌గ‌ద్గిరి గుట్ట‌లో జ‌రిగిన రోడ్డు ప్ర‌మాదంలో తీవ్రంగా గాయ‌ప‌డ్డాడు. మొద‌ట ప్రైవేటు ఆస్ప‌త్రిలో చేర్పించారు. ఆ త‌ర్వాత ప‌రిస్థితి సీరియ‌స్‌గా ఉండ‌టంతో రాత్రే నిమ్స్‌కు తీసుకువ‌చ్చారు. అబ్జ‌ర్వేష‌న్లోనే ఉంచారు. ఉద‌యం అడ్మిట్ చేసుకున్నారు. ప్ర‌స్తుతం ఈ స‌మ‌యానికీ ఆయ‌న వెంటిలేట‌ర్ పై కొన ఊపిరితో ఉన్నాడు. కానీ ఉద‌యం ప‌ది గంట‌ల నుంచి ఆయ‌న చ‌నిపోయాడంటూ సోష‌ల్ మీడియాలో సంతాప ప్ర‌క‌ట‌న‌లు వెల్లువ‌లా వ‌చ్చేస్తున్నాయి.

ఎవ‌రికి వారు సంతాప ప్ర‌క‌ట‌న ఒక‌టి ఇచ్చేసి చేతులు దులుపుకున్నారే త‌ప్ప‌.. ఆయ‌న ఎలా ఉన్నాడు…? అని ఆరా తీయ‌డంతో విఫ‌ల‌మ‌య్యారు. నిమ్స్ వైద్యులు కూడా ఈ విష‌యంపై ఎవ‌రూ క్లారిటీ ఇవ్వ‌క‌పోవ‌డంతో ఎవ‌రికి వారే చ‌నిపోయాడంటూ ధ్రువీక‌రించేసుకున్నారు. మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు కూడా సంతాపం తెలిపి.. ఆ త‌ర్వాత నాలుక్క‌ర్చుకుని మూడు గంట‌ల త‌ర్వాత మ‌ళ్లీ ఆయ‌న‌కు మెరుగైన చికిత్స అందించాల‌ని కోరుతూ మ‌రో మెసేజ్ పెట్టాడు. ఇంకా చాలా మంది పెద్ద‌లు, ఉద్య‌మ‌కారులు జంగ్ ప్ర‌హ్లాద్‌కు అప్పుడే నివాళుల‌ర్పించేశారు.