టీఆరెస్ పార్టీ మ‌రోసారి అధికారంలోకి రావ‌డానికి ఆస‌రా పింఛ‌న్ ప‌థ‌కం ఎంతో ఉప‌యోగ‌ప‌డింది. ఆ పండుటాకులు, ఆస‌రా లేని జీవులు కేసీఆర్‌కు అండ‌గా నిలిచారు. ఈ విష‌యాన్ని కేసీఆర్ గ‌మ‌నించి మ‌రింత మందికి ఆస‌రా పింఛ‌న్లు అందించేందుకు కొత్త హామీలిచ్చాడు. వృద్ధాప్య పింఛ‌న్‌ను 65 ఏండ్ల నుంచి 57 ఏండ్ల‌కు కుదించాడు. బీడీ పింఛ‌న్ కోసం 2014 ఫిబ్ర‌వ‌రి వ‌ర‌కు ఉన్న క‌టాఫ్ డేట్‌ను తీసేస్తామ‌ని మాటిచ్చాడు. వీటికి సంబంధించిన‌ జీవోలు ఇంకా రాలేదు. కానీ వృద్ధాప్య పింఛ‌న్‌కు త‌గ్గించిన వ‌య‌స్సు ప్ర‌తిపాదిక‌న ఓట‌రు కార్డులో ఉన్న వ‌య‌సును ఆధారం చేసుకొని అర్హులైన వారిని జిల్లాల వారీగా ఎంపిక చేశాడు. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా 7.50 ల‌క్ష‌ల మంది ఈ పింఛ‌న్‌కు అర్హులుగా తేలారు. దీనిపై ఇంకా స‌ర్కార్ ఏటు తెల్చ‌లేదు. 65 ఏండ్ల వృద్ధాప్య పింఛ‌న్‌కు అర్హులైన వారికే మోక్షం దొర‌క‌డం లేదు. దీంతో పాటు బీడీ పింఛ‌న్ కోసం క‌టాఫ్ డేట్ ఎత్తివేయ‌డంతో దీనికి కూడా మొత్తంలో ద‌ర‌ఖాస్తు చేసుకున్నారు. ఇవీ ల‌క్ష వ‌ర‌కు ఉన్నాయి. దాదాపు 8.50 ల‌క్ష‌ల హామీల ఆస‌రా పింఛ‌న్ల‌కు అతీగ‌తీ లేకుండా పోయింది. మ‌రోవైపు అర్హులైన కొత్త వారికే పింఛ‌న్ దిక్కులేదంటే ఇక కొత్త హామీలు అమ‌లు దేవుడెరుగు అంటున్నారు అధికారులు.

ఓ విక‌లాంగుడు పింఛ‌న్ కోసం ద‌ర‌ఖాస్తు చేసుకొని తిరిగి తిరిగి ఆఖ‌రికి చ‌నిపోయాడు. ఇప్పుడ‌త‌ని భార్య వితంతు పింఛ‌న్ కోసం దర‌ఖాస్తు చేసుకున్న‌ది. ఆ పింఛ‌న్ ఎప్పుడొస్తుందోన‌ని ఎదురుచూస్తున్న‌ది.