కేసీఆర్ తీసుకున్న నిర్ణ‌యం కొత్త వివాదానికి తెర‌తీసింది. హుజురాబాద్ ఉప ఎన్నిక‌ను ద్రుష్టిలో పెట్టుకొని ద‌ళిత‌బంధును అక్క‌డే పైల‌ట్ ప్రాజెక్టుగా అమ‌లు చేసేందుకు నిర్ణ‌యం తీసుకోవ‌డం కొత్త చ‌ర్చ‌కు తెర‌లేపింది. ఎమ్మార్పీఎస్ వ్య‌వ‌స్థాప‌క అధ్య‌క్షుడు మంద‌క్రిష్ణ మాదిగ ఈ నిర్ణ‌యాన్ని వ్య‌తిరేకించాడు. ప్ర‌శ్న‌ల వ‌ర్షం కురిపించాడు. ఒక్క హుజురాబాద్‌లోనే ద‌ళిత బంధు కోసం 2వేల కోట్లు ఖ‌ర్చు చేస్తున్నారు… మ‌రి మిగితా నియోజ‌క‌వ‌ర్గాల్లో కూడా ఇలాగే ఖ‌ర్చు పెడ‌తారా? ఇక్క‌డితో ఈ ప‌థ‌కానికి పుల్‌స్టాప్ పెడ‌తారా అని ప్ర‌శ్నించాడు. ఈ నిధులు ఎక్క‌డ నుంచి తెచ్చారో చెప్పాల‌న్నాడు. స‌బ్ ప్లాన్ నిధులు కావ‌ని సీఎం చెప్పిన నేప‌థ్యంలో ఇటీవ‌ల అమ్మిన భూముల వేలం డ‌బ్బులా? ఇంకా ఎక్క‌డ్నుంచైనా తెచ్చారా? అన్న‌ది ప్ర‌జ‌ల‌కు చెప్పాల్సిన అవ‌స‌రం ఉంద‌ని మంద‌క్రిష్ణ డిమాండ్ చేశాడు. మొత్తానికి ఈ ద‌ళిత‌బంధు కొత్త వివాదానికి తెర‌తీసింది. బీసీ బంధు వ‌ద్దా..? బీసీల‌ను ప‌ట్టించుకోవా? ఉన్నప‌ళంగా ద‌ళితుల‌పై ప్రేమెందుకు? ఇలా ఒక్కో సెక్ష‌న్ నుంచి ఒక్కో ర‌క‌మైన కామెంట్లు వ‌స్తున్నాయి. గంప‌గుత్త‌గా ద‌ళితుల ఓట్ల‌ను రాబ‌ట్టుకునేందుకు సీఎం కేసీఆర్ ద‌ళిత‌బంధును హుజురాబాద్‌లో పైల‌ట్ ప్రాజెక్టుగా అమ‌లు చేస్తున్నాడ‌ని మంద‌క్రిష్ణ గ‌ట్టిగానే కౌంట‌ర్ ఇచ్చాడు. కేసీఆర్ ఫ‌క్తు రాజ‌కీయ నిర్ణ‌యాలు ఏదో ఒక చోట వివాదానికి కేంద్ర బిందువ‌వుతూనే ఉంటుంది. ఇవేవి కేసీఆర్ ప‌ట్టించుకోడు. త‌న‌కు కావాల్సింది తాను చేస‌కుంటూ పోతాడు. చివ‌ర‌గా అనుకున్న‌ది సాధించామా? లేదా? అనేదే ఆయ‌న‌కు ముఖ్యం. అనుకున్న‌ది సాధించేవ‌ర‌కు ఆయ‌న త‌న‌దైన రీతిలో ముందుకు పోతానే ఉంటారు. విమ‌ర్శించేవాళ్లు విమ‌ర్శిస్తారు. వ్య‌తిరేకించేవాళ్లు వ్య‌తిరేకిస్తారు. ప్ర‌శ్నించేవాళ్లు ప్ర‌శ్నిస్తారు. చివ‌ర‌కు లొంగిపోయేవాళ్లు లొంగిపోతారు. అంతిమంగా విజ‌యం సాధించామా లేదా అనేదే సీఎం కేసీఆర్ కావాల్సింది.