ర్యాంకుల మోతతో మాదంటే మాది.. మాకంటే మాకు.. అని ఊదరగొట్టి తల్లిదండ్రులను బుట్టలో వేసుకొని పిల్లల చదువులే వ్యాపారంగా మలుచుకుని కోట్లకు ఎదిగాయి నారాయణ, చైతన్యల లాంటి కార్పొరేట్ విద్యాసంస్థలు. రోజులు మారుతున్నాయి. నమ్మకం పోతోంది. కానీ కనికట్టు చేయాలి. ఎలా పేపర్లలో లక్షల్లో ప్రకటనల రూపంలో. చానళ్లలో ఒకటి.. ఒకటి.. రెండు.. రెండూ అని మోత మోగించాలి. మరి ర్యాంకులు రాకపోతే..రాని ర్యాంకులు వచ్చినయి అని చెప్పాలి. అడిగేవాడెవడు? తాటికాయంత అక్షరాలతో ఒకటో ర్యాంకు అని చెప్పుకోవాలి. ఆ తర్వాత సవరణ కింద చిన్నగా ఎక్కడో అక్కడ.. ఇది తప్పు పడింది. వాస్తవంగా అది 12 వ ర్యాంకు గమనించగలరు.. అని చెప్పి సర్దుబాటు చేయాలి. తప్పును సమర్థించుకోవాలి. తల్లిదండ్రుల చెవిలో కాలిఫ్లవర్ పెట్టాలి. కోట్లు గడించాలి.