రేవంత్ రెడ్డి పీసీసీ చీఫ్ అయిన తర్వాత తొలిసారిగా పెట్టిన ఇంద్రవెల్లి దళిత దండోరా వేదికగా చేసిన గర్జన ఆ పార్టీ క్యాడర్లో కొత్త ఊపును తెచ్చింది. కేసీఆర్ దళితబంధు ద్వారా దళితులకు దగ్గరయ్యేందుకు ప్రయత్నం చేస్తున్న తరుణంలో రేవంత్ సైతం దళిత, గిరిజనుల ఆత్మగౌరవం పేరుతో దళిత దండోరా వేదికగా ఏర్పాటు చేసుకున్న భారీ బహిరంగ సభ ఆ పార్టీకి మైలేజ్ ఇచ్చింది. పార్టీ క్యాడర్, కింది స్థాయి కార్యకర్తల్లో ఒక భరోసాను, ధీమాను కల్పించేందుకు రేవంత్ ప్రసంగంలో ఎక్కువ ప్రయార్టీ ఇచ్చాడు. తనదైన శైలిలో కేసీఆర్ ప్రభుత్వం, ఆయన కుటుంబం పై విరుచుకుపడ్డ రేవంత్ తన తరహా పంచులతో ప్రసంగించి ఆకట్టుకున్నాడు. మధ్య మధ్యలో సినిమా డైలాగులు కూడా కొట్టాడు.
నిన్నట్నుంచి ఒక లెక్క… ఇయాల్టి నుంచి ఒకలెక్క… అంటూ వాడిన సినిమా డైలాగ్కు సభికుల నుంచి విశేష స్పందన లభించింది. కేసీఆర్ను బొందపెడతా, ప్రభాకర్రావును విదేశాలకు వెళ్లినా వదలను… ఇంద్రవెల్లికి తీసుకువచ్చి మోకాళ్ల పై కూర్చోబెడుతా. ఇది రావుల రాజ్యం. దళిత బహుజనుల రాజ్యం కావాలి. వస్తుంది అంటూ చేసిన పంచులతో కూడిన ప్రసంగం క్యాడర్లో జోష్ తెచ్చింది. మళ్లీ ఈ నెల 18న ఇదే తరహా భారీ సభ ఇబ్రహీంపట్నంలో ఉంటుందని రేవంత్ అనౌన్స్ చేశాడు.
పార్టీ క్యాడర్ భయపడి పారిపోకుండా, అధికార పార్టీ ప్రలోభాలు, ప్రయోగాలు, బలవంతానికి లొంగకుండా ఉండేందుకు తను వారికి వెన్నుదన్నుగా నిలుస్తానని, ప్రతీ గడప తొక్కుతానని భరోసా నింపే ప్రయత్నం చేశాడు. ఇప్పుడు కష్ట పడండి. అధికారం వచ్చిన తర్వాత అంతకు పదింతలు మీకు మేలు జరిగేలా నేను చూసుకుంటానంటూ భవిష్యత్తు పై ఆశ కల్పించే ప్రయత్నం చేశాడు. భవిష్యత్ కాంగ్రెస్ దే అని చెప్పేందుకు దాని కోసం సమిష్ఠిగా ప్రభుత్వం పై కొట్లాడాల్సిన అనివార్యతను వారికి అర్థమయ్యేల చెప్పాడు.
