శాస్త్ర, సాంకేతిక రంగాల్లో అభివృద్ధి పథంలో దూసుకెళ్తున్న ప్రస్తుత తరుణంలో వ్యవసాయరంగంలో కూడా పెను మార్పులు సంభవిస్తున్నాయి. నూతన సంస్కరణలతో కొంగొత్త విధానాల సాగుకు రైతులు మొగ్గు చూపుతున్నారు. అధునాతన వ్యవసాయ సాగు విధానాలను అలవాటు చేసుకుంటున్నారు. మార్కెట్లో వస్తున్న పెనుమార్పులకనుగుణంగా తమను తాము మలుచుకుంటున్నారు. సులువైన, భారం లేని సాగు పద్దతుల వైపు దృష్టి సారిస్తున్నారు.
ఒకప్పుడు ఎడ్లతో చేసే వ్యవసాయం క్రమంగా మారుతూ వచ్చింది. స్మార్ట్ వర్క్ లాగా వ్యవసాయమూ స్మార్ట్గా మారుతోంది. యాంత్రీకరణ శాతం పెరిగిపోతున్నది. సులువుగా, తక్కువ సమయంలో ఎక్కువ లాభం వచ్చే పద్దతులను అవలంభిస్తున్నారు. ఎడ్లతో దుక్కి దున్నే పద్దతులు మరిచిపోయి చాలా రోజులైంది. యాంత్రీకరణ ప్రవేశంతో వ్యవసాయ రంగంలో పెను మార్పులు వచ్చాయి. ట్రాక్టర్లతో వ్యవసాయం కొత్త పుంతలు తొక్కింది. ఇప్పడు అదీ భారంగానే మారింది రైతన్నకు. పెరిగిన డిజీల్ ఖర్చులకు తోడు.. ట్రాక్టర్ భారం కూడా ఒక్కోక్కప్పుడు నష్టాల వైపు నెడుతున్నది. ఇంకా స్మార్ట్ వ్యవసాయ సాగు పద్దతులు మార్కెట్లోకి వస్తున్నాయి. వాటినీ వెంటనే అందిపుచ్చుకుంటున్నారు రైతులు.
పవర్ వీడర్ పేరుతో మార్కెట్లోకి వచ్చిన ఈ చిన్నపాటి యంత్రం సాగును చకా చకా పూర్తి చేస్తున్నది. తక్కువ ఖర్చుతో ఎక్కువ ఈ పనులు జరుగుతున్నాయి. దమ్ము కొట్టడం, పొలం దున్నడం, పత్తిలో అంతరకుషి చేయడం, కేజ్ వీల్ తిప్పడం, కోతలు కోయడం అంతా దీని ద్వారానే చేసుకుంటున్నారు. 50వేల రూపాయల వరకు మార్కెట్లో దీని ధర ఉంది. మరికొన్ని వ్యవసాయ పనిముట్ల కోసం మరో 25వేల ఖర్చు వస్తుంది. ఒక గంటకు ఒక లీటర్ డీజీల్ ఖర్చు అవుతున్నది. దీనిపై ఇంకా రైతుల్లో సగం మందికే అవగాహన ఉంది. నిజామాబాద్లో 50 శాతం మంది వరకు దీనిని ఉపయోగిస్తుండగా.. నిర్మల్ తదితర మారమూల ప్రాంతాల్లో 25 శాతం వినియోగిస్తున్నారు.
దీనిపై ఇంకా అవగాహన పెంచాల్సి ఉంది. 2 నుంచి 10 ఎకరాలలోపు వ్యవసాయభూములున్న రైతులకు ఇది వరంలా మారింది. సులభంగా, ఆడుతూ పాడుతూ వ్యవసాయం చేసుకుంటున్నారు. ప్రభుత్వం యంత్రలక్ష్మి ద్వారా సబ్సిడీ ట్రాక్టర్లు ఇస్తున్నది. కానీ కొంత మందికి ఇది భారంగా మారుతున్నది. మధ్యలో దళారుల కూడా రైతుల వద్ద నుంచి లంచం తీసుకుంటున్నారు. ఈ చిన్న పవర్ వీడర్ తక్కువ ఖర్చుతో రైతుకు ఎక్కువ మేలు చేస్తుందంటున్నారు దీన్ని వాడుతున్న రైతులు.
