తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత కేసీఆర్ అన్న మాట… ఇక ఇది ఉద్యమ పార్టీ కాదు. ఫక్తు రాజకీయ పార్టీ అని. అవును ఆయన ఆనాటి నుంచి ఈనాటి వరకు చెప్పిన మాటకు కట్టుబడి ఉన్నాడు. చెప్పిందే చే్స్తున్నాడు. కానీ చాలా మంది ఇంకా ఉద్యమం .. ఉద్యమకారులం అనే భ్రమలోనే ఉండిపోయారు. తమకు తగిన గుర్తింపు వస్తుందనే ఆశలపల్లకిలోనే ఊరేగుతున్నారు. కానీ కేసీఆర్ ఇప్పడు పార్టీని, ప్రభుత్వాన్నిబలోపేతం చేసే పనిలో ఫక్తు రాజకీయాలు నడుపుతున్నాడు. ఆయన ఏ నిర్ణయం తీసుకున్నా… అది అందులో భాగమయ్యే ఉంటుంది. కానీ ఇది చాలా మందికి నచ్చదు. మొదట జీర్ణం కాదు. కానీ ఆ తర్వాత కేసీఆర్తో రాజీ పడతారు. ఆయన ఆలోచనలకు అన్యపదేశంగా జై కొడతారు. భేష్ అంటారు. దానికి మద్దతు కూడగట్టేందుకు సోషల్ మీడియా వేదికగా అష్టకష్టాలు పడతారు. అభాసుపాలవుతారు. అయినా వెనక్కి తగ్గరు. కేసీఆర్ మాత్రం తనకు కావాల్సింది.. చేయాల్సింది చేస్తూ పోతాడు. తాజాగా తెలంగాణ రైతు బంధు పేరుతో ఒక్కో దళిత కుటుంబానికి పది లక్షల రూపాయల చొప్పున ఆర్థిక సహాయం అందించే పథకాన్ని త్వరలో ఉప ఎన్నిక జరగబోయే హుజురాబాద్ నియోజకవర్గం నుంచి పైలట్ ప్రాజెక్టుగా అమలు చేసేందుకు నిర్ణయం తీసుకున్నారు. దీనిపై మళ్లీ రాజకీయం మొదలైంది. హుజురాబాద్ నుంచే ఈ పథకాన్ని ప్రారంభించాలనే ఆయన ఆలోచనే ఈ పథకం చిత్తశుధ్దిని తెలియజేస్తుందని ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. కానీ ఎవరేం అనుకున్నా కేసీఆర్ తను అనుకున్నది చేస్తాడు. తనకు కావాల్సినది రాబడతాడు. హుజురాబాద్లో ఈటల రాజేందర్కు అన్ని దారులు మూసేశాడు. మానసికంగా, ఆర్థికంగా… దెబ్బతీస్తూ వస్తున్నాడు. తాజాగా దళిత ఓట్లకు గాలం వేసేందుకు దళిత బంధును హుజురాబాద్లో ప్రయోగించేందుకు రెడీ అయ్యాడు. ఎవరెనెప్పుడు రాజకీయాల్లోకి ఆహ్వానించినా.. ఎవరికి ఎప్పుడు పదవులు కట్టబెట్టినా… ఎవరిని ఎప్పుడు నిర్దాక్షిణ్యంగా తీసిపారేసి చావుదెబ్బ కొట్టినా.. ఎవరిని ఎప్పుడు అవమానించి రాజకీయాల్లో ఆత్మహత్యకు పురిగొల్పినా అంతా రాజకీయమే. రాజకీయ లబ్ది కోసమే. టీఆరెస్ బలోపేతం కోసమే. ప్రభుత్వ సుస్థిరత కోసమే. ఫక్తు రాజకీయమంటే ఇదే మరి.
