హుజూరాబాద్ ఉప ఎన్నిక నేపథ్యంలో రాష్ట్ర రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ఈటల రాజేందర్ పై టీఆరెస్ ప్రధాన సెక్షన్స్ నుంచి దాడి పెరుగుతున్నది. ఓ వైపు సోషల్ మీడియాలో తప్పడు వార్తలతో, ప్రచారాలతో ఈటలను ఉక్కిరిబిక్కిరి చేస్తుండగా.. టీఆరెస్ అగ్రనాయకులు సైతం ఈటల పై మాటల దాడికి ఒంటికాలిపై లేస్తున్నారు. ఒకవేళ ఈటల గెలిస్తే ఇజ్జత్ ఖచ్రా అనే భావనలో టీఆరెస్ అధిష్టానం ఉంది. మొన్నటి వరకు ఈటల పై పల్లెత్తు మాట మాట్లాడని కేటీఆర్, హరీశ్రావులు ఇప్పడు విరుచుకు పడుతున్నారు. ఇదే కోవలో మరో ముఖ్యనేత, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్కుమార్ చేరాడు. ముఖ్యమంత్రి పదవిపై ఈటల రాజేందర్ అత్యాశ పడ్డాడని ఆయన వ్యాఖ్యానించాడు. ఇంచుమించు ఇదే మాట మొన్న హరీశ్రావు కూడా అన్నాడు. ఇక్కడే వీరి మాటల పట్ల విశ్వసనీయత లేకుండా పోయింది. అంతా తానై ఓ నియంతలా కేసీఆర్ వ్యవహరిస్తున్న విషయం అందరికీ తెలుసు. ఆయనను కాదని, ఆయన ఉండగా సీఎం కావాలనే ఆశ ఆ పార్టీలో ఎవరికి లేదు. ఆ ఆలోచన రాదు. ఒక్క కేటీఆర్కు తప్ప. కానీ ఇక్కడ ముఖ్య నాయకులంతా కూడబలుకుకొని ఈటల పై బట్టకాల్చి మీదేసే పనిని విజయవంతంగా చేద్దామనుకున్నారు. కానీ వాటిని ప్రజలు నమ్మేలా లేరు. స్వయంగా ఈటలనే చాలా సందర్భాల్లో కేటీఆర్ సీఎం కావాలని ఆకాంక్షించాడు. ఆయన సీఎం అయితే తప్పేంటి? అని మీడియా ముందు కూడా తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. అలాంటిది ఈటల సీఎం కావాలని అత్యాశ పడ్డాడంటూ ఓ తప్పుడు ప్రచారానికి తెర తీయడం ఆ పార్టీ బలహీనతగా చెప్పుకోవాలా? హుజూరాబాద్లో ఈటల ఒడగొట్టేందుకు అన్ని ప్రయోగాలు చేయాలనే ఎత్తుగడా? ఇలాగైతే తప్ప ఈటలను ఢీకొట్టలేమనే నిర్ణయానికి వచ్చారా? ఇంకా మున్ముందు హుజూరాబాద్ ఉప ఎన్నిక రాజకీయాల్లో ఎన్ని చిత్ర విచిత్రాలు, అబద్ద ప్రచారాలు, మాటల దాడులు చూడాల్సి ఉంటుందో.
